ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. ఇందులో ముఖ్యంగా సమాజంలో అన్నింటికీ వెనుకబడి జీవిస్తున్న దళితులకు ఇచ్చిన హామీలు ప్రధానమైనవి. కానీ టీఆర్ఎస్ పాలన దళితులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. దీంతో రెక్కాడితే గాని డొక్కనిండని ఆ వెనుకబడిన తరగతులు తమ గోడుఎవరికి చెప్పుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. 'దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు, వారి పిల్లలకు కేజీ టు పీజీ చదువు ఉచిత విద్య' ఇవన్నీ తమకు లభిస్తాయని ఆశపడ్డారు. అనుకున్నట్టుగానే కొన్ని చోట్ల భూమి పంచుతున్నట్లు కొందరికి పట్టాకాగితాలుకూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ పట్టా సంబంధించిన భూమి ఎక్కడుందో చూపించలేదు. ఇప్పటి వరకు తిరిగి తిరిగి అలిసిపోయిన ఆ దళిత గుండెలకు ఒక్కసారిగా తమ గూడెంలో, తమ కండ్లముందు అధికార పార్టీకి చెందిన మంత్రి కనపడేసరికి పోయిందనుకున్న ప్రాణం లేసొచ్చినట్టైంది. మంత్రిగారి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తే ఇట్టే పరిష్కారమవుతాయనుకున్నారు. కానీ వారు అనుకున్నదొక్కటి, అక్కడ జరిగింది మరోలా ఉండటంతో ఆ బడుగు జీవులు ఆవాక్కై మరింత ఆందోళనలో పడ్డారు. మంత్రి పరిష్కరిస్తారనుకుంటే వారి అనుచరులు భౌతిక దాడులకు దిగి భయబ్రాంతులకు గురి చేయడంతో ఈ ప్రభుత్వం భూపంపిణీ పేరుతో ఆడిందంతా నాటకమని ఇప్పటికి తెలిసొచ్చి లబోదిబోమంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీలో భాగంగా ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, నేలపట్ల గ్రామంలో 2014 ఆగస్టు 15న నాటి ఇన్చార్జి మంత్రి పద్మారావు గౌడ్ చేతుల మీదుగా నేలపట్ల గ్రామానికి చెందిన దుంపల పుష్ప, తుడుం కళ్యాణిలకు మూడు ఎకరాల భూమికి సంబంధించిన భూమి పట్టాలను ఖమ్మం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అందజేశారు. నేటికీ నాలుగున్నర సంవత్సరాలవుతున్నా భూమి మాత్రం చూపలేదు. దీంతో ఎంపికైన లబ్దిదారులు మండల కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. జిల్లాకు వచ్చిన మంత్రులను కలిసేందుకు కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. ఇలా గత నాలుగేండ్లుగా ఆ భూమి జాడ చెప్పేందుకు ఏ దిక్కు లేకుండాపోయింది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో దళితులు ఎదురుచూస్తూ ఉండిపోయారు.
భూమి అడిగిన దళితులపై టీఆర్ఎస్ నాయకుల దాడి
భూమి దక్కలేదని నిరాశతో ఉన్న భూ లబ్దిదారులు పట్టా కాగితాలతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావును దళితులు పట్టాలతో నిరసన తెలిపారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ మంత్రి తుమ్మల కాన్వారుకి ఎదురుగా ఆందోళన చేశారు. సమస్య పరిష్కారానికి దారి చూపుతారనుకున్న మాజీ మంత్రి తుమ్మల తన అనుచరులతో ''భూమి పట్టాలు ఇచ్చారు. భూమి చూపండి'' అని అడిగిన దళితులపై అధికార బలం ఉన్నదన్న అహంకారంతో దాడి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఈ దాడిపై నిరసన వ్యక్తం చేశాయి.
కూసుమంచి మండల కేంద్రం నుండి నేలపట్ల గ్రామానికి దూరం 6.కి.మీ. ఆ గ్రామంలో 350 దళిత కుటుంబాలు ఉన్నాయి. అందులో 29 దళిత కుటుంబాలను (భూమి లేని) మూడు ఎకరాల భూమికి అర్హులుగా ఎంపిక చేశారు. కానీ వారందరిలో డ్రా తీసి ఇద్దరు లబ్దిదారులను మాత్రమే ఎంపిక చేశారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ దశలో కూలాయి. 18 ఇండ్ల నిర్మాణం ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులకు గ్రామం నుండి బస్సు సౌకర్యం కల్పిస్తామని కల్పించలేదు.
భూమి ఇస్తరనే ఆశ చచ్చింది
2014 ఆగస్టులో గ్రామం నుండి 3 ఎకరాల భూమికి నా కుటుంబం ఎంపికైంది. నా భార్య కళ్యాణి పేరుపై పట్టా ఇచ్చారు. కానీ నేటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం భూమి చూపించలేదు. ఇన్నేండ్లుగా తిరుగుతూనే ఉన్నాం. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాష్ట్ర మంత్రికి నా గోడు వెల్లబోసుకుందామని వెళ్తే దళితుడని కూడా భూమి అడిగినందుకు దాడి చేయించారు. ఇక ఈ భూమి వస్తదన్న ఆశ కూడా నాలో చచ్చిపోయింది. ఎప్పటిలాగే కాయాకష్టం చేసుకొని నా కుటుంబాన్ని సాదుకుంటున్నా.
- తుడుం నరేష్ నేలపట్ల లబ్దిదారుడు
దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
తెలంగాణ రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేటికీ రాష్ట్రంలో ఎక్కడా భూమి ఇవ్వలేదు. రాష్ట్రంలో అక్కడక్కడ పట్టా కాగితాలిచ్చి చేతులు దులిపేసుకున్నారు. భూమి అడిగిన దళితులపై టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తున్నారు. అందులో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామమే ప్రత్యక్ష ఉదాహరణ. దళితులపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి.
- కొమ్ము శ్రీను, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు
సెల్ : 919440616618- కర్ణబాబు
Authorization