అప్పుల బాధలకుతోడు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని మనస్తాపంతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గుంతపల్లి గ్రామానికి చెందిన మందుల నర్సింలు, లక్ష్మిలకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకైన మల్లేశం రోజు వారి కూలీ పనులు చేస్తుంటాడు. తల్లిదండ్రులు రోజు పనికి వెళ్లి ఎంత సంపాదించినా అప్పటికే వారు చేసిన అప్పుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. సంపాదించిన డబ్బులతో వడ్డీలు కడుతూ సాగుతున్న వీరి జీవనంలో మందుల నరసింహులు చిన్న కొడుకు రాజేష్ 2013-15 మధ్యకాలంలో సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకు న్నాడు. దీంతో ఆ కుటుంబంలో ఇంకా అప్పుల కుప్ప పేరుకుపోయింది. ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. తమ్ముడు చనిపోయిన రెండు నెలలకు మందుల మల్లేశం 2015లో పెండ్లి చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో తమ్ముడు చనిపోవడం, తను పెండ్లి చేసుకోవడంతో అప్పులు మరింత పెరిగాయి. దినదినగండంగా బతుకీడుస్తున్న ఆ కుటుంబంలో మరో ప్రమాదం ముంచెత్తింది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లేశంకు యాక్సిడెంట్లో కాలు విరిగిపోయింది. అయితే అతనికి చికిత్స కోసం, హాస్పిటల్ ఖర్చులకు చాలా వరకు డబ్బులు అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో తెలిసినోళ్లందరి వద్ద ప్రాధేయపడినా ఎక్కడా అప్పు పుట్టలేదు. దీంతో మల్లేశం తండ్రి నర్సింలు తనకున్న రెండెకరాల 19 గుంటల భూమి నుండి రెండు ఎకరాలను అమ్మేశాడు. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం హాస్పటల్ ఖర్చులకే సరిపోయాయి. అనంతరం ఆరోగ్యం కుదుటపడిన మల్లేశంకు మొదట కూతురు పుట్టింది. అయితే కొడుకు పుడతాడని ఆశపడిన మల్లేశంకు కూతురు పుట్టడంతో కాస్త నిరాశ చెందాడు. ఆ తర్వాత మల్లేశం గ్రామ సమీపంలో ఉన్న ఓ పరిశ్రమలో కూలీ పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో పనికి రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో ఫైనాన్స్లో ఓ బైక్ కొనుక్కున్నాడు. అయితే రెండు నెలలు ఫైనాన్స్ డబ్బులు బాగానే కట్టాడు. ఆ తర్వాత సకాలంలో డబ్బులు కట్టలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ వాళ్లు ఫోన్ చేసి వేధించారు. ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న మల్లేశంకు రెండో కాన్పులోనూ (గత డిసెంబర్ 9న) మళ్లీ పాప పుట్టింది. దీంతో మళ్లీ పాప పుట్టిందని మదనపడ్డాడు, మానసికంగా కుంగిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల పెండ్లిలు ఎలా చేయాలని రోజూ ఆలోచిస్తూ కూర్చునేవాడు. చేస్తున్న పనిలో ఏకాగ్రత చూపకపోయేవాడు. మరోవైపు అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఈనేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈనెల 8న పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాడు. రాత్రి మద్యం తాగి అందరూ పడుకున్న సమయంలో తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో రోధనలు మిన్నంటాయి. ఆ కుటుంబాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. ఇద్దరు కొడుకులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో మందుల నర్సింలు రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇక ఆ కుటుంబానికి దిక్కే లేకుండా పోయిందనీ, ఆ కుటుంబానికి ఎలాగైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని, ప్రభుత్వం ఏదో విధంగా సహకారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నా కుటుంబం దిక్కులేనిదైంది
ఇద్దరు కొడుకులు చనిపోవడంతో నా కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఇక నా కుటుంబానికి వారసత్వమే లేదు. నా కోడలు ఏ విధంగా బతుకుతుందో ఏమో. నాకున్న 19 గుంటల భూమిలో వర్షాకాల పంటలే తప్ప మిగతా కాలంలో పంటలు పండవు. అప్పులు ఏ విధంగా కట్టాలో అర్థం కావడం లేదు. నా కోడలు పరిస్థితి ఏంటో ఏమో. నా ఇద్దరు మరమరాళ్ల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం కావడం లేదు. నాకు ప్రభుత్వం ఏ విధంగా అయినా ఆర్థిక సహాయం అందించాలి. నా కుటుంబాన్ని ఆదుకోవాలి.
మందుల నర్సింలు, మృతుడి తండ్రి
మల్లేశం కుటుంబాన్ని ఆదుకోవాలి
మందుల నరసింహులు కుటుంబంలో ఇద్దరు కొడుకులు చనిపోవడంతో ఆ కుటుంబం బజారున పడ్డది. ఆ కుటుంబానికి అప్పులు ఎక్కువయ్యాయి. మల్లేశంకు ఇద్దరు కూతుళ్లు పుట్టారని మనస్థాపానికి గురై అతను ఉరి వేసుకుని చనిపోయాడు. మందుల మల్లేశం భార్యకు బయటి పని అసలు తెలియదు. అతని భార్య ఏ విధంగా బతుకుతుందో అర్థం కావడం లేదు. తన ఇద్దరు కూతుళ్లను ఏ విధంగా పెంచి పోషిస్తుంది. ఎన్ని కష్టాలు పడుతుందో ఆలోచిస్తే కండ్లనీళ్లు వస్తున్నాయి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
విజేత, గ్రామ ఆశా కార్యకర్త
జంగిలి భాస్కర్
సెల్ : 9959479375