గ్రామ పరిపాలనా సౌల భ్యం కోసం ఎన్నికలు జరగాలి. అప్పుడే గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా కులాల్లో చిచ్చుపెడుతూ పదవిని అందిపుచ్చుకునేందుకు తమ సామాజిక వర్గాన్ని కూడగడుతూ కలిసిరాని వారిని కులబహిష్కరణ చేస్తూ భయబ్రాం తులకు గురి చేస్తున్న ఉదంతం ఇది. జయశంకర్ భూపాలపల్లి కేంద్రానికి కూతవేటు దూరంలో పెద్దాపూర్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో మొత్తం ఆయా కులాలకు చెందిన 1862 జనాభా ఉంది. ఇందులో 1280మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ గ్రామంలో ఎక్కువ శాతం 580ఓట్లు గౌడ కులస్తులవి ఉండగా మిగిలిన 700ఓట్లు ఆయా కులాలకు చెందిన వారివి.
రాష్ట్ర ప్రభుత్వం గత నెల 21నుంచి 30వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి 20రోజుల ముందు రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామం జనరల్ స్థానం అయింది. దీంతో సర్పంచ్గా ఎన్నికల్లో గెలుపొం దాక తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తానని, కులం కోసం రూ.8లక్షలు ఇస్తానని అందుకు గౌడ కులస్తులందరూ నాకే మద్దతు పలికి గెలిపించా లంటూ గ్రామానికి చెందిన మామిడి మొండయ్య తన కులస్తులతో కలిసి గ్రా మంలోని హనుమాన్ దేవాలయం వద్ద బేరం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందానికి కులపెద్ద మనుషులు తోడేటి విజేందర్, కత్తి తిరుపతి, వడ్లకొండ నాగరాజు, పూజారి శ్యాం, పబ్బ సతీష్, గుండగాని శ్రీనివాస్, గట్టు మహేందర్, బుర్ర రమేష్లు కీలకపాత్ర పోషించి రూ.8లక్షలు తీసుకున్నారు.
ఇదిలా జరుగుతున్న క్రమంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన గట్టు లక్ష్మణ్, ఊరుగొండ సుధాకర్, గండి శ్రీను, గండి కళమ్మ, ఊరుగొండ నరేష్లతో పాటు మరో పది కుటుంబాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఇది సరైంది కాదని ఇష్టమున్న వారికి మేము మద్దతు తెలుపుతామని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో కక్ష పెంచుకున్న సర్పంచ్ అభ్యర్థి మామిడి మొండయ్య ఆధ్వర్యంలో గౌడ కులపెద్ద మనుషులు ఊరుగొండ సుధాకర్కు చెందిన గడ్డివామును జనవరి 18న అర్ధరాత్రి సమయంలో దగ్ధం చేశారు. దీనిపై వెంకటాపూర్ పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం 19న ఉదయం వెంకటాపూర్ ఎస్సై భూక్య నరహరినాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి కారకులైన వడ్లకొండ నాగరాజు, కత్తి తిరుపతిలపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల్లో గెలుపొందడంతో పెరిగిన ఆరాచకం
జనవరి 21న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మామిడి మొండయ్య సర్పంచ్గా గెలుపొందాడు. దీంతో ఆగడాలు మరింత పెరిగాయి. మామిడి మొండయ్య గెలుపుకు సహకరించలేదని కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతూ ఈ నెల 6న ఊరుగొండ కిరణ్ వివాహం జరగగా ఈ వేడుకకు గౌడ కులస్తులెవరూ హాజరు కాకుండా సర్పంచ్తో పాటు కుల పెద్దమనుషులు ఆంక్షలు విధించారు. అంతేకాకుండా వీరి కుటుంబాలలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు వారిని పిలువకూడదని, ఒకవేళ పిలిస్తే మీకు కూడా అదేగతి పడుతుందని కులస్తులందరినీ భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో గ్రామానికి చెందిన గౌడ కులస్తులు కిరణ్ వివాహ వేడుకకు ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఆ కుటుంబం తీవ్ర మనాస్తాపానికి గురైంది.
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు
తమ కుటుంబాలలో శుభ, అశుభ కార్యాలకు హాజరుకాకుండా అడ్డుపడుతున్నారనీ, వారిపై చర్యలు తీసు కోవాలనీ కోరుతూ గట్టు లక్ష్మణ్, ఊరుగొండ సుధా కర్, గండి శ్రీను, గండి కళమ్మ, ఊరుగొండ నరేష్లు ఈ నెల 11న జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న జయశంకర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేపట్టే ప్రజాదివస్లో ఎస్పీ భాస్కరన్కు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎస్పీ భాస్కరన్ ములుగు జిల్లా ప్రజాదివస్లో పాల్గొనగా ఏఎస్పీ రాజమహేంద్రనాయక్కు ఫిర్యాదు చేశారు.
స్నేహితుడి పెండ్లిలో తీవ్ర అవమానం
ఇదిలా కొనసాగుతున్న క్రమంలో ఈ నెల 15న ఇదే గ్రామానికి చెందిన గట్టు సాయిలు కుమారుడైన గట్టు సురేష్ వివాహ వేడుకకు బహిష్కరణ చేయబడ్డ గట్టు లక్ష్మణ్, ఊరుగొండ సుధాకర్లను తమ కొడుకు వివాహానికి హాజరుకావాలంటూ గట్టు సాయిలు కోరారు. ఈ విషయం తెలుసుకున్న గౌడ కుల పెద్దమనుషులు వారిని బహిష్కరించాం కదా వారిని ఈ పెండ్లికి పిలిచినందుకు గౌడ కులం మొతం రాదంటూ పెండ్లికి వెళ్లకుండా ఉన్నారు. అనంతరం తప్పు జరిగిందని గట్టు సాయిలు కుల పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకోవడంతో వారిని మళ్లీ రిసెప్షన్కు పిలవకూడదని గౌడ కుల పెద్ద మనుషులు హామీ తీసుకున్న తర్వాత 16న పెద్దాపూర్ గ్రామంలో జరిగిన రిసెప్షన్కు హాజరయ్యారు.
పెద్దాపూర్ గ్రామంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు రూ.8లక్షలకు మామిడి మొండయ్య వద్ద ఒప్పందం కుదుర్చుకున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో మండల పరిషత్ అధికారులు, పోలీసులు విచారణ నిమిత్తం వచ్చినప్పటికీ నామమాత్రంగా ఇదే సామాజిక వర్గానికి చెందిన కొందరిని విచారించి ఏమీ లేదంటూ అందరూ కలిసి ఉండాలంటూ చెప్పి వెళ్లిపోయారు. తీరా ఎన్నికలు జరిగి గెలుపొందిన తరువాత కుల పెద్దల ఆగడాలు పెరగడంతో అది బాధితులు స్థానిక పోలీస్స్టేషన్తో పాటు కలెక్టర్, ఏఎస్పీకి ఫిర్యాదు చేసే వరకూ దారి తీసింది. ఏఎస్పీ ఆదేశాల మేరకు వెంకటాపూర్ ఎస్సై భూక్య నరహరి ఫిబ్రవరి 19న రెండు వర్గాలకు చెందిన వారిని పోలీస్స్టేషన్కు రప్పించి కౌన్సెలింగ్ ఇస్తూ కలిపే ప్రయత్నం చేశారని సమాచారం.
- సతీష్
సెల్ : 9490099696
Authorization