''రెండున్నరేండ్ల క్రితం కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా అన్ని విధాల అభివృద్ధి చేసి ముందు వరుసలో నిలబెట్టాం. బీడు భూములకు సాగు నీరు మొదలుకుని వృద్ధులకు పింఛన్లు ఇచ్చాం, భూ సమస్యలు పరిష్కారం చేసి రైతు బంధు, బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 100శాతం సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ఫ్రభుత్వం మాదే'' అంటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతుండగా ఓ దళితుడు లేచి ఇలా ప్రశ్నించాడు.
''మాకు ఉన్న రెండు ఎకరాలకు పట్టా ఇవ్వలేదు. బీమా ఏమో కాని రైతు బంధు పథకమే మా దరి చేరలేదు. భూములకు నీళ్లు కూడా మా పొలాలకు రాలేదు. ఇప్పటికి మావి కూలి బతుకులే. 3 ఎకరాల సాగు భూమి దళితులకు శ్మశాన వాటిక ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి''అని మండల కేంద్రానికి చెందిన దళితుడు ఆది శ్రీనివాసులు జూపల్లికి విన్నవించాడు. ఇలా దళితుడు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది అగ్రవర్ణాల చేతిలో ఉన్న బీసీలు దళితుడైన శ్రీనివాసులను చితకబాదారు. దాడి చేసిన వారిలో జెడ్పీటీసీ రాంచంద్రయ్య యాదవ్తోపాటు మరో 10మంది ఉన్నారు. వందల మంది చుట్టుముట్టి దాడి చేస్తుంటే ఊపిరాడక చనిపోతానేమోనన్న భయంతో అక్కడి నుండి తప్పించుకుని పారిపోయాడు.
కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలానికి గత బుధవారం జూపల్లి కృష్ణారావు ప్రచారానికి వచ్చిన సందర్భంగా యువగర్జన పేరుతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లిని దలితులు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక జూపల్లి అనుచరులు ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడ్డారు. వాస్తవాలు చెబితే అంత అక్కసు ఎందుకని కొంతమంది నిలదీస్తున్నా పట్టించుకోకుండా దాడి చేసారు. ''తక్కువ నా కొడుకులు ఎక్కువ మాట్లాడుతున్నరు. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి అంతే తప్ప ఎదురు ప్రశ్నలు వేయవద్దు'' అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దళితులపై విరుచుకు పడ్డారు. అత్యధిక సంఖ్యలో జూపల్లి అనుచరులు ఉండడంతో దళితులు, బలహీనవర్గాల వారు చేసేది లేక వెనుదిరిగి పోయారు. అదే రోజు ''తక్కువ నా కొడుకులు'' అని తిట్టినందుకు దళితులపై దాడి చేసినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని ఎస్సైకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు.
పాన్గల్ మండలంలో మొదటి నుంచి అగ్రకుల పెత్తందార్ల అజమాయిషి కొనసాగుతూ వస్తోంది. ఈ గ్రామంలో మొత్తం జనాభా 6000 మంది ఉంటారు. ఇటీవల పాన్గల్ నుంచి ఓ గ్రామం పంచాయతీగా ఏర్పడడంతో 4500 జనాభా మాత్రమే ఉంది. 2900మంది ఓటర్లున్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, బీసీ, రెడ్లు అధికంగా ఉంటారు. రెడ్లు, బీసీలు గ్రామంలో పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. రెడ్లు వంద మంది దాకా ఉంటారు. నూటికి 70శాతం పైగా భూములు ఈ రెడ్ల చేతుల్లోనే ఉంటాయి. ఇదే గ్రామంలో దళితులు 300 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ ఉంటారు. ఈ భూమి అంతా సర్కారు, పొరంపోగు భూములే. ఏడాది క్రితం జరిగిన సమగ్ర భూ సర్వేలో అనేక మంది దళితులకు భూముల పట్టాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు, బీమా సౌకర్యం అందలేదు. ముఖ్యంగా దత్తత తీసుకున్న ఈ గ్రామంలో దళితులు చనిపోతే కనీసం 6గజాల స్థలం కూడా లేదు. శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని మాటలు చెప్పడం తప్ప హామీ అమలు కాలేదు. ఈ గ్రామంలో 226 మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. 75 కుటుంబాలు సెంటు భూమి లేని వారున్నారు. 30కుటుంబాలకు అసలు ఇండ్లే లేవు. వీరు వేసుకున్న గుడిసెలకు సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు, మరుగుదొడ్లు, మురుగు కాల్వలు వంటివి ఏవీ ఏర్పాటు చేయలేదు. అభివృద్ధిలో ముందు వరుసలో పాన్గల్ మండలం నిలబెట్టామన్నా పాలకుల మాటలు విని జూపల్లి కృష్ణారావును దళితుడు నిలదీసాడు, దీంతో రెచ్చిపోయిన అగ్రవర్ణాల వారు దళితులపై దాడికి ఎగబడ్డారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
పాన్గల్ మండల కేంద్రరలో దళితులపై అగ్రవర్ణాలు దాడి చేసి వారం రోజులు కావస్తున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. దాడి చేసిన రాంచంద్రయ్య యాదవ్తోపాటు మరో 10మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్ ముందు ధర్నా కూడా నిర్వహించారు. కేవీపీఎస్ నాయకులు గంధం భగత్, ఆర్య లక్ష్మయ్య, దశరథం, స్వామి, రవికుమార్, తదితరులు కలిసి ఎస్సైకి ఫిర్యాదు చేసారు. కానీ ఇప్పటి వరకు ఎస్సై ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ గ్రామంలో దళితులపై అనాదిగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏడాది క్రితం ఈ గ్రామానికి ఆమ్లెట్ గ్రామంగా ఉన్న తండాలోని భూములను ప్రభుత్వం అకారణంగా లాక్కుంటే తండావాసులు ధర్నాకు దిగారు. దీనికి అగ్రకులాల వారి అండతోనే పోలీసులు భూములు లాక్కునే ప్రయత్నాలు చేసారని విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. అయినా పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా అమ్రాబాద్ మండలం పదరలో దళితులకు చెందిన 25 ఎకరాల భూమిని అగ్రవర్ణాల వారు పట్టాలు కాకుండా ఆపారు. ఈ భూములు మావేనని అధికారులకు చెప్పడంతో పట్టా నిలిపేసి వీరికి హక్కులు లేకుండా చేసారు. గత 20ఏండ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అధికారులు, పాలకులు పోలీసులు అగ్రవర్ణాల పక్షమే ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి.
నోరెత్తక ముందే దాడి చేసారు
జూపల్లి కృష్ణారావు ప్రసంగిస్తున్న సమయంలో మా భూములకు పట్టాలు ఇవ్వరా? అని అడిగాను తప్ప అతన్ని పల్లెత్తు మాట అనలేదు. మా నాయకున్ని ఎదిరిస్తావా? అంటూ కొంతమంది బీసీ అగ్రవర్ణాల వారు నన్ను చితకబాదారు. ఇదేంటని అడిగితే మమ్మలను ప్రశ్నిస్తే ఎవరికైనా ఇదే గతి అని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. పోలీసులకు పలుమార్లు చెప్పుకున్నా ఏ మాత్రం ప్రయోజనం కలుగలేదు.
- ఆది శ్రీనివాసులు, బాధితుడు, పాన్గల్
ఎరుకలి పరిపూర్ణం
సెల్ : 9490099324
Authorization