గొల్లపల్లి మరళి:
ట్రాక్టర్కు రూ.5వేల నుంచి 6 వేలు పలికే గొర్లు, మేకల ఎరువును అప్పనంగా కాజేసేందుకు గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) కుట్రచేసింది. ఈ మేరకు వీడీసీ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు గొర్లు, మేకల మంద ఎరువును ఉచితంగా ఇవ్వాలని గొల్లకుర్మలకు సూచించింది. ఇవ్వలేమని గొల్లకుర్మలు తేల్చిచెప్పారు. దీంతో ''వీడీసీ నిర్ణయాన్నే ధిక్క రిస్తారా?'' అంటూ గొల్లకుర్మలను గ్రామబహి ష్కరణ చేసింది. కాగా ట్రాక్టర్కు రూ.2వేలు చెల్లిస్తామని వీడీసీ పేర్కొన్నట్టు ప్రచారం జరుగుతంది.
నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో వీడీసీల పెత్తనం రోజురోజుకూ సృతిమించిపోతోంది. ఆర్మూర్ డివిజన్లోని భీంగల్ మండలం పల్లికొండలో 42 గొల్లకుర్మ కుటుంబాలున్నాయి. వీరిలో 17 కుటుంబాలకు గొర్లు, మేకలున్నాయి. కాగా గొర్ల ఎరువును వీడీసీకి ఉచితంగా ఇవ్వాలని పెత్తం దారులు కోరగా, గొల్లకుర్మలు తిరస్కరించారు. కాగా పొలాల్లో వేసుకునేందుకు తమకే కావాలని గొల్లకుర్మలు తెలిపారు. దీంతో ''తమ నిర్ణయాన్నే దిక్కరిస్తారా?'' అని గ్రామాభివృద్ధి కమిటీ గొల్లకుర్మలను గ్రామం నుంచి బహిష్కరించింది. గ్రామంలో వీరితో ఎవరూ మాట్లాడొద్దని, వ్యవసాయ పనులకు ట్రాక్టర్లను ఇవ్వొద్దని, కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు ఇవ్వొద్దని వీడీసీ హుకూం జారీ చేసింది. అతిక్రమిస్తే రూ.50 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో గ్రామంలో వీరికి నిత్యావసర సరుకులు ఎవరూ అమ్మడం లేదు. కనీసం పాలు కూడా పోయట్లేదని గొల్లకుర్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులకు ట్రాక్టర్లను రానివ్వడం లేదని వాపోయారు. వీడీసీల నిర్ణయాన్ని అతిక్రమించిన వారికి రూ.50 వేలు జరిమానా విధిస్తామని వీడీసీ హెచ్చరించడంతో గ్రామంలో వీరితో మాట్లాడటానికి ఎవరూ సాహసించడం లేదు. దీంతో బాధితులు ఫిబ్రవరి 1న భీంగల్ సీఐ, ఎస్ఐకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
గతంలోనూ బహిష్కరణ వేటు
గ్రామంలో గొర్లు, మేకలు కాపుతున్నందుకు వీడీసీకి గొల్లకుర్మలంతా కలిసి యేడాదికి 8 మేకలు ఇచ్చేవారు. అవి సరిపోవట్లేదన్న భావనతో ఒక్క గొర్రెకు, మేకకు రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు నిరాకరించడంతో 9 నెలల క్రితం సైతం బహిష్కరించారు. పోలీసులు వచ్చి రాజీ కుదర్చడంతో వివాదం సద్దుమణిగింది. కాగా ఈ ఏడాది వీడీసీ కమిటీ మారింది. నూతన కమిటీ సైతం గొల్లకుర్మలను వేధింపులకు గురిచేస్తుండటం గమనార్హం.
పోలీసులు చెప్పినా వినని వీడీసీ
బహిష్కరణపై గొల్లకుర్మ కుటుంబాలు భీంగల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను అన్యాయంగా బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గొర్లను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమను వీడీసీ వేధిస్తోందని వాపోయారు. చర్యలు తీసుకోవాలని సీఐకి, ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. కాగా ఈ విషయమై ఆర్మూర్ ఏసీపీ రాములు, సీఐ సైదయ్య, ఎస్ఐ శ్రీధర్రెడ్డి గ్రామానికి వెళ్లి ఇరువర్గాలతో మాట్లాడారు. రాజీ కుదరకపోవడంతో మళ్లీ ఆర్మూర్లోని ఏసీపీ కార్యాలయానికి పిలుపించుకొని రాజీ కుదిర్చారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఏసీపీ హెచ్చరించారు.
సెల్ : 9963304326
Authorization