రాంపల్లి రమేష్:
హిందూమతం ఏం చెపుతోంది..? 'ధర్మో రక్షతి రక్షత:'... అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుందని చెపుతోంది. ఈ ధర్మ రక్షణ సారాంశమేమిటో మనం తెలుసుకోవాలి. ధర్మం నాలుగు పాదాలమీద నడిస్తేనే ఈ లోకం సుభిక్షంగా ఉంటుందట! ధర్మం నాలుగు పాదాలమీద నడవటమంటే ఏమిటీ? బ్రహ్మ సృష్టించిన నాలుగు వర్ణాలు వారికి నిర్దేశించిన నాలుగు ధర్మాలను ఎవరికి వారు నిష్టతో పాటించటం. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఉదరము నుంచి వైశ్యులు, కాళ్ల నుంచి శూద్రులు అనే నాలుగు వర్ణాలను సృష్టించడమే గాక ఆ నాలుగు వర్ణాలకు నాలుగు ధర్మాలను నిర్దేశించాడట! అవేమిటంటే యజ్ఞయాగాలు చేయటం, చదువుకోవటం, చదువు నేర్పటం బ్రాహ్మణ ధర్మం. యుద్ధాలు చేయటం, రాజ్యాన్ని పాలించడం క్షత్రియ ధర్మం. వ్యాపారం చేయటం, లాభాలు ఆర్జించటం వైశ్యుల ధర్మం. కాగా పైమూడు వర్ణాలకు అవసరమైన శ్రమ చేయటం, సేవ చేసుకోవటం శూద్రుల ధర్మం! ధర్మాన్ని నాలుగు పాదాలమీద నడిపించటమంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించటమే!
''కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం
జాలరి పగ్గం సాలెల మగ్గం
శరీర కష్టం స్ఫురింపజేసే
గొడ్డలి రంపం కొడవలి నాగలి
సహస్త్ర వృత్తుల సమస్త చిహ్నం
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోరు'' అంటాడు శ్రీశ్రీ.
శ్రమ ఈ లోకాన్ని సౌందర్యభరితం చేయడమే కాదు, సిరిసంపదలతో సుసంపన్నంగావిస్తుంది. ''సమస్త సంపదల సృష్టి శ్రమ ఫలితమే'' అన్నది చారిత్రక సత్యం. కానీ, సమాజం ఎప్పుడైతే వర్గాలుగా విడిపోయిందో ఈ భూమి మీద అసంఖ్యాకులైన కష్టజీవుల రెక్కల కష్టం నుండి ఉద్భవించిన అనంతమైన సంపద దోపిడీకి గురవుతున్నది. వర్గసమాజంలో దోపిడీ వర్గాలకు ఎప్పుడూ ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. అదేమిటంటే శ్రామికవర్గం చేత అదనపు ఉత్పత్తి ఎలా చేయించాలి, దానిని ఎలా కాజేయాలి అన్నది. ఎందుకంటే శ్రామికులు తమ జీవిక కోసమే గాక, అదనంగా పనిచేసి దోపిడీ వర్గాల జీవితాలకూ, విలాసాలకూ అవసరమైన ఉత్పత్తి చేయాలి. అంటే శ్రమ దోపిడీకి లోనుకావాలి. ఎవరైనా ఎందుకు లోనవుతారు? కారు. కాబట్టి వారిని దోపిడీకి లోబరిచే సాధనం ఒకటి కావాలి. బలప్రయోగం అటువంటి ఒక సాధనం. దౌర్జన్యంగా శ్రామికులను భయపెట్టి బానిసలుగా మార్చి, అవసరమైతే గొలుసులతో బంధించి, కొట్టి, తిట్టి పని చేయించవచ్చు. ఈ పద్ధతిని బానిస వ్యవస్థ అవలంభించింది. కానీ అది అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నదే గాక తిరుగుబాట్లకూ దారితీసింది. కనుక అంతకుమించిన సాధనమొకటి కావాలి. అది ఏ తిరుగుబాటుకు అవకాశ మివ్వనిదీ, శ్రామికవర్గాన్ని తమకు తాముగా ఐచ్ఛికంగా దోపిడీకి లోబరిచేది అయివుండాలి. విశ్వాసం చేయించినంత పని భయం చేయించలేదు. కాబట్టి ఈ అసాంఖ్యాకమైన శ్రామికశక్తిని ఒక విశ్వాసంలో బంధించే తిరుగులేని సాధనమొకటి అవరమైంది వారికి. ఆ అవసరంలోంచి పుట్టుకొచ్చిన సాధనమే 'మతం'.
ప్రపంచంలో ఏ మతాన్నైనా సరే హేతువు మీద నిలబడి, నిశితంగా విశ్లేషిస్తే బోధపడే సత్యమిదే! హిందూమతం ఏం చెపుతోంది..? 'ధర్మో రక్షతి రక్షత:'... అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుందని చెపుతోంది. ఈ ధర్మ రక్షణ సారాంశమేమిటో మనం తెలుసుకోవాలి. ధర్మం నాలుగు పాదాలమీద నడిస్తేనే ఈ లోకం సుభిక్షంగా ఉంటుందట! ధర్మం నాలుగు పాదాలమీద నడవటమంటే ఏమిటీ? బ్రహ్మ సృష్టించిన నాలుగు వర్ణాలు వారికి నిర్దేశించిన నాలుగు ధర్మాలను ఎవరికి వారు నిష్టతో పాటించటం. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఉదరము నుంచి వైశ్యులు, కాళ్ల నుంచి శూద్రులు అనే నాలుగు వర్ణాలను సృష్టించడమే గాక ఆ నాలుగు వర్ణాలకు నాలుగు ధర్మాలను నిర్దేశించాడట! అవేమిటంటే యజ్ఞయాగాలు చేయటం, చదువుకోవటం, చదువు నేర్పటం బ్రాహ్మణ ధర్మం. యుద్ధాలు చేయటం, రాజ్యాన్ని పాలించడం క్షత్రియ ధర్మం. వ్యాపారం చేయటం, లాభాలు ఆర్జించటం వైశ్యుల ధర్మం. కాగా పైమూడు వర్ణాలకు అవసరమైన శ్రమ చేయటం, సేవ చేసుకోవటం శూద్రుల ధర్మం! ధర్మాన్ని నాలుగు పాదాలమీద నడిపించటమంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించటమే!
ఇవి చాలవన్నట్టు పంచములను సృష్టించారు. సమాజంలో నీచమైన పనులన్నీ వారికప్పగించి ఇది మీ ధర్మం అన్నారు. వారి సేవలను అనుభవిస్తూనే మనుషుల్ని మాత్రం అంటరానివారిని చేశారు. ఇలా ఎవరి ధర్మాన్ని వారు పాటించటమే స్వధర్మం. ఎవరికి వారు ఈ స్వధర్మాన్ని విశ్వాసంతో ఆచరించాలేగాని పరధర్మం కోసం ఆశించకూడదు. ఈ స్వధర్మం ప్రకారం శూద్రులు శ్రమ చేసి సంపద సృష్టించాలి. ఈ సంపదలో వారికి లభించేది వారు బతుకడానికి సరిపడేంత మాత్రమే. అది కూడా ఎందుకంటే వారు తిరిగి పనిచేయాలి కాబట్టి. మిగతాది కానుకల రూపంలో, కౌలు రూపంలో, శిస్తుల రూపంలో, వ్యాపారంలో లాభాల రూపంలో పైమూడు వర్ణాలకు చెందుతుంది! ఇందులో న్యాయాన్యాయాలకు తావులేదు. పని చేయటం శూద్రుడి ధర్మం. ఫలితం అనుభవించటం పై మూడు వర్ణాల ధర్మం. కనుక శూద్రులు పనిచేయాలే గానీ ప్రశ్నించకూడదు. ప్రశ్నించినా, పనిని నిరాకరించినా అది ధర్మవిరుధ్ధం. ''నువు గొల్లవైతే గొర్లను కాసుకో, గౌడవైతే కల్లు గీసుకో. మాదిగవైతే చెప్పులు కుట్టుకో, సాలెవైతే గుడ్డ నేసుకో. కాకపోతే నీ గొర్రెలు ఇంకెవరికో ఆహారమవుతాయి. నీ చెప్పులు ఇంకెవరివో అవసరాలు తీరుస్తాయి. నీ గుడ్డ వేరెవరికో అలంకరణవుతుంది. మీ పంట ఇంకెవరివో గోదాములకు చేరుతుంది. అంత మాత్రాన స్వధర్మాన్ని వీడి చదువుకుంటాననీ, వ్యాపారం చేస్తాననీ, రాజ్యమే ఏలుతాననీ పరధర్మాన్ని ఆశిస్తే అది మహా పాతకం. దాని ఫలితం పరమ భయంకరంగా ఉంటుంది. స్వధర్మాన్ని పాటిస్తేనే చచ్చిన తరువాత స్వర్గానికెళతావు. పరధర్మాన్ని ఆశిస్తే నరకం తథ్యం. ఇదంతా నీ పూర్వజన్మ సుకృతం. గత జన్మలో నువ్వు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన పాపానికే ఈ జన్మలో శూద్రుడిగా జన్మించి ఇన్ని కష్టాలననుభవిస్తున్నావు. ఈ జన్మలోనైనా నువ్వు స్వధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే వచ్చే జన్మలోనైనా గొప్ప జీవితం లభిస్తుంది'' అన్న కర్మ సిద్ధాంతాలతో, ధర్మశాస్త్రాలతో సమస్త శ్రామికలోకాన్నీ ఈ విశ్వాసంలో బంధిస్తోంది 'మతం'.
ఈ మతంకన్నా ముందే మానవ సమాజాల్లో అనేక మూఢనమ్మకాలున్నాయి. ప్రకృతిలో తమకు వశంకాని శక్తులన్నిటినీ దైవాలుగా కొలిచాడు ఆదిమానవుడు. అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, భూదేవి, గంగాదేవి మొదలైన దేవతలందరూ అలా పుట్టుకొచ్చినవారే. ప్రకృతిలో సంభవించే ప్రళయాలకు, వైపరిత్యాలకు భయపడిపోయిన మానవుడు అవన్నీ ఆ దేవతల ఆగ్రహానికి ప్రతీకలని నమ్మాడు. వారి ఆగ్రహాన్ని చల్లార్చి, ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో పూజించాడు. ఇవన్నీ కేవలం అజ్ఞాన భయజనితాలైన మూఢనమ్మకాలు మాత్రమే. ఈ నమ్మకాల్లో దోపిడీకి స్థానం లేదు. వాటంతటవి దోపిడీకి సాధనాలు కాలేవు. కానీ ఆ నమ్మకాలను, దేవుడిపట్ల మనిషిలో ఉన్న భయాన్నీ, భక్తినీ అవకాశంగా తీసుకుని, వీటన్నిటికీ ఆధారంగా ఒక ఆద్యంతరహితుడైన సృష్టికర్తను సృష్టించి, అతనికి వీటన్నిటిని లోబరిచి...పాపపుణ్యాలు, స్వర్గనరకాలు, పునర్జన్మలతో కూడిన కర్మసిద్ధాంతాన్ని, ధర్మశాస్త్రాలను జోడించి మతాన్ని ఒక ప్రాపంచిక దృక్పథంగా ముందుకు తెచ్చింది దోపిడీవర్గం. ఈ అనంత విశ్వానికి అతీతంగా ఉండి, దాన్ని నియంత్రించే శక్తిగా, స్థితి లయ కర్తగా ఆ సృష్టికర్తను శ్రామికవర్గం ముందు నిలబెడుతుంది 'మతం'. ఈ అనంత సృష్టిక్రమమంతా ఆ లయకారుడి లీలా విన్యాసమేనని నమ్మిస్తుంది. ఆ తర్వాత ఆ దేవుడితో ఏం చెప్పించినా శ్రామికలోకం విశ్వసిస్తుంది. అందుకే ఈ వర్ణ వ్యవస్థ తన సృష్టేనని భగవద్గీతలో శ్రీకృష్ణుడితో చెప్పించారు. దేవుడే సర్వశక్తి సంపన్నుడు అని చెప్పడం ద్వారా మనిషి (శూద్రుడు)ని అశక్తుడిగా నిలబెట్టాలి. అన్నిటికీ కారకుడు దేవుడే అని నమ్మించాలి. అప్పుడే అతనిపై ఎంతటి దోపిడీ దౌర్జన్యాలు జరిగినా అదంతా దైవనిర్ణయం, ప్రకృతి నియమం అని భావించి స్వచ్ఛందంగా లొంగిపోతాడు. 'మన ధర్మం పరమగంగ.. పర ధర్మం ఎండమావి' అన్న భావనకు కట్టుబడి తన స్వధర్మాన్ని నిర్వహిస్తాడు.
ఆ విధంగా వేల సంవత్సరాల సుధీర్ఘకాలంగా మతం తన పాత్రను జయప్రదంగా నిర్వహిస్తూవస్తోంది. కాబట్టి మన మత ప్రబోధానుసారం ధర్మాన్ని రక్షించడమంటే అట్టడుగు వర్ణాలైన శూద్రులు, పంచములు తమకు తాముగా దోపిడీకి గురికావడం. అగ్రవర్ణాలు అసంఖ్యాకులైన శూద్రులను, పంచములను తమ హక్కుగా దోచుకోవడం. ఇది ఎంత మాత్రమూ అన్యాయమూ, అక్రమమూ కాదు. ఎందుకంటే అది 'ధర్మం'. కానీ...ఈ ధర్మం ఎవరి రక్షణకు?
Authorization