ఎ.పరిపూర్ణం
దళితులు సర్పంచ్ అయినా... అక్కడ నేలమీద కూర్చోవల్సిందే. మేము చెప్పిన వారికి ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ అక్క గజ్జలమ్మ ఇంటికి ఓడిన సర్పంచు అభ్యర్థి హన్మంత్ వచ్చి ''నీవు నాకు ఓటు వేయలేదు'' అంటూ ఇంటికి తాళం పెట్టాడు. ఓటు వేయకుంటే అప్పు చెల్లించలేదనే కారణం చూపి ఇంటికి తాళం వేశారు. దీంతో పెద్దమనుషుల ముందు పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీలో సర్పంచును కింద కూర్చోబెట్టి పెత్తందారులు మాత్రం కూర్చీలమీద కూర్చున్నారు. ఇదేమి సాంప్రదాయం అంటూ మాజీ సర్పంచు గోవిందుతోపాటు పలువురు నిలదీశారు. ఈగ్రామంలో 50 ఏండ్లుగా రాజరికపుపాలన సాగుతుందనీ, వీరి అరాచకపు ఆగడాలకు అంతూ అదుపు లేకుండా పోయిందని పలువురు దళిత నాయకులు నిలదీస్తున్నారు.
''నేను దళితున్ని.... నాకు ఏమీ తెలియదు. నన్ను సర్పంచ్గా ఆదొరలే నిలబెట్టారు... వారే గెలిపించారు. వారే కుర్చీలో కూర్చుంటారు. వాళ్ల కింద పాలేరుగా పనిచేయడమే నావంతు. నేను 15 ఏండ్లుగా ఈదొరల దగ్గరనే పనిచేస్తున్నాను. నాకెందుకు కుర్చీ. నేను కుర్చీ మీద కూర్చుంటే... నా అప్పు ఎవరు కడతారు...'' అంటు గద్గద స్వరంతో అంటున్నాడు గ్రామ ప్రథమ పౌరుడు.
మహబూబ్నగర్ జిల్లా మద్దూరు గ్రామంలో 50 ఏండ్లుగా రాజరిక పాలన కొనసాగుతోంది. ఇక్కడ అమాయక దళితులు, బీసీలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకొని దొరలు పెత్తనం కొనసాగిస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలో ఈ గ్రామం ఎస్సీ జనరల్గా రిజర్వు అయ్యింది. సర్పంచు అభ్యర్థులుగా బాలప్ప, హన్మంతు, గోవిందు ఎల్లప్ప, ముశలప్పలు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతి అభ్యర్థి వెనక రెడ్ల పాత్ర ఉంది. రాజకీయాలను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి చదువుకున్న ఎస్సీలను వదలి అమాయక వ్యక్తులను నిలబెట్టారు. అయితే ఎలక్షన్లలో బాలప్ప అనే వ్యక్తి విజయం సాధించారు. బాలప్ప అక్క గజ్జలమ్మ భర్త 25 ఏండ్ల క్రితం చనిపోయాడు. ఈమె సర్పంచుగా నిలబడ్డ అభ్యర్థి హన్మంత్కు రూ.3వేల అప్పు ఉంది. ''నాకు అప్పు ఉండి ఓటు వేయలేదనీ, నా అప్పు నాకు చెల్లించాల్సిందే''నంటూ పట్టుబట్టాడు. అప్పు చెల్లించేదాక ఇంటి తాళం తీసేది లేదంటూ... ఇంటికి తాళం వేశాడు. తనకు జరిగిన అవమానాన్ని సర్పంచ్గా గెలిచిన తన అన్న బాలప్పకు విన్నవించుకుంది. తాళం వేసిన నాలుగు రోజుల తర్వాత బాలప్ప పెద్దమనుషులను పిలిచి పంచాయితీ పెట్టాడు. ఈనెల 5న జరిగిన ఈ పంచాయితీలో మణివర్థన్రెడ్డి ఉప సర్పంచ్, జనార్దన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, బాల్రెడ్డి, పాపిరెడ్డి తదితరులు ఉన్నారు. వారంతా కూర్చీలో కూర్చున్నారు. సర్పంచు బాలప్ప మాత్రం నేలమీదనే కూర్చున్నాడు. పంచాయతీ కార్యాయలంలో కూర్చీలున్నా... రెడ్లు గానీ, ఇటు గ్రామసేవకుడు గానీ సర్పంచుకు కుర్చీ వేయలేదు. ఇంతలో దళిత మాజీ సర్పంచు గోవిందు పంచాయితీ దగ్గరకు వచ్చాడు. ఏంటి సర్పంచును కింద కూర్చోబెట్టారు. ఇదెక్కడి సంస్కృతి అంటూ నిలదీశాడు. పంచాయితీ కోసం వచ్చిన పెద్దలతో మాట్లాడుతూ... తాళం వేసిన హన్మంత్ కూడా నాకు అప్పు ఉన్నాడు. నేను కూడా ఆయన ఇంటికి తాళం వేయవచ్చా... అంటూ ప్రశ్నించాడు. దళితులకు జరగుతున్న అవమానాల వెనక రెడ్ల హస్తం ఉందనీ, ఇదంతా కావాలనే రెడ్లు ఆడుతున్న నాటకాలని పలు ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా వివక్ష..
గ్రామంలో అడుగడుగునా వివక్ష తాండవిస్తోంది. గ్రామంలో ఐదు దేవుడి గుళ్లు ఉన్నాయి. హనుమాన్, మైసమ్మ, ఈదమ్మ, శివాలయం పోశమ్మ దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదు. ఇప్పటికీ గ్రామంలో రెండు గ్లాసుల విధానం కొనసాగుతోంది. ఇక్కడ ఎవరిని ప్రశ్నించినా...వివక్ష గురించి చెబుతారు. ఎవరైనా దేవాలయంలోకి పోతే సరి ఇక ఆ కుటుంబం వేధింపులకు గురికావాల్సిందే. ప్రధానంగా దళిత కాలనీ చూస్తే... పెంట దిబ్బలాగా ఉంటుంది. ఎక్కడా సీసీరోడ్లు కనిపించవు. వీధిలైట్లు లేక చిమ్మ చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. మురుగుదొడ్లు కనబడవు. ఊరి వ్యర్థాలు అంతా తెచ్చి ఎస్సీ కాలనీలోనే పోస్తుంటారు. గ్రామంలో 46 శాతానికి మించి చదువుకున్న వారు లేరు. వారిలో సంతకం వరకు వచ్చిన వారు 20 శాతం ఉంటారు. ఉమ్మడి జిల్లాలో వివక్ష అడుగడుగునా కనిపిస్తోంది. గత నెల 25న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలకపల్లి గ్రామంలో జనరల్ సీటులో ఎస్సీ మహిళ పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేక నాగర్కర్నూల్ సీఐ శ్రీనివాస్రెడ్డి నానా రకాల దుర్భాషలాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దళితులపై వివక్ష కనబరిచినప్పుడు అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలు తీసుకుంటే కొంతైనా మార్పు వస్తోంది. కానీ అధికా రులే వివక్ష చూపితే ఇక వారిని రక్షించేది ఎవరంటూ... దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సెల్ : 9398769450
సర్పంచ్ను నేలపై కూర్చోబెడతారా?
దళిత సర్పంచ్ను నేలమీద కూర్చోబెట్టి మీరు మాత్రం కూర్చీలపై కూర్చుంటారా... ఇదెక్కడి న్యాయం. పంచాయతీ కార్యాలయంలో కుర్చీలున్నా.. సర్పంచ్కు కూర్చీ ఎందుకు వేయలేదు. ఇదంత గ్రామంలోని రెడ్లు, పెత్తందారులు దళితులపై చూపిస్తున వివక్షనే.
- గోవింద్, మాజీ సర్పంచు
దళిత సర్పంచ్పై వివక్ష చూపిన వారిని శిక్షించాలి
జిల్లా పరిధిలోని పెదిరిపాడులో దళిత సర్పంచ్ బాలప్పను నేలమీద కూర్చోబెట్టి అవమాన పరిచిన వారిపై కేసులు నమోదు చేయాలి. పాలేరు అనే కారణంతో సర్పంచ్ను అవమానించడం భావ్యం కాదు. ముఖ్యంగా సంఘటన జరిగి ఇన్ని రోజులైనా ఏ అధికారి కూడా వచ్చి విషయాన్ని తెలుసుకోవడం లేదు. ప్రజాసంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును సుమోటోగా తీసుకోవాల్సి ఉంది. కేసు పెట్టకుండా రెడ్లు బాలప్పను బయపెడుతున్నారు. అందుకే దళిత సర్పంచ్ కేసు వేయడం లేదు. ఇప్పటికైనా వివక్ష రూపాలను గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిచో ఉద్యమాలు చేయకతప్పదు.
-కుర్మయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
Authorization