కుంతోల్ల యాదయ్య
కులోన్మాదం కోరలు చాచి ప్రేమను సహితం ఓడించింది. కులం గోడలతో ప్రేమను సమాధిచేస్తున్న సంఘటనలు ఎన్నో చూడాల్సి వస్తోంది. మిర్యాలగూడలో ఆధిపత్యకుల అమ్మాయిని ప్రేమించి పెండ్లిచేసుకున్నందుకు అందరు చూస్తుండగా పట్టపగలు ప్రణరును నరికి చంపారు. మంథని మధుకర్, భువనగిరిలో స్వాతి, నరేష్ ...ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో సంఘటనలు ...! తక్కువ కులంవారిని ప్రేమిం చారని అగ్రవర్ణాల ఆడపిల్లల తల్లిదండ్రులు దళిత బిడ్డలను మట్టుపెట్టారు, కానీ వీటికి భిన్నంగా కలకాలం కలసి ఉంటామని ప్రేమించి అగ్నిసాక్షిగా ఆర్యసమాజ్లో ఒక్కటైన ప్రేమికులు వాళ్లు. అయినా కులోన్మాదానికి తట్టుకోలేక కట్టుకున్నవాడే కాలయముడై భార్యాబిడ్డలను కడతేర్చి ఆ ప్రేమకు సమాధి కట్టాడు. నిద్రమాత్రలు ఇచ్చి గొంతు నులిమి చంపి వారి ఆనవాళ్లు కానరాకుండా పెట్రోల్ పోసి దహనం చేసిన అతి కిరాతక సంఘటన ఘట్కేసర్ మండలం కొండాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభాకర్ ఎన్క్లేవ్లో వెలుగుచూసిన సంఘటన ఘట్కేసర్ ప్రజలనే కాకుండా వరంగల్, జనగాం జిల్లాల ప్రజలను కలచివేసింది. వివరాలలోకి వెళ్తే...
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూర్కు చెందిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మాచర్ల రమేష్కు వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన కందిక సుశ్రుత లకు 2014లో పరిచయం. ప్రేమగా మారి పెండ్లి వరకు వెళ్లగా, రమేష్ కుటుంబ సభ్యులు సుశ్రుత దళిత సామాజిక వర్గానికి చెందినదని వ్యతిరేకించడంతో 2015లో బల్కంపేట్ ఆర్యసమాజ్లో పెద్దలను కాదని ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ దంపతులను రమేష్ తల్లిదండ్రులు రాజయ్య, రాజమ్మలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో హైదరాబాద్లోనే ఉప్పల్లో కాపురం పెట్టారు. వీరి కాపురం కొన్ని నెలలు సజావుగానే సాగినా రమేష్ తల్లిదండ్రుల ఒత్తిడితో సుశ్రుతకు కులం గొడవలు తప్పలేదు. సుశ్రుతను వదిలేసి తము కుదిర్చిన సంబంధం చేసుకుంటేనే ఇంట్లోకి రావాలనడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మరింత పెరిగాయి. మాదిగ దానికి పుట్టే సంతానం తనకు వద్దని పెండ్లి అయిన మొదట్లో గర్భంం వస్తే గర్భనివారణ మాత్రలు ఇచ్చి తీసివేశాడు. ఇలా భర్త పెట్టే ఇబ్బందులకు తట్టుకోలేక నిద్రమాత్రలకు అలవాటు పడినట్లు సుశ్రుత తన డైరిలో రాసుకున్నది. రెండవ సారి గర్భం రావడతో ఎలాగైన తీసివేస్తాడని భావించిన సుశ్రుత 8నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. గత 4నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా తన సోదరుడి వివాహనికి ఇంటిపెద్దగా తనను పిలువలేదని, ఇలా ఉంటే ఇంట్లోకి రానివ్వక పోగా ఆస్తి సహితం తనకు దక్కదని భావించిన రమేష్ భార్యాబిడ్డలను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అదును కోసం ఎదురుచూశాడు. శనివారం ఉండడానికి కొత్త రూమ్ చూద్దామని బావమర్ధితో సుశ్రుతను ఉప్పల్ పిలిపించుకొని, అక్కడి నుండి భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై ఘట్కేసర్ వస్తున్న క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఇద్దరికి మరోమారు గొడవ అయినట్లు తెలిసింది. దీనితో తన ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాడు. సుశ్రుతకు నిద్రమాత్రలు వేసి, బాబుకు పాలలో నిద్రమాత్రను కలిపి తాగించి వారు అపస్మారక స్థితికి చేరగానే తన ద్విచక్రవాహనంపై హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి సమీపంలోని కొండాపూర్ రెవెన్యూ పరిధిలో ప్రభాకర్ ఎన్క్లేవ్ నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న భ్యారా బిడ్డలను అక్కడకు చేర్చి గొంతునుమిలి హత్యచేశాడు. అనంతరం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ నుండి లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి మృతిదేహాల మీద కట్టెలు పేర్చి పెట్రోల్ పోసి దహనం చేసాడు. సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా కులోన్మాదం సమాజాన్ని పట్టి పీడిస్తుందని, కులరక్కసికి ప్రేమ సహితం మోకరిల్లక తప్పని పరిస్థితులు నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్నదని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం.
సెల్ : 9533497259
నిందితులను కఠినంగా శిక్షించాలి
నేటికి కులరక్కసి కోరలు చాచి ఈ సమాజాన్ని పట్టిపీడిస్తుంది. పవిత్రమైన ప్రేమను అపహాస్యం చేస్తూ కట్టుకున్న భార్యను, రక్తం పంచుకుపుట్టిన బిడ్డను కిరాతకంగా చంపిన రమేష్ను, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలి. కుల దురహంకార హత్యలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- నార్కెట్ పల్లి సబిత,
సీఐటీయూ మండల కార్యదర్శి, ఘట్కేసర్
Authorization