ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం మంత్రాలు, తంత్రాలు అంటూ వెనెక్కి వెళ్లిపోతున్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు మూఢత్వం రాజ్యమేలుతోంది. ఫలితంగా క్షణికావేశాలకు లోనై హత్యలకు తెగిస్తున్నారు. మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా గ్రామాల్లో ఎక్కడో ఎవరినో అనుమానించి ఇరుగు పొరుగువారిపై జరిగేది. ఈ మూఢత్వం ఇప్పుడు సొంత కుటుంబాల్లోనూ చిచ్చుపెడుతోంది. ఈ ఘటనల్లో ఎక్కువగా సమీప బంధువులు, కన్నవారే ఉండడం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో జంగపెల్లి నర్సయ్య- చంద్రవ్య దంపతులు కూలీ నాలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. ఉన్నదాంట్లోనే కలోగంజో తాగి తమ పిల్లలను పెంచి పెద్ద చేశారు. కూతుళ్లకు పెండ్లిలు చేసి అత్తారింటికి పంపించారు. కుమారుడు శ్రీనివాస్కూ పెండ్లి చేశారు. శ్రీనివాస్ ఊపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి వస్తుండేవాడు. నాలుగు నెలల క్రితం గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ్నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కాపురం పెట్టాడు. అయినా ఆరోగ్యం కుదుటప డలేదు. దీంతో పలు ఆస్పత్రుల్లో ఎంఆర్ఐతో పాటు పలు రక్త పరీక్షలు చేయించుకున్నాడు. ఎంతకీ రోగం నయం కాలేదు. ఈనేపథ్యంలో ఊర్లో చంద్రవ్వ మంత్రాలు చేస్తుందని కొందరు పుకారు సృష్టిం చారు. తనకు తనే తల్లే మంత్రాలు చేసిందేమోనని కన్న కొడుకే అనుమానపడేలా భ్రమింపజేశారు. అనుమానం బలపడి తన తల్లే మంత్రాలు చేస్తుందని మానసికంగా వేదనకు గురైన కొడుకు శ్రీనివాస్ కన్నతల్లిపై కక్ష పెంచుకున్నాడు. మంత్రాలకు విరుగుడుగా ఇటీవలే తన స్వగ్రామం విలాసాగర్లోని తన ఇంట్లో తాంత్రిక పూజలు చేయించాడు. అయినా శ్రీనివాస్ మెదడుల్లో నాటుకపోయిన మూఢత్వం వెళ్లకపోగా ఇంకా పెచ్చుమీరింది. రోజు రోజుకూ తల్లిపై పగ పెంచుకు న్నాడే తప్ప తనలోని మృగాన్ని గుర్తించలేకపో యాడు. నవమాసాలు మోసి పెంచిన తల్లినే అంతమొందిస్తే తప్ప తన ఆరోగ్యం బాగుపడదని భావించాడు. తల్లిని చంపేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఈ క్రమంలో గత సోమవారం తన తండ్రి నర్సయ్య కూతురు వద్దకు వెళ్లాడు. ఇంట్లో వంటరిగా నిద్రిస్తున్న జంగపెల్లి చంద్రవ్వను కొడుకు శ్రీనివాస్ ఇదే అదునుగా భావించి గొంతు నులిమి హత్య చేశాడు.
అవగాహన కల్పించని అధికారులు
ప్రతి గ్రామంలోనూ ఇటువంటి మూఢనమ్మకాలను విశ్వసించే జనం ఎక్కువగానే ఉన్నారు. ఎక్కడో ఏ చోటా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గ్రామాలు, పల్లెల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే చాలు తాంత్రిక పూజలు చేస్తున్న సందర్భాలున్నాయి. కుటుంబాలకు మంచి జరగాలని రూ.వేలల్లో ఖర్చు చేస్తుండడం గమనార్హం. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజల్లో పల్లె, పట్టణం తేడా లేకుండా మూడు దారులు కలిసే చోట అర్ధరాత్రి పూజలు చేయడం లాంటివి కన్పిస్తూనే ఉన్నాయి. గతేడాది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో కందుగుల గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని వేధించడంతో ముగ్గురు ప్లిలలకు విషమిచ్చి భార్యాభర్తలు తనువు చాలించారు. అవగాహన కల్పించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నంత కాలం ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని గ్రామాల్లో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
మధు పోకల
సెల్ : 9885519727
Authorization