- సిర్పంగి స్వామి
దళితులకు ప్రభుత్వం సాగుకోసం కేటాయించే భూములు వారి వద్దే ఉండాలి. ఇతరులు కొనుగోలుచేయడం కానీ, ఆక్రమించుకోవడం కానీ నేరమని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా అక్కడి ప్రజాప్రతినిధులకు ఆ భూమిపై కన్ను పడింది. విలువైన భూములు కావడంతో లబ్దిదారులుగా ఉన్న దళితులను నాయనో, భయానో బెదిరించి సొంతం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రియాల్టర్లను రంగంలోకి దింపి ఆ భూమిపైకి దళితులు రాకుండా అడ్డుకున్నారు. భయబ్రాంతులకు గురైన బాధిత దళితులు పోలీసులు, ఉన్నతాధికారులను ఆశ్రయించినా అధికారం పలుకుబడికి తలొగ్గినా అధికార ఘనం బాధితులను పట్టించుకోలేదు. దీంతో బాధితులపై తిరిగి కేసులైన దుస్థితి యాదాద్రి భువనగిరి దాపరించింది.
యాదగిరిగుట్ట మండలం, వంగపల్లి గ్రామానికి చెందిన 52 మంది దళితులకు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. 1999 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చొరవతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సేధ్యానికి ఈ భూమిని పంపిణీ చేశారు. ఈ భూమి సాగుకు నీరు లేకపోవడంతో లబ్దిదారులు సాగు చేయకుండా పడావు పెట్టి ఉంచారు. ఈ భూమిపై కన్నేసిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే, అప్పటి యాదగిరిగుట్ట ఎంపీపీగా ఉన్న గొంగిడి సునీతా మహేందర్రెడ్డి రియాల్టర్లతో చేతులు కలిపి ఆ భూమిని కాజేసేందుకు పథకం పన్నారు. 2005లో కొద్దిమంది లబ్దిదారులకు ఆశ చూపి రూ.2.50లక్షల చొప్పున అరకొర కొందరి మొహాన కొట్టి ఆ భూమిని దోచుకున్నారు. మిగతా వారు అమ్మకపోవడంతో వారిని వివిధ రకాల ప్రలోభాలకు గురిచేసి మిగతా భూమిని కూడా కాజేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్రెడ్డి అనుచరులు సదరు రియాల్టర్ బెదిరింపులకు గురిచేసి లబ్దిదారుల దగ్గర గల పట్టా పుస్తకాలను 2014-15లో గుంజుకున్నారు. కాస్తు కబ్జాతో లబ్దిదారులు ముడుగుల చంద్రయ్య, ముత్యాలు, బూడిద సురేందర్, అండాలు, ప్రమీలతోపాటు 18 మంది 'మా భూమిలో వెంచర్ వేయవద్దని, మా భూమి మాకే కావాలని' భూమి మీదకు పోయారు. దీంతో ఈ 18 మందిపై సదరు వెంచర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. దళితులైన వీరిపై వెంటనే కేసులు ఎత్తివేసి వారి భూములు వారికి దక్కేలా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఈ భూమి విషయంలో దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.
సెల్ : 9848094327
Authorization