అక్కడి భూములన్నీ దళిత, గిరిజనులవే. ఏండ్ల తరబడి సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ భూములపై ప్రభుత్వం కన్నుపడింది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ఆ భూములు చాలా విలువైనవి. ఆ భూములకు కూతవేటు దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్టు. చుట్టుపక్కల ఎన్నో కంపెనీలు వెలిశాయి. ఇంత విలువైన భూములు దళిత, గిరిజనుల చేతుల్లో ఉండటాన్ని గమనించిన సర్కారు అక్కడ ఇండిస్టీస్ పార్కు నిర్మాణం చేయాలని తలచింది. అందుకు ఆ భూములను ఇవ్వాలని ప్రభుత్వ కోరగా బాధితులు తప్పని స్థితిలో సర్కారు నిర్ణయాన్ని శిరసావహించేందుకు సిద్ధపడ్డారు. కానీ పరిహారం విషయంలో ప్రభుత్వం చేస్తున్న దగాను గుర్తించి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూత వేటు దూరంలో ఉండే ఈ భూములు చాలా విలువైనవి. పరిశ్రమల పేరుతో ఈ దళితుల భూములను కారుచౌకంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవల్లి గ్రామంలో 1900 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ భూములను ఏండ్ల తరబడి దళిత , గిరిజనులు సాగు చేసుకుంటున్న ఈ భూముల్లో ఇండిస్టియల్ పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో రంగంలోకి దిగిన టీఎస్ఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండిస్టీస్ ఇంఫ్రాస్టక్చర్) ఆ భూములు కావాలని కోరింది. అయితే ప్రభుత్వ నిర్ణయం మేరకు భూములు ఇచ్చేందుకు బాధితులు అంగీకరించారు. కానీ పరిహారం విషయంలో పేచీ కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు అత్యంత దగ్గరగా ఉండే ఈ భూములకు ప్రభుత్వం కేవలం ఎకరాకు రూ.9 లక్షలు మాత్రమే ఇస్తామంటుంది. కానీ 2013 చట్టం ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించి తమకు పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 1900 ఎకరాల భూములు నాలుగు గ్రామాల పరిధిలో ఉన్నాయి. అవన్నీ దళిత, గిరిజనుల భూములు. అయితే ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఈ రైతుల్లో ఒక్కొక్కరి పేర న్యాయంగా ఉన్న భూమికి బదులు తక్కువగా రికార్డుల్లో నమోదు చేసి అంత భూమికే పరిహారం ఇస్తామంటున్నారు. ఉదాహరణకు ఒక రైతు సాగులో ఐదెకరాల భూమి ఉండగా 2 లేదా 3 ఎకరాల భూమినే రికార్డుల్లో చూపిస్తున్నారు. ఆ భూమికి మాత్రమే నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఆశ్రయించారు. న్యాయంగా వారి పేర ఎంత భూమి ఉందో అంత భూమికి మార్కెట్ రేటు నిర్ణయించి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇచ్చర్ల ఫార్మా కంపెనీలో రూ.12లక్షలు ఎకరానికి చెల్లించారు. అలాగే మల్లన్నసాగర్ తదితర చాలా ప్రాంతాల్లో నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రజల పోరాటంతో మెరుగైన తీరు కనబరిచారు. కానీ శంషాబాద్ ఎయర్పోర్టుకు కూతవేటు దూరంలో ఉన్న ఈ 1900 ఎకరాల భూములకు రూ.9లక్షలే ఇస్తామనడం భావ్యం కాదని పోరాడుతున్నది. తక్షణమే ఈ భూములకు మార్కెట్ రేటు నిర్ణయించాలనీ, 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.
T10 digital channel సౌజన్యంతో....
న్యాయం చేయకపోతే తిరుగుబాటు తప్పదు
ఇక్కడ అనేక రకాలుగా బాధితులను మోసం చేస్తున్నారు. ఒక్కో రైతుకు 5 ఎకరాల భూమి ఉండగా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం 2 లేదా 3 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు చూపించి అంత వరకే పరిహారం చెల్లించాలని కుట్ర పన్నుతున్నారు. దీంతో తాము ఏండ్ల తరబడి సాగులో ఉన్న భూమి మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని దానికి పరహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. కలెక్టర్ గ్రామాన్ని సందర్శించాలి. బాధితులకు న్యాయంగా రావాల్సిన పరిహారం చెల్లించాలి. స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీఓలపై బాధిత రైతులకు నమ్మకం లేదు. ఇక్కడ జరిగే అన్యాయానికి వారే కారణమని బాధిత రైతులు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ ఒత్తిడి కారణంగానే ఇక్కడ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జాయింట్గా అక్కడ గ్రామ సభలు నిర్వహించాలి. లేకుటే పెద్ద ఎత్తున అవినీతి జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకుండా ఒంటెద్దు పోకడలు పోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 11న తహశీల్దార్ కార్యాలయం ముట్టడికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాధితులు సిద్ధమవుతున్నారు.
- వెంకటరాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Authorization