ఎనుగందుల శశిధర్:
'ఊర్లో అన్ని కులాలోళ్లు గ్రామ కమి టీలో ఉంటే మాదిగోడు ఎందుకుం డడు?.. వాళ్లు కూడా కమిటీలో ఉండాల్సిదే.. ''ఇది గ్రామాభివృద్ధి కమిటీ హుకూం''. గ్రామాభివృద్ధి కమిటీకి ఎల్లకాలం ఆధిపత్య కులాలే నాయకత్వం వ హిస్తారా..? ఇంకా ఊర్లో కూలాలే లేవా?' ఇది దళితుల ప్రశ్న. ఈ ప్రశ్నతో అగ్రవర్ణాల ఆధిపత్య పూరిత స్వభావం ఒక్కసారి ఉలిక్కిపడింది. దళితులు మా నాయకుల్ని ధిక్కరించడమా? అని కమిటీ ఉడికిపోయింది. ఎప్పటిలా వారు వాడే అస్త్రాన్ని ప్రయోగించింది. దళితుల ధిక్కారస్వరాని కి సాంఘిక బహిష్కరణ విధించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హసాకొ తూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
హసాకొత్తూర్ గ్రామంలో గ్రామాభి వృద్ధి కమిటీ పెత్తనంపై ఈ ధిక్కార స్వరం పుట్టింది. జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతం గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనానికి, ఆ కమిటీల ముసుగులో అగ్రవర్ణ ఆధిపత్య అకృత్యాలకు పెట్టింది పేరు. అలాంటి గ్రామ కమిటీగానే ఆది నుంచి హసాకొత్తూర్ గ్రామాభివృద్ధి కమిటీకి పేరుంది. ఏడాదికో, రెండేండ్లకో ఒకసారి కమిటీలో మనుషులు మారినా మతలబు మాత్రం మారడం లేదు. ''అభివృద్ధి తక్కువ-ఆంక్షలు ఎక్కువ'' అన్నది దాని వైఖరి. అదే తీరును గ్రామంలోని దళితులపై చూపబోయి వార్తల్లోకి ఎక్కింది.
హసాకొత్తూర్ గ్రామంలో ఒక పంథాకు చెందిన ఎస్సీ కులస్తులు కొద్ది నెలల క్రితం రెండు పంథాలుగా ఏర్పడ్డారు. ఇందులో ఒక పంథా వారు గ్రామాభివృద్ధి కమిటీలో ఉన్నారు. మరో పంథా వారు కమిటీలో లేరు. అందుకు గల నిస్సహాయ పరిస్థితిని వారు గ్రామాభివృద్ధి కమిటీకి వివరించారు. కేవలం ఇరవై కుటుంబాలు మాత్రమే ఈ పంథాలో ఉన్నాయి. అందులో చాలా మంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళారు. ఇక ఊర్లో ఉన్న కొందరు తమ పనులు చేసుకుంటూ కమిటీకి వెళ్లే పరిస్థితి లేదు. ఆడవాళ్ళు ఎలాగు వెళ్లలేరు. కనుక కమిటీ నుండి తమకు మినహాయింపునివ్వాలని వేడుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఖర్చులు, జమ ఏదైనా సరే తమవంతు ఇస్తామని వారు కమిటీకి విన్నవించి బతిమాలారు. అదేం కుదరదని కమిటీ బైఠాక్ నిర్వహించింది. ఎస్సీ కులస్తులను పిలిపించి దబాయించింది. కనెర్రజేసింది. దయతో తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని దళితులు వేడుకున్నారు. కమిటీ వినలేదు. సహనం నశింప జేసింది. మేము రానంత మాత్రాన వచ్చే ఇబ్బంది ఏముందని దళితులు వాదించారు. ''అన్ని కులాలు వస్తే మాదిగోడు ఎందుకు రాడు'' అన్నారు కమిటీలో అగ్రకుల దురహంకారులు. అంతే ఒక్కసారిగా దళితుడి మనసు గాయపడింది. గాయంతో కలిగిన బాధలోంచి ధిక్కారం పుట్టింది. కమిటీలో మెంబర్లుగా ఉండేందుకు మా కులాలు కావాలాయే.. అధ్యక్షులు, కార్యదర్శులు పోస్టులు మాత్రం అగ్రవర్ణ కులాలే ఉండాల్నా అని కమిటీలో కుల ఆధిపత్యాన్ని ధిక్కారించారు. దిక్కుతోచని ఆధిపత్యం ఆ ధిక్కారానికి సాంఘిక బహిష్కరణ విధించింది. పంచాయతీ పోలీసులకు చేరింది. గ్రామ కమిటీపై కేసులు పెట్టారు. కానీ వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విచారణ లేదు. అరెస్టులు లేవు. మాదిగోడు అంటూ కులం పేరుతో దూషించిన వారిని, దళితుల ఆకలి తీర్చే ఉపాధిపై ఆంక్షలు విధించిన వారిని అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
సెల్ : 7989744161
Authorization