పచ్చని గ్రామాల్లో కొందరు గ్రామ పెద్దలుగా వ్యహరిస్తూ తీర్పుల పేరుతో అన్యాయాలకు తెగబడుతున్నారు. గ్రామాభివద్ధి కమిటీ (వీడీసీ) పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ చట్టపరంగా ప్రజలకు సంక్రమించిన హక్కులను కాలరాస్తున్నారు. ఇటీవలి కాలంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. నేటి ఆధునిక కాలంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ మిన్నకుండి చోద్యం చూస్తున్నారు. దీంతో గ్రామంలో పెద్దలు చెప్పిందే వేదం, చేసిందే చట్టంగా తయారైంది. చెప్పిన మాట వినని వారిని గ్రామం నుంచి వెలేయడమో లేదా జరిమానా విధించడమో వంటి వికృత చేష్టలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు రివాజుగా మారుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే మెట్పల్లి మండలంలోని వేంపెట్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామాభివద్ధి కమిటీ సభ్యులకు, ఓ భూయజమానికి మధ్య తలెత్తిన భూవివాదం ఆ కుటుంబాన్ని సాముహికంగా వెలియడమే కాకుండా బాధితుడు వేసిన పంటను ధ్వంసం చేసేవరకు వెళ్లింది. మెట్పల్లి మండలం వేంపెట్ రెవెన్యూ గ్రామంలోని తుమ్మల గంగారెడ్డికి వారసత్వంగా సంక్రమించిన సర్వే నెంబర్ 254లోగల 4.29 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి గ్రామానికి చెందినదని గ్రామాభివద్ధి కమిటీ సభ్యులు గతకొంతకాలంగా భూయజమానితో వాదిస్తూ వస్తున్నారు. సదరు భూమి గ్రామానికి అప్పగించాలని వారు గంగారెడ్డిపై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. భూయజమాని తుమ్మల గంగారెడ్డి 1955 సంవత్సరం నుంచి తనకు సదరు భూమి ఎలా సంక్రమించిందో తెలిపే అన్ని ఆధారాలు అతని వద్ద ఉన్నాయి. అన్ని రకాల సాక్ష్యాలు, సంబంధిత పత్రాలు గ్రామాభివద్ధి కమిటీ సభ్యులకి అందించినప్పటికీ, ఆ భూమి గ్రామానికి చెందినదని మెండిగా వాదించారు. అందుకు గల కారణాలను చూపకుండా భూ యజమాని గంగారెడ్డిని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. దీనిపై భూ యజమాని అధికారులకు దరఖాస్తు చేసినప్పటికీ వారి నుంచి ఏవిధమైన స్పందనా రాలేదు. భూమిని గ్రామానికి అప్పగించాలని భూ యజమాని కుటుంబంపై గ్రామ పెద్దలు ఒత్తిడిని తీవ్రతరం చేశారు. దీంతో భూ యజమాని కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్తోపాటు గ్రామాభివద్ధి కమిటీ సభ్యులకు నోటీసులు ఇప్పించారు. ఇలా చేసినందుకు ఆగ్రహోద్రేకులైన వీడీసీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసి, ''గ్రామాభివద్ధి కమిటీ సభ్యులపైనే కేేసు వేస్తారా?'' అంటూ ఆగ్రహించారు. సదరు కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తూ తీర్మానం చేశారు.
గతంలో ఇలాగే...
భూయజమాని అయిన తుమ్మల గంగారెడ్డికి గ్రామాభివృద్ధికి కమిటీ సభ్యుల మధ్య వివాదం ఇప్పుడిది కాదు, కొంత కాలం నుంచి ఈ భూవివాదం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి కమిటీ సభ్యుల మాట వినని కారణంగా గత నవంబర్ 29నే ఆయన కుటుంబాన్ని సామూహికంగా వెలి వేశారు. సదరు భూయజమాని కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని వారు గ్రామస్తులను ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంగించిన వారికి రూ.25 వేల జరిమాన విధించాలని ఏకపక్షంగా ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో గ్రామంలో ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడటం లేదు. ఇలా నెలరోజులు గడిచినప్పటికీ భూ యజమాని తమ దారికి రాలేదని ఉగ్రులైన వీడీసీ పెద్దలు బాధితుడు రెండెకరాల్లో వేసిన మినుము పంటలోకి బర్రెలను తోలి ధ్వంసం చేశారు. దీంతో అతనికి రూ.2 లక్షల మేర పంట నష్టం వాటిల్లింది. దీంతో చేసేదిలేక బాధితుడు మళ్లీ పోలీసులను సంప్రదించి గ్రామాభివద్ధి కమిటీ సభ్యులపై ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై ఎస్సై శంకర్రావును వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామనీ, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనీ వారు తెలిపారు.
తిరుకోవెల వెంకటరమణ
సెల్ : 9652404751
Authorization