ఏ భావజాలం ఈ దేశంలో సువిశాల భూభాగాన్ని జయించిన శివాజీని శూద్రుడనే కారణంతో చక్రవర్తిగా గుర్తించ నిరాకరించి ఈసడించిందో..
నేడు అదే వర్గ భావజాలం ఛత్రపతి శివాజీని గొప్ప చక్రవర్తిగానే గాక కేవలం హిందూ మతాభిమానిగా మన ముందుకు తెస్తుండటం ఈ దేశ బహుజనుల పాలిట విషాధం.
వెంకటకిషన్ ఇట్యాల:
మహారాష్ట్రలో 1630 ఫిబ్రవరి 19న కున్భీ కాపు వ్యవసాయ కులం (బీసీ - తెలంగాణలో మున్నూరు కాపు)లో పుట్టిన శివాజీ, ఏ వారసత్వం లేకుండానే స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించాడు. స్వరాజ్యంలో రైతులు, స్త్రీలు, అస్పృశ్యులు, గిరిజనులు, సామాన్యులను ఎలా భాగస్వాముల్ని చేయాలి, బహుజన రాజ్య నిర్మాణం ఎలా ఉండాలి అనే ప్రణాళికకు ఆయన పాలనా విధానం మాతృకలాంటిది.
జాతీయ భావన లేని, దేశ ప్రేమ లేని ఆధిపత్య గుంపు, స్వార్థంతో నిండిన శారీరక శ్రమ తెలియని గుంపు, ఎవరు రాజుగా వచ్చినా మోకరిల్లి, విధేయతను ప్రకటించుకుంటూ కులకర్ణిలుగా (పట్వారీ), దేశముఖ్లు దేశపాండేలు జాగీర్దారులుగా తమ పీఠాలకు ఢోకా లేదనే హామీ తీసుకొని రాజుల అడుగులకు మడుగులొత్తుతూ, పాలన తమ చేతుల్లోకి తీసుకొని, తమకు నచ్చిన రీతిలో పాలన సాగిస్తూ, దేశాన్ని వేల ఏండ్లుగా బానిసత్వంలో ఉంచుతూ, ప్రజలను, రైతులను వేధించి చంపుతూ, ఖజానా నింపుతుంటే... రాజ్యమంటే దోపిడీ అనీ రాజు అంటే క్రూరుడని ప్రజలు భావిస్తున్న కాలంలో.., రైతులకు భూములని కొలిపించి, న్యాయమైన పన్ను నిర్ణయించి, కరువు సమయంలో పన్ను మినహాయింపునివ్వడమే గాకుండా అదనపు సాయాన్ని అందించి, దేశముఖ్లు, దేశపాండేలు తన రాజ్యంలో గతంలోలాగా అరాచకాలకు పాల్పడితే సహించేది లేదనీ, వాళ్లు కూడా ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా రైతుల వలే సాధారణ ఇండ్లల్లో నివాసం ఉండాలనీ హుకుం ఇచ్చి సామాన్య ప్రజలకు ఈ దేశం మీద ప్రేమ కల్పించిన అసమాన్య సామాన్యుడు చత్రపతి శివాజీ. శూద్రుడైన ఛత్రపతి శివాజీ సైన్యంలో ఉన్న వారు ఒక తరం చచ్చిపోతే మళ్లీ పిల్ల లు పుట్టి పెరిగేదాకా వేచి చూసే బలహీన తక్కువ సంఖ్య కల క్షత్రియ సైన్యం కాదు. శివాజీ సైన్యం ఈ దేశ మూలవాసులైన ముస్లిములు (మతం మారిన వారు) ఆస్పృశ్యులు (మహర్ మాంగ్) గిరిజనులు (రామోషి) మంగలి, చాకలి సకల కులాలు. శ్రమతో సంబంధం గల ఈ మట్టి మనుషులు బయట స్త్రీలు కనిపిస్తే తమ ఇండ్లల్లో తల్లి కూతుళ్లను గుర్తుకు తెచ్చుకుంటారే తప్ప మానభంగం చేయరు. పంటలు కొల్లగొట్టరు. నాశనం చేయరు. తమ రాజు ఇస్తున్న సరిపోయే జీతాలు తప్ప ఎవరి దగ్గరా వస్తువులు, తిండి పదార్థాలు జబర్దస్తీగా తీసుకోరు.
శివాజీ దళితులని సైన్యంలోకి తీసుకుని వారిని దుర్గా ధిపతులని చేసాడు. అలా సైన్యంలోకి చేరిన తొలితరం సైనికుల నుండే తర్వాతి కాలంలో మహార్ కులానికి చెందిన బాబా సాహెబ్ అంబేద్కర్ తండ్రి రామ్జీ సక్పాల్ సైన్యంలో సుబేధార్ స్థాయికి చేరాడు. శివాజీ గూడాచారి విభాగం (ఇంటెలిజెన్స్) అధిపతి బాహిర్జీ నాయక్ గిరిజన రామోషి తెగ వ్యక్తి (బంజారా ఇక్కడ లంబాడా). ఇతని మనుమడు క్రాంతి వీర్ ఉమాజీ నాయక్ మరాఠ సామ్రాజ్యం కుప్పకూలిన దశలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఉరి తీయబడ్డాడు. నౌకా దళంలో సముద్రంలో చేపలు పట్టే కోలీ (ముదిరాజ్), సొంకాలీ (బెస్త), భండారీ లాంటి మట్టి మనుషులని నావికా దళ సైన్యంగా మార్చాడు. అది జాతీయ సైన్యం. అది దేశమంటే, తమ రాజ్యమంటే ప్రేమ గల నిజమైన సైన్యం. అందుకే అప్పుడు ప్రజలు ఈ దేశం మాది, రాజు మా నాయకుడు అని భావించారు.
ఆ మూలనివాసీల, బహుజనుల, నాయకుడు శివాజీ. బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. క్షత్రియులు మాత్రమే రాజ్యమేలాలి. వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి. శూద్రులు పైమూడు వర్గాలకి సేవ చేయాలన్న సందర్భంలో, నాలుగు శాతం ఉన్న క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేమని గ్రహించిన వ్యవసాయ కులానికి చెందిన మరో కున్భీకాపు సంత్తుకారాం (భక్త తుకారాం) గురువుగా ఛత్రపతి శివాజీకి హితబోధ చేస్తాడు. తన తల్లి జిజావు కుల మత బేధం లేని తమ పూర్వీకుడైన బలిచక్రవర్తి రాజ్యాన్ని ఈ దేశంలో తిరిగి తీసుకురావాలని ఉగ్గు పాలతో బోధించింది. ఆ మేరకు శివాజీ రాజ్యంలో జూన్ నుండి అక్టోబర్ నాటికి పంట చేతికి వచ్చాక రైతులందరు దసరాకు సైనిక శిక్షణ తీసుకుని సంక్రాంతి నుండి యుద్ధాలలో పాల్గొని శివాజి సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తారు.
శివాజీ సైన్యంలో పెద్ద ఎత్తున రైతులతోపాటు మిగతా శూద్రులు, అతిశూద్రులు (దళితులు), ఆదివాసీ రామోషి లాంటి తెగలు, ముస్లింలు (మతం మారిన ఈ దేశ మూల నివాసీలు) పనిచేశాడు. ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి పోయి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా పరిపాలనా/ అధికార భాషగా ఆంగ్లమును కొనసాగిస్తోంటే సాధారణ గ్రామీణ ప్రజలనుండి గ్రాడ్యుయేట్ వరకు బ్యాంక్లో ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలియని ప్రస్తుత పరిస్ధితిని పోల్చుకుంటే ఛత్రపతి శివాజీ తన కాలంలో పరిపాలనా భాష అయిన పర్షియన్ని తొలగించి ప్రజల భాష మరాఠీనే పరిపాలన భాషగా చేశాడు. స్వదేశీ వాణిజ్యం, పరిశ్రమలు కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆ రోజుల్లోనే భారీ సుంకాలు విధించాడు. భారతదేశంలో స్త్రీ పురుషులని సంతల్లో అమ్మడం, కొనడం చేసే రోజుల్లో బానిస వ్యాపారాన్ని నిషేధించాడు.
స్త్రీల విషయంలో శివాజీ చాలా ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్న వ్యక్తి. 1678లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ చేలాది దుర్గం ముట్టడించి సావిత్రిబాయి దేశారు అనే ఆ దుర్గాధిపతిని మానభంగం చేస్తే శివాజీ కండ్లు పీకించి యావజ్జీవ కారాగారవాసం విధించాడు. కళ్యాణ్ సుబేదార్ ని ఓడించాక ఆమె కోడలిని ఒక యోధుడు శివాజీకి కానుకగా సమర్పిస్తే ఆమెని చూసి శివాజీ 'మా అమ్మ ఇంత అందంగా ఉంటే నేనెంత అందంగా ఉండేవాడినో! 'అని ఆమెని తిరిగి సగౌరవంగా వెనక్కి పంపిస్తాడు. రాంజ గ్రామ అధికారి పాటిల్ ఓ పేద రైతు కూతురిని మానభంగం చేస్తే ఆత్మహత్య చేసుకుంటుది. అది తెలిసిన శివాజీ.. పాటిల్ కాళ్లు చేతులు ఖండించే తీవ్రమైన శిక్షని విధించి వెంటనే అమలు చేస్తాడు. శివాజీ తీర్పు విన్నాక రంగే పాటిల్ అక్కడ ఉన్న దాదాజి కొండదేవ్తో 'అర్హత ఉన్న వాళ్లే తీర్పు చెప్పాలి. ఆ అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది లేదా రాజుకి ఉంటుంది కాని శూద్రుడైన శివాజికుండదు, అని శివాజీ కులాన్ని ప్రశ్నిస్తాడు.
ఒక సువిశాల మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి ఏ బ్రాహ్మణుడు ముందకు రాలేదు. కారణం శివాజీ శూద్రుడు కాబట్టి. హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకు క్షత్రియులకి మాత్రమే రాజయ్యే హక్కుంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గగాభట్ అనే బ్రాహ్మణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలుతో గగాభటుడు శివాజీ నుదుట తిలకం దిద్ది రాజ్యాభిషేకం చేస్తాడు. వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని చెప్పింది. మహా చక్రవర్తి ఐన శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణవాదం ఆ తర్వాత కాలంలో తన పబ్బం గడుపుకునేందుకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా, కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది. శివాజీని స్వయం శక్తి లేని వాడుగా భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్టు మూఢవిశ్వాసాన్ని ప్రచారం చేసింది. నిజానికి ఆధునికవాది అయిన శివాజీ అప్పుడు పోర్చుగల్లో తయారు చేయించిన కత్తి అది. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియంలో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేశాడే తప్ప ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయ వాదానికి ప్రతీకగా నిలబెట్టారు. శివాజీ ముస్లిం వ్యతిరేకి ఐతే తన సైన్యంలో మూడో వంతు ముస్లింలెలా ఉంటారు? శివాజి ముస్లిం వ్యతిరేకి అయితే సాయుధ దళాలలో ముఖ్యమైన ఆయధాగార అధిపతిగా ఒక ముస్లింని నమ్మి ఇబ్రహీం ఖాన్ని ఎలా నియమించుకుంటాడు? శివాజీ నౌకాదళాధిపతి దౌలత్ఖాన్ ఒక ముస్లిం. శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ ఒక ముస్లిం. ఈ మదాని మెహతర్ శివాజీని ఔరంగజేబ్ ఆగ్రాలో బంధించినప్పుడు మారువేషంలో శివాజీ కోసం తన ప్రాణాలొడ్డి తప్పించుకునేందుకు సాయం చేస్తాడు. శివాజీకి సన్నిహితుడు, విదేశి వ్వవహారాల మంత్రి ముల్లా హైదర్ ఒక ముస్లిం. సలేది యుద్ధం తర్వాత ఔరంగజేబు సైన్యాధికార్లతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరపున దూతగా కాజీ హైదర్ అనే ముస్లింని పంపిస్తాడు. శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు దర్గాని కట్టించాడు. ఉర్దూ నిఘంటువును అభివృద్ధి పరిచాడు. అటువంటి ఈ దేశ బహుజన మూలవాసీలకు చెందిన గొప్ప చక్రవర్తి శివాజీని ఈ రోజు బ్రహ్మనీకరణం చేసి మనల్ని మోసం చేస్తుంటే దాన్ని తెల్సుకోకుండా మతం మత్తులో అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణీయ మాయాజాలంలో నిండా మునిగి మనం పావులుగా మారితే మనలను చరిత్ర క్షమించదు.
బహుజనుల హితం, కోరే బహుజనుల సుఖం కోరే సమసమాజ రాజ్య నిర్మాణం దిశగా అడుగులు వేయాలి. మహాత్మ జ్యోతిబాఫూలే చెప్పినట్టు ఆ 'కుల్వాడీ భూషణ్' ( రైతులలో శ్రేష్టుడు) ఐన ఛత్రపతి శివాజీని సరిగ్గా అర్థం చేసుకోగలిగినప్పుడే మనమీ ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోగలం.
సెల్: 9908198484