ఎక్కడైనా తప్పు, నేరం చేసిన వారికి శిక్ష పడుతుంది.. కానీ ఇక్కడ మాత్రం శారీరకంగా, మానసికంగా దెబ్బలు తిని వేధింపులకు గురైన బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. అకారణంగా పోలీసుల దుర్భాషలు, దెబ్బలతో రాత్రంతా ఠాణాలో నరకం అనుభవించిన దంపతులకు న్యాయం జరక్కపోగా వారిపైనే కేసులు బనాయించి కోర్టు, జైలు చుట్టూ తిప్పుతున్నారు. ఈ దారుణానికి గురవుతోంది దళితులు కావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లాలో ఏడాదిన్నరగా ఆ దంపతులు ఈ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెద్దపల్లి జిల్లాలో బొంపల్లికి చెందిన దళితులైన భార్యాభర్తలపై గతేడాది మార్చి నాలుగున ఇద్దరు ఎస్ఐలు అకారణంగా చింత్రహంసలు పెట్టి రాత్రంతా కొట్టారు. మహిళ అని చూడకుండా రాత్రి పోలీసుస్టేషన్లో ఉంచారు. విషయం బయటికి తెలిసి బాధితుల పక్షాన సీపీఐ(ఎం), దళిత, మహిళా సంఘాల నాయకులు ఆందోళన చేయగా, ఇద్దరు ఎస్ఐలపై అప్పటి కలెక్టర్ అలగు వర్షిణి ఆదేశాలతో అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. మొదట విచారణ జరిపిన పోలీసు అధికారులు ఇద్దరు ఎస్ఐలదే తప్పని తేల్చారు. తరువాత వారిది తప్పుకాదని చెబుతూ పోలీసు విధులకు ఆటంకం కలిగించారని బాధితులపైనే కేసులు నమోదు చేశారు. పైగా జైలుకు పంపించారు. ఆ బాధితులు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
పెద్దపల్లి మండలం బొంపల్లికి చెందిన దంపతులు అరికిల్ల శ్యామల, దేవేందర్ గతేడాది మార్చి నాలుగో తేదిన రాత్రి పిల్లలతో కలిసి పొలానికి నీళ్లు పెట్టేందుకు ఆటోలో వెళ్లారు. భర్త ఆటో దిగి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. ఆటుగా వెళ్తున్న ధర్మారం ఎస్ఐ హరిబాబు అక్కడ ఆగి రాత్రి ఇక్కడేం పని అంటూ ప్రశ్నించాడు. మా ఆయన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు.. అని చెబుతున్నా వినలేదు. ఆ సమయంలోనే ఆమె భర్త దేవేందర్ అక్కడకొచ్చి వివరంగా చెప్పిన్నప్పటికీ పట్టించుకోకుండా పెద్దపల్లి పోలీసుస్టేషన్కు (వాస్తవంగా వారుండే ప్రాంతం బసంతనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోనిది) తరలించారు. పెద్దపల్లి ఎస్ఐగా ఉన్న శ్రీనివాస్ కూడా వారిని దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టాడు. విధుల్లో ఉన్న పోలీసులను శ్యామల అసభ్యంగా తిట్టిందని, దురుసుగా ప్రవర్తించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేశారు. దీంతో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దళిత దంపతులపై దాడి ఘటనపై అప్పటి పెద్దపల్లి కలెక్టర్ అలగు వర్షిణి తక్షణమే స్పందించారు. దళిత దంపతులపై అకారణంగా దాడి చేసి, మహిళ అని కూడా చూడకుండా బూతులు మాట్లాడి, కొట్టినందుకు ఇద్దరు ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని అప్పటి రామగుండం సీపీ దుగ్గల్ను ఆదేశించారు. దీంతోపాటు, మానవహక్కుల సంఘానికి, మహిళ కమిషన్కు లేఖలు రాశారు. దీనిపై అప్పటి గోదావరిఖని ఏసీపీ అపూర్వరావును ప్రత్యేక అధికారిగా నియమించి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించారు. వారం రోజులపాటు విచారణ జరిపిన ఏసీపీ మొదటగా ఇద్దరు ఎస్ఐలదే తప్పని తేల్చారు. అందుకు ఇద్దరు ఎస్ఐలపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయించారు. దీంతోపాటు ఇద్దరిని అక్కడి నుండి బదిలీ చేశారు. ఆ సమయంలో శ్యామలపై ఎలాంటి కేసు ఉండదు.. దేవేందర్పై మాత్రమే కేసు ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. దీంతో దేవేందర్ కోర్డుకు హాజరవుతూ వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు. అయితే నెలన్నర క్రితం బాధితుడు దేవేందర్కు పోలీసులు ఫోన్ చేసి ''మీ భార్యపై కేసు నమోదైంది.. విచారణకు పెద్దపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలి, లేకుంటే ఇంటికి వచ్చి అరెస్టు చేస్తాం'' అని చెప్పారు. తన భార్యపై కేసులు లేవని దేవేందర్ వాదించినా వినిపించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కడ శ్యామలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు మూడు రోజులపాటు కరీంనగర్ జైలులో ఉంచారు. అప్పటి నుండి నెలన్నర రోజులుగా వారం వారం కోర్టుకు హారవుతూ వస్తుంది. శ్యామల, దేవేందర్ దంపతులకు ముగ్గురు చిన్న పిల్లలున్నారు. వారిని వదలి శ్యామల జైలు, కోర్టుల చుట్టూ తిరుగుతోంది.
తప్పు చేసిన పోలీసులకు అవార్డులు
దళిత దంపతులైన శ్యామల, దేవేందర్లను అకారణంగా రాత్రి వేళ్లలో బూతులు తిట్టి, కొట్టి, మహిళ అని కూడా చూడకుండా శ్యామలను రాత్రి సమయంలో పోలీసుస్టేషన్లోనే ఉంచిన ఇద్దరు ఎస్ఐలపై మొదట తప్పు అని పోలీసులే తేల్చారు. ఇప్పుడు వారిపై నమోదైన కేసులను తొలగించారు. అదే ఇద్దరు ఎస్ఐలకు ఇటీవల ఆగస్టు 16 ఉత్తమ అవార్డులు వచ్చాయి. తప్పు చేసిన పోలీసులు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు. బాధితులైనా శ్యామల, దేవేందర్లు పిల్లలను వదలిపెట్టి జైలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి.
పోలీసులను కూడా జైలుకు పంపించాలి
మాపైనే దాడి చేసి మమ్మల్నే జైలుకు పంపించారు. మేము ఎలాంటి నేరం చేయకున్నా అక్రమ కేసులు నమోదు చేసి మా కుటుంబాన్ని రోడ్డున పడేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగి ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో హోటల్ పెట్టుకుని జీవిస్తుంటే తిరిగి నాపై పోలీసులు కక్షగట్టి జైలుకు పంపించారు. నా భర్త దేవేందర్ను, నన్ను జైలుకు పంపించినట్టుగా మాపై దాడిచేసిన ఇద్దరు ఎస్ఐలను కూడా జైలుకు పంపించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
- అరికిల్ల శ్యామల, బాధితురాలు
బాధితులను జైలుకు పంపించడం అన్యాయం
రాత్రి పొలానికి వెళ్లిన దళిత దంపతులపై అకారణంగా దాడి చేసిన ఇద్దరు ఎస్ఐలది తప్పని ఏసీపీ విచారణలోనే వెల్లడైంది. వారిపై కేసు కూడా పెట్టారు. కాని ఎటువంటి తప్పు లేని బాధితులపై కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపిస్తున్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఇది దళితులపై జరుగుతున్న వివక్షకు నిదర్శనం. మరోపక్క ఎస్ఐలపై ఉన్న కేసులు కొట్టేశారు. ఇప్పుడు వారు డ్యూటీలు చేసుకుంటున్నారు. వారికి అవార్డులు కూడా అందజేయడం సిగ్గుసేటు.
అశోక్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి
పోలీసుల కుట్రే
దళితులైన శ్యామల, దేవేందర్ను కొట్టిన ఎస్ఐలపై పెట్టిన కేసులు కొట్టేసి, బాధితులపైనే కేసు పెట్టి, జైలుకు పంపడం పోలీసుల కుట్రలో భాగమే. పోలీసులపై కేసులు నమోదు కావడం, బదిలీ చేయడం జరిగిందంటే పోలీసులకు చెడ్డ పేరు వస్తుందనే కారణంతోనే కేసులు కొట్టివేయించారు. దళితులనే కారణంతోనే శ్యామల, దేవేందర్లను జైలుకు పంపించారు. దీన్ని మేం ఖండిస్తున్నారు. శ్యామల కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటాం.
- మామిడిపల్లి బాపన్న, అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
బందెల రాజశేఖర్
సెల్ : 9490099402
Authorization