భారతదేశ సమాజంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు. ప్రతి మతంలో ఎన్నో ఆచారాలు ఉన్నట్టే, ప్రతి కులంలో ఎన్నో కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి. వారు చేసే పనిని బట్టి వారి కులం నిర్ణయించబడింది. నేడు ఆ పరిధి దాటి అన్ని రంగాల్లో అన్ని కులాల వారు రాణిస్తున్నా కులం మాత్రం వారికి అలాగే స్థిరపడిపోయింది. ఈ దేశంలో మతం మార్చుకునే స్వేచ్ఛ ఉంది కానీ కులం మార్చుకునే స్వేచ్ఛ మాత్రం లేదు. ఎన్ని అవాంతరాలెదురైనా అదే కులంలో చచ్చేంత వరకు జీవించాలి. అలాగే కులానికో వృత్తి పరిమితమై ఉంది. ఆ కులంలో పుట్టిన వారు ఆడ, మగ తేడా లేకుండా కులవృత్తిని చేసుకొని జీవిస్తారు. ఏ కులానికైనా వృత్తిలో రాణించడం, ఆడ, మగ సమానంగా వృత్తి పనులు చేసుకొని జీవించడం దేశ కుల చరిత్రలో మనకు కనిపిస్తుంది. అయితే అదే కుల వృత్తి పేరుతో ఓ కులం వారు కేవలం ఆడవారికే వృత్తిని ఆపాదించిన ఈ మనువాదులు, ఆ కులం స్త్రీలను శారీరకంగా వాడుకున్నారు. ఈ కులంలో పుట్టిన ఆడవారికే కుల వృత్తి ఉంటుంది. మగవారికి కుల వృత్తిఅంటూ ఏదీ లేకపోవడం గమనించదగిన విషయం. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న ఈ కాలంలోనూ ఈ వృత్తికి బలిపశువులవుతున్న వారే దొమ్మరి కులస్తులు.
యాదగిరి గుట్టకు చెందిన దొమ్మరి కులం వారు అనాధిగా వ్యబిచార వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇది తమ కుల వృత్తి కావడంతో తప్పని పరిస్థితి వారిది. కాదంటే విటుల నుంచి వేధింపులు, బెదిరింపులు పెరుగుతాయి. దీంతో చేసేది లేక ఈ రొంపిలో ఇష్టం లేకున్నా మగ్గిపోతున్నారు. అయితే ఈ వ్యబిచార వృత్తిలో భాగంగా తాగుడుకు అలవాటు పడతారు. దీనికితోడు అనేక రకాల సుఖవ్యాధులకు గురవుతారు. ఇలా ఆ కుటుంబాలలో పదుల సంఖ్యలో మహిళలు సుఖవ్యాధులకు గురై మరణించారు. అప్పటికే చనిపోయిన వారికి పిల్లలు ఉండటంతో వారి బంధువులే ఆ చిన్నారుల ఆలనాపాలన చూసే బాధ్యత తీసుకుంటారు. ఇలా ఎంతోకాలంగా అక్కడ ఎంతోమందికి తల్లిదండ్రులు లేక బతుకీడుస్తున్నారు. కన్న తల్లిదండ్రుల ఆలనాపాలనకు నోచుకోకుండా చిన్నారులు జీవిస్తున్నారు. తమ తల్లిదండ్రులు ఎవరో, వారు ఎందుకు చనిపోయారో తెలియని ఆ పసి హృదయాలను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే.
ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ కులంపై దాడి చేసింది. వ్యబిచారం తప్పు అనే నెపంతో ఏకంగా వారి పిల్లలను వారి నుంచి వేరు చేసింది. పోలీసులు సైతం అత్యుత్సాహంతో దొమ్మరి కులంవారిపై వ్యవహరించిన తీరు, వారిపై దాడి చేసి భయాందోళనకు గురి చేసిన పరిస్థితి చూస్తే అయ్యోపాపం అనకమానరు. తప్పు చేస్తున్నారని భావించిన స్వచ్చంధ సంస్థ, వారు బతికేందుకు ఉపయోగపడే ఇతర అవకాశాలు కల్పించాల్సింది పోయి పోలీసుల సహకారంతో ఆ దొమ్మరి కులం ఇండ్లపై దాడులు చేసి బీభత్సం సృష్టించారు. చిన్న పిల్లలకు ఏడెనిమిది ఏండ్ల వయస్సులోనే ఇంజక్షన్ల ద్వారా అవయవాలు పెరిగేలా మార్చుతున్నారని పుకారు లేపారు. ఆ పిల్లలందరినీ ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చారని మీడియా ద్వారా ప్రచారం చేశారు. చనిపోయిన వారి, తాము కన్న పిల్లలను కూడా అక్కడి నుంచి ఎత్తుకెళ్లి సుదూర ప్రాంతాల్లో దాచేశారు. కనీసం కుటుంబ సభ్యులు చూసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. దొమ్మరి కులస్తుల అందరి ఇండ్లను సీజ్ చేశారు. వారు ఎక్కడ నివాసం ఉంటారనుకున్నారో అర్థం కాని పరిస్థితి. 16 ఇండ్లను సీల్ చేయడంతో ఏ ఆదెరువూ లేనివారంతా నేడు రోడ్లుమీద అక్కడే గుడిసెలు వేసుకొని చలికి గజగజా వణుకుతూ చావలేక బతుకుతున్న పరిస్థితిలా కనిపిస్తుంది.
ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి
వ్యబిచారం చేయాలని తమకు కూడా ఏం లేదనీ, తాము సమాజంలో గౌరవంగా బతకాలని అనుకుంటున్నామని వారు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అందుకు తగిన విధంగా ఆర్థిక సహకారం అందించడంలేదని వారు తమ గోడు వెల్లగక్కుతున్నారు. అన్ని కులాలకు ఏదోరకంగా ఉపాధి చూపిస్తున్నారు, అలాగే తమకు కూడా తగిన ఉపాధి చూపాలని కోరుతున్నారు.
సెల్ : 9666011107
మా ఇండ్లను మాకు అప్పగించాలి
మా ఇండ్లకు తాళాలేశారు. మేం ఎక్కడ ఉండాలి. రోడ్డుమీద చలికి చస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవోలను కలిశాం. కలెక్టర్ ఆర్డీవోను కలవమంటారు, ఆర్డీవో ఎస్పీని కలువమంటారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. మా సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు.
- రాజేశ్వరి
వారంతా మా పిల్లలే
పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లిన వారంతా మా పిల్లలే. వారి పుట్టిన తేది సర్టిఫికెట్స్ కూడా పోలీసులకు ఆధారంగా చూపించార. కానీ పోలీసులు మా కండ్ల ముందే వాటిని చింపేశారు. మేం మా గోడు ఎలా చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా మా మీదే కేసులు నమోదు చేశారు. జైలు శిక్ష కూడా అనుభవించాం. ఇప్పటికైనా మా పిల్లలను మాకు అప్పగించాలి. వారు ఎక్కడ ఉన్నారో సమాధానం చెప్పాలి.
- స్వప్న
కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం
మేము పూర్తిగా వ్యబిచారం మానేశాం. ఇక్కడ వ్యబిచారం పేరుతో ఎవరూ రావద్దని బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. దొరికిన కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం. యాదగిరిగుట్టలో పూలు, , కొబ్బరికాయలు, గాజులు, వేప పుల్లలు వంటి వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తున్నాం. మరికొందరు కిరాణా షాపులు పెట్టుకున్నారు. మగవారు ఆటోలు నడుపుతూ బతుకుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం మా ఇంటి తాళాలు తీసి మా ఆవాసాలను మాకు అప్పగించాలి.
- మంగమ్మ
Authorization