ఓట్ల కోసం వస్తారు. అప్పుడు అడిగనవన్నీ ఇప్పిస్తామని నమ్మ బలుకుతారు. కానీ ఓట్ల పండుగ అయిన తర్వాత మొఖం కూడా చూడరు. నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి, తిరిగి అలసిపోయాను. వాళ్లు ఇక మా లాంటోళ్లకు ఏం చేయరని నా పని నేను చేసుకుంటున్న'' అంటూ ఓ దళిత వృద్ధుడు తన గాధను దీనంగా వెల్లబోకున్నాడు.
హైదరాబాద్ నగరంలోని రామ్నగర్కు చెందిన సీతారామ్ అనే వృద్ధుడు చెప్పులు కుట్టే వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. గత 30 ఏండ్లుగా ఆయన చెప్పులు కుట్టే వృత్తినే నమ్ముకున్నాడు. వృత్తిలో నైపుణ్యంగల ఆయన నేటికీ రోడ్డుపై చిన్న తావు ఏర్పాటు చేసుకుని పని చేసుకుంటున్నాడు.
అయితే ఓ డబ్బాను ఏర్పాటు చేసుకొని అందులో చెప్పుల దుకాణం పెట్టుకుంటే కొంతకాలం వరకు శాశ్వతంగా ఉంటుందని ఆయన భావించాడు. దానికోసం ప్రయత్నం కూడా చేశాడు. కానీ పోలీసులు అడ్డుపడ్డారు. ఇక్కడ డబ్బాకొట్టు పెట్టుకునేందుకు అనుమతి లేదంటూ ఆ బక్క ప్రాణి ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచి వేశారు. దీంతో చేసేది లేక ఒక గూటం, దారం, ఆరె, సన్రాయితోనే పాత చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తున్నాడు. గతంలో ఆయన పెద్దపెద్ద షాపుల్లో చెప్పుల పని చేశాడు. అనుభవంతో అద్భుతమైన చెప్పులు తయారు చేయగలడు. చేస్తున్నాడు కూడా. కానీ ఆయన పని చేస్తున్న చెట్టు తావు వచ్చీపోయే వారికి షాపులా కనిపించకపోవడంతో రాబడి అంతంత మాత్రంగానే ఉంది.
ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం తీసుకొని తన ప్రతిభకు తగ్గట్టు షాపును ఏర్పాటు చేసుకోవాలని భావించాడు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే అధికారుల నుంచి సహకారం కరువైంది. అక్షరజ్ఞానం లేని సీతారామ్ను ఒక సారు ఉంటే మరోసారి కావాలని ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆ తిరుగుడు తమ వల్ల కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎంతో మందికి అనేక రకాలుగా లోన్లు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధి బాటలు వేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు, పాలకులు ఇలాంటి వారికి కాకుండా మరి ఎవరికి ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితిలో తనకు వచ్చే రాబడి అంతంత మాత్రమే కావడంతో తన పిల్లలను కూడా సక్రమంగా చదివించలేకపోయాడు. దీంతో పిల్లలు కూడా తోచిన పని చేసుకుంటూ బతుకుతున్నారు. తన భార్య కూడా పని చేస్తే కాని పూట గడవని పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితులు నేటికీ దళితులు అనేక మంది ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, కమిషన్లు, కార్పొరేషన్లు వీరి దరి చేరడం లేదు. వాటికి కేటాయించే నిధులు ఓ పక్క ఖర్చు కాకుండా కార్పొరేషన్లలో మూలుగుతున్నాయి. మరోపక్క పని నైపుణ్యమున్నా, పని చేయగలిగే శక్తి ఉన్నా అందుకు తగిన సహకారం, ప్రోత్సాహం ప్రభుత్వం నుండి లేకపోవడంతో సీతారామ్ లాంటి వారు ఎందరో తమ బతుకులను దుర్బరంగా గడుపుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం పని చేసుకునే వారికి అన్ని రకాలుగా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. మిగులు నిధులను దారి మళ్లించకుండా రాబోయే బడ్జెట్లో కలిపి కేటాయించాలి. దళితులకు, చిన్న వ్యాపారులు చేసుకునే వారికి సులభంగా రుణాలు లభించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. లోన్ల కోసం వచ్చే వారికి అన్ని రకాలుగా సహకరించేలా, ఆ రకమైన సహకారం పూర్తిస్థాయిలో అధికారుల నుంచి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తరుణ్తేజ.విసెల్ :
8639518341
Authorization