ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, సామాజిక ఆర్థిక సమస్యలను చూసి చలించిపోయిన మానవతామూర్తి జస్టిస్ పున్నయ్య. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఆ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి వాటిని రూపుమాపేందుకుగాను అమూల్యమైన సూచనలు, సిఫార్సులు చేసిన మార్గదర్శి జస్టిస్ పున్నయ్య. ఆయన మరణం ప్రగతిశీల ఉద్యమాలకు తీరని లోటు.
దళిత గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళితులు నిర్వహించిన సర్వేలను, పోరాటాలను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగతాళి చేస్తూ కులవివక్ష లేదని వాదించారు. దళిత, గిరిజన, ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలతో కలసి చేసిన ఐక్య పోరాటాల వల్ల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక జన్మభూమి నిర్వహిస్తామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ఆనాటి ప్రభుత్వం. జస్టిస్ కొత్తపల్లి పున్నయ్యతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.
కమిషన్ నివేదిక రూపకల్పనకు కేవీపీఎస్ అప్పటికే ఇచ్చిన రిపోర్టును దగ్గర పెట్టుకొని చాలా ఓపిగ్గా, నిబద్దతతో రాష్ట్రమంతా పర్యటించి బహిరంగ విచారణ జరుపుతూ పర్యటించారు జస్టిస్ పున్నయ్య. వందలాది మందితో స్వయంగా మాట్లాడారు. 8,311 వినతిపత్రాలు స్వీకరించి అధ్యయనం చేశారు. వివక్ష ఉన్న గ్రామాలలో అదనంగా ఒకరోజు ఉండి పరిశీలన చేసి దళితులను సమీకరించి వారిని చైతన్యవంతులను చేయడమేగాక, వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఆందోళన చేసి దళితులకు ఆత్మగౌరవమంటే ఏమిటో తెలియచేశారు. ఆయనతోపాటు పర్యటించిన వారిలో పాటూరు రామయ్య, బివి.రాఘవులు, బి.వెంకట్, జాన్వెస్లీ తదితరులు ఉన్నారు. నేడు కమిషన్ ఓఎస్డీగా ఉన్న ఆర్.సుబ్బారావు సైతం ఆయనతోపాటు ఉన్నారు. శాస్త్రీయ పద్ధతిలో, సమగ్రంగా రూపొందించిన 2006 పేజీల రిపోర్ట్లో 42 సూచనలు చేస్తూ 1.5.2001న ప్రభుత్వానికి సమర్పించారు. దళితుల అంశంపై నేటికి ప్రామాణికమైన ఏకసభ్య కమిషన్ జస్టిస్ పున్నయ్య కమిషన్. రాష్ట్రంలో కులవివక్ష లేదని వాదించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివేదికను బీరువాలో భద్రపరిచారేగాని చర్యలకు ఎలాంటి చొరవ చూపించలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల వేధింపులపై చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఎస్పీలు ఘటనలు జరిగిన ప్రాంతాల్లో వెంటనే సందర్శించి బాధితులకు న్యాయం చేసేందుకు ఆర్డీవో, డీఎస్పీ స్థాయి అధికారులతో సమగ్ర నివేదిక ద్వారా సహాయం చెయ్యాలని పున్నయ్య ఏకసభ్య కమిషన్ అప్పటి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతేగాక ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చెయ్యాలనీ, దళిత గిరిజనుల భూములు ఆక్రమించడం నేరమనీ, ఓటు హక్కును అడ్డుకోవడం నేరమనీ, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,689 ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఇలా అనేక అంశాలను కూడా సిఫార్సు చేసింది.
అయితే నివేదికను ప్రభుత్వం బయట పెట్టలేదు. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలని మరలా అందరినీ కలుపుకుని కేవీపీఎస్ ఉద్యమాలు చెయ్యగా ప్రభుత్వం దిగివచ్చింది. జీవో నెంబర్ 92 ద్వారా జస్టిస్ పున్నయ్య 42 సిఫార్సులు 18 జీవోలుగా వెలువడ్డాయి. కేవీపీఎస్ ఆ స్ఫూర్తితోనే రాష్ట్రంలో దళిత శ్మశాన సమస్యలపై పోరాడి జీవో నెంబర్ 1235 సాధించింది. దళిత, గిరిజనులవాడల్లో అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సాధించింది. అనేక గ్రామాల్లో కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నిర్మూలనకు కృషి చేసింది.
అయితే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా జస్టిస్ పున్నయ్య చేసిన అనేక కీలకమైన సిఫార్సులను నాటి నుంచి నేటి వరకు ఏ ముఖ్యమంత్రి అమలు చేసిన సందర్భాలు లేవు. దళిత, గిరిజనులపై దాడులు తీవ్రమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సిఫార్సుల అమలు కోసం కృషి చేయడమే మనం జస్టిస్ పున్నయ్యకు అందించే ఘన నివాళి.
అండ్ర మాల్యాద్రి
సెల్ : 9490300366
Authorization