ఆ గ్రామంలో అన్ని కులసంఘాలకు ప్రత్యేక భవనాలున్నాయి. దళితులకు మాత్రం లేదు. తమకు కూడా కులసంఘ భవనం ఉండాలని దళితులు తలంచారు. అంబేద్కర్ భవనం నిర్మించేందుకు పునాదులు తీశారు. అంబేద్కర్ భవనం గ్రామంలో కట్టడం ఇష్టం లేని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) 'ఏం కులం రా మీది..? మా అనుమతి లేకుండా భవన్ ఎలా కడతారు బే.. మీ అంతు చూస్తాం' అంటూ పరుషపదజాలంతో మాల కులస్తులను దూషించారు. వీడీసీకి చెప్పకుండా భవనం పనులు ప్రారంభించడంతో 80 మాల కుటుంబాలను బహిష్కరించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం మారంపల్లి వీడీసీ దుశ్చర్య ఇది. ఈ ఘటన గతేడాది డిసెంబర్ 24వ తేదీన చోటుచేసుకోగా, ఈఏడాది జనవరి 2వ తేదీన బాధితులు వీడీసీపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయంతో వెలుగులోకి వచ్చింది. బహిష్కరణ అంశాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని వీడీసీ హెచ్చరించడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి మొదట సాహసించలేదు. గ్రామ బహిష్కరణ విధించిన వీడీసీ అప్పటి నుంచి వారిని నానా హింసలు పెట్టింది. ఆఖరుకు క్రిస్మస్ పండుగకు కొత్తబట్టలు కూడా కుట్టించుకోకుండా అడ్డుకుంది. వారి వ్యవసాయ భూముల్లో దున్నడానికి ట్రాక్టర్లను వెళ్లనివ్వలేదు. వారి వ్యవసాయానికి ఎరువులు, మందుల అమ్మకం నిలిపివేశారు. రూ. 50 వేలు కడితేనే బహిష్కరణ ఎత్తేస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సూచించారు. భయపడిన బాధితులు వారు అడిగిన మొత్తాన్ని చెల్లించారు. అయినా బహిష్కరణ కొనసాగింది.
మితిమీరిన ఆగడాలు
రోజురోజుకు వారి ఆగడాలు మితిమీరాయి. పాలకేంద్రంలో మాల కులస్తుల పాలు తీసుకోవడం లేదు. రబీ సాగులో వరినాట్లకు కూలీలుగా వీరిని పిలవకుండా పొట్టకొట్టారు. దీంతో బాధితులు మొదట ఎస్ఐకి, సీఐకి ఫిర్యాదు చేశారు. సదరు ఎస్ఐ వచ్చి గ్రామంలో విచారించారు. కానీ పెత్తం దార్లు వెనక్కితగ్గలేదు. మీకు దిక్కున్నచోట చెప్పుకోండని బా ధితులతో హేళనగా మాట్లాడారు. దీంతో వారు ఆర్మూర్ ఏసీపీకి, నిజామాబాద్ డీఆర్వోకు ఫిర్యాదు చేసినా ఆగడాలు ఆగలేదు.
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి అడ్డగింత
మారంపల్లి గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణపై విచారణ జరిపేదుకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములుకు చేదు అనుభవం ఎదురైంది. బహిష్కరణకు మూల కారకులైన నిందితుల అరెస్టును నిరసిస్తూ వీడీసీ ఆధ్వర్యంలో కొంత మంది గ్రామస్తులు కమిషన్ సభ్యులు రాములు వాహన శ్రేణిని అడ్డగించారు. పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తుల కు సర్ది చెప్పేందుకు యత్నించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. రాములుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యక్తిగత దూషణలు చేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడంలో పోలీ సులు విఫలమవడంతో రాములు మరో దారి గుండా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆందోళన విరమించకపోవ డంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- మీస మధు
సెల్ : 9494573764
పరిస్థితిలో మార్పులేదు
బహిష్కరణ ఘటనపై పోలీసులతో పాటు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిటీ సభ్యులు రాములు వచ్చి గ్రామంలో దర్యాప్తు నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేసినా పరిస్థితిలో మార్పులేదు. మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు. కూలీ కోసం మారంపల్లి నుంచి పక్కగ్రామమైన గంగసరం వెళ్తున్నాం. ఘటన చోటుచేసుకొని ఇన్ని రోజులవుతున్నా బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. వీడీసీపై ఇంకా చర్యలు తీసుకోలేదు.
- రాజన్న(మారంపల్లి మాజీ సర్పంచ్)
పొలం నాట్లకు ట్రాక్టర్ రానియ్యలేదు
అంబేద్కర్ సంఘం కడుతున్నామనే అక్కసుతో ఏకంగా 80 మాల కుటుంబాలను బహిష్కరించారు. కనీసం వరి నాట్ల కోసం పొలం చదును చేసేందుకు ట్రాక్టర్ను రానియ్యలేదు. ప్రభుత్వ డెయిరీతో పాటు ప్రయివేటు డెయిరీలో మేము తీసుకెళ్లిన పాలు తీసుకోలేదు. ఊర్లో సగానికి పైగా ఎక్కువ మంది కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నాం. కానీ మమ్మల్ని పనికి పిలవడం లేదు.
- రాజేశ్వర్(బాధితుడు)
Authorization