గ్రామాల్లో దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. అణగారిన వర్గాల వారు మాట్లాడటమే నేరంగా, ప్రశ్నించడం పాపంగా పరిగణిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి తన నోటి దురుసుకు మరోసారి పని చెప్పారు. ప్రచారంలో డప్పులు కొట్టడానికి పిలుపించుకున్నారు. పనిలోపనిగా తమ గ్రామ సమస్యలపై ప్రశ్నించిన దళితులను కులం పేరుతో భూతులు తిడుతూ దాడులు చేశారు. దీంతో ఆయనతోపాటు మరో 16 మంది టీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండుర్లో ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు. కాగా గ్రామానికి చెందిన అక్కమళ్ల సుధాకర్, అక్కమళ్ల నర్సింలును డప్పులు కొట్టడానికి టీఆర్ఎస్ నాయకులు పిలుపించుకున్నారు. కాగా తాండూర్ నుంచి వెంకంపల్లి గ్రామశివారులోని మంజీరా నది వరకు నూతనంగా నిర్మించిన రోడ్డు నిర్మాణంలో తమ భూములను దౌర్జన్యంగా లాక్కొని, ఇప్పటివరకు భూములకు నష్టపరిహారం కూడా అందించలేదని గ్రామస్తులు, పలువురు దళితులు ప్రచారాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోని అసైన్డ్ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించలేదనీ, గ్రామంలో మరోపార్టీకి చెందిన సర్పంచ్ ఉన్నందున గ్రామానికి ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపిస్తూ ప్రచార రథం ఎదుట బైటాయించారు. రవీందర్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో నాయకులు వారిని పక్కకు తోసేస్తూ ప్రచారానికి వెళ్లారు. అలాగే తాండూర్ గ్రామానికి ఆనుకుని ఉన్న అక్కంపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న సమయంలో గ్రామ యువకులు, ప్రజలు మరోసారి రవీందర్రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఊగిపోయిన రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులపై, దళితులపై దాడులు నిర్వహించారు. వీరిలో డప్పులు కొట్టడానికి పిలిపించిన వారిపై సైతం దాడులు చేశారు. టీఆర్ఎస్ ప్రచారానికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులపై పొడిగుద్దులు గుద్దుతూ, మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. మమ్మల్నే అడ్డుకుంటారా? అంటూ బూతులు తిడుతూ చితకబాదారు. దీంతో డప్పులు కొట్టే దళితులు, మరికొందరి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రవీందర్రెడ్డితో పాటు మరో 16 మంది టీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు నాగిరెడ్డిపేట్ ఎస్ఐ గౌరేందర్ తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఆకిడి రామ్రెడ్డి, చిలుకూరి సురేందర్రెడ్డి, కాశి నారాయణ, గంపల యాదగిరి, గుర్రాల సిద్దయ్య, సంజీవులు, జోడు సాయిలు, పేరుపల్లి విట్టల్, బండ బాబు, భీమ్రెడ్డి, రాంచంద్రారెడ్డి, మునిగిపల్లి పెద్ద సంగయ్య, మధుకర్, బండ రమేష్, చిలుకూరి నరసింహారెడ్డి, పుట్టి సురేందర్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
ఆశయ్య
సెల్ : 9963776768
Authorization