రవికుమార్ సంగనమోని
బలహీనులారా బాధితులారా సోదరులారా లేవండి
భానిసభావ సంకెళ్ళను తెంచుకొని కదలండి
శతాబ్దాల అనంతరం చదువు మన చేతికందె
చదువుదాం, మన బిడ్డలను చక్కగా చదివిద్దాం
విజ్ఞానంతో మన బతుకులు మనమే మార్చేసుకుందాం
మనువాద భావాలు మనపాలిట శాపాలు
చీకటిలో వేదనతో ఇన్నాళ్లు మునిగిపోయాం
నిద్రలోంచి మేల్కందాం, ధిక్కరించి నేర్చుకుందాం
పై కవితా పంక్తులు సావిత్రిభాయి రాసినవి. అవిద్యను ఎదుర్కొంటున్న మహిళల పట్ల బీద సాదల పట్ల తన అంతరంగంలో పడిన వేదన ఫలితంగా వచ్చినవి. ఆధునిక విద్యా పితామహుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే అర్థాంగి, ధీరవనిత, కవయిత్రి, తొలి మహిళా ఉపాధ్యాయు రాలు సావిత్రిభాయి ఫూలే. సమాజ చైతన్యం, అంధ విశ్వాసాల విముక్తి కోసం జ్యోతిరావ్ ఫూలే చేసిన ఉద్యమాలకు సంపూర్ణ మద్దతునిచ్చిన వ్యక్తి సావిత్రి. భర్త ఆశయమైన మహిళా విద్యా చైతన్యం కోసం జీవితాన్ని త్యాగం చేసింది. ధర్మం పేరిట ఆనేక శతాబ్దాలపాటు మహిళా చైతన్యాన్ని తొక్కిపెట్టడానికిగాను దేశంలో మహిళలకు విద్యను నిషేధించారు. ఆ నిషేధాన్ని ధిక్కరిస్తూ మహిళలను విజ్ఞానవంతుల్ని చేయడానికి సమాజం నుండి ఎన్నో అవమానాలను, చిత్కారాలను, ఆసత్య నిందలను భౌతిక దాడులను ఎదుర్కొని ఆశయసాధనలో మునిగింది. అలా అత్యవసర సామాజిక పరిస్థితుల్లో ప్రారంభమైన మహిళా విద్య నేటికి ఎన్నో సత్ఫలితాలను ఇచ్చింది. అలా ఆమె వేసిన బీజాలే నేడు మహావృక్షాలై మహిళలకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్చ అనే కమ్మని ఫలాలను అందిస్తున్నాయి. విద్య ద్వారా మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, న్యాయవాదులుగా, రక్షకభటులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, శాస్త్రవేత్తలుగా ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఒకనాడు ధర్మ గ్రంధాల పేరుతో తమకు పెట్టిన అనేక ఆంక్షలనే సంకెళ్లను బద్దలు కొడుతూ నేడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. ఆడది అంటే అబల, అస్వతంత్రురాలు అనేది పాతసూత్రం. దాన్ని అధిగమిస్తూ అబల కాదు పట్టువదలని శక్తి అని నిరూపిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన చారిత్రాత్మకమైన ప్రాజెక్టు మెట్రోరైలు. గత సంవత్సరం అట్టహాసంగా దీనిని ప్రారంభించుకున్నాం. ఆ రైలును నడిపిన వ్యక్తులు ముగ్గురు నారీమణులు కావడం యావత్ మహిళా ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. ఉత్సాహం కలిగించే ఇలాంటివన్నీ నాణేనికి ఒకవైపే. మరోవైపు ఛాందస భావాలకు లోనవుతూ విద్యా చైతన్యానికి ఆమడ దూరంలో ఉన్నవాళ్లెందరో నేటికీ బాలికా విద్యా ప్రాధాన్యతను అర్థం చేసుకోలేక, చదువుల్లో రాణిస్తున్న బాలికలను విద్యకు దూరం చేస్తున్నారు వారి తల్లిందండ్రులు. వారలా చేయడానికి కూడా కారణాలు లేకపోలేదు. బాలికలు చదవడం వలన తమకు ప్రత్యక్ష ప్రయోజనం లేదని భావించడం, బాగా చదివిస్తే పెండ్లి చేసిననాడు ఎక్కువ కట్న కానుకలు ఇవ్వాల్సిరావడం. అక్షర జ్ఞానం వస్తే చాలు అనుకోవడం. వివిధ పరిస్థితుల కారణంగా వారలా భావించడం సరైనదేనా? అంటే కాదనే చెప్పాలి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. విజ్ఞానవంతులు, ఉన్నత చదువులు చదివి తమ కాళ్లపై తాము నిలబడుతూ, కుటుంబాలను పోషిస్తూ భరోసాగా ఉన్నవారెందరినో మనం చూడవచ్చు. నేటి సమాజంలో విద్య మహిళకందించే నైతిక స్థైర్యాన్ని మనం అంచనావేయలేం. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ వ్యక్తిగతంగా ఎదగడానికి తద్వారా సామాజిక చైతన్యానికి వారికి విద్య ఒక ఆయుధంగా పనిచేస్తుంది.
మహిళలు మానసికంగా పురుషులతో ఏమాత్రం తీసిపోరనే విషయం సమాజం గ్రహించాలి. చరిత్రలో ఎంతోమంది మగువలు తమ ధైర్యసాహసాలతో, ప్రతిభాపాటవాలతో రాజ్యాలను పాలించారు అని కథలుగా చదువుకున్నాం. అనంతర కాలంలో రాజకీయాల్లో రాణించిన, రాణిస్తున్న మహిళలెందరో ఉన్నారన్న విషయం మనకు తెలియంది కాదు. దీనంతటికీ కారణం వారికి వారిపై నమ్మకం, రాజకీయ చైతన్యం, ధైర్యసహసాలే. వీటిని అందించింది నిస్సందేహంగా విద్యే. మన తెలుగు రాష్ట్రాల్లో సామాజిక ఉద్యమకారిణులెందరో మహిళా హక్కుల కోసం, వారి విద్యా చైతన్యం కోసం పనిచేసున్నారు. ఇలా సమాజ శ్రేయస్సుకోసం నిరంతరాయంగా పోరాడుతున్న వారికి ఎందరో అభ్యుదయవాదులు ప్రత్యక్షంగా పరోక్షంగా వెన్నుదన్నుగా నిలుస్తుండటం నిజంగా మంచి మరిణామం. ఛాందస భావాల నుంచి మహిళలను రక్షిస్తూ వ్యక్తిగతంగా, సామాజికంగా వారు ఎదగడానికి మనమంతా కృషి చేయాలి. సహకారం అందించాలి. అప్పుడే చదువులతల్లి సావిత్రిభాయి ఫూలే చేసిన త్యాగాలకు సార్థకత చేకూరి, ఆమె ఆశించిన ఆదర్శ సమాజం ఏర్పడటానికి అడుగులు పడినట్లవుతుంది.
సెల్ : 7893903740
తొలి పంతులమ్మ
మహిళాలోకం జనగీతం
సావిత్రిబాయి ఫూలే
అణిచివేతను ఎదిరించిన
తొలి పంతులమ్మ నీవే
కరుడుకట్టిన కులతత్వాన్ని
మతాన్ని ఎదిరించి
తిరుగుబాటుకు తిలకం దిద్ది
చదువును సంధించి
బానిస భావాలను నిలదీసిన
సజనశీలివమ్మా
భారత మహిళా లోకానికి
నువు వేగుచుక్కవమ్మా
మహిళా విముక్తికై నినదించి
సాధించగ పోరాటాన్నెంచి
కలాన్ని కత్తిగా దూసిన వనితవు
మనువాదాన్నెదిరించి నిలిచినావు
అంతరాల దొంతరలను వెతికిన
పరిశోధన నీదే
అభ్యుదయానికి ఆనవాలుగా
నిను నిలిపినాడు ఫూలే
భర్తే గురువై నీలో సగమై
చదువు నేర్పెనమ్మా
బాలికలకు విద్యను బోధించిన
మొట్ట మొదటి పంతులమ్మ
మనువాదులు నిను అవమానిస్తే
మహిళా చదువులు వ్యతిరేకిస్తే
గుడికన్నా బడి గొప్పదంటివి
చదువుతోనే సమాధానమంటివి
స్త్రీ పురుషులు సమానమంటు
నగార మోగించి
భావి తరాలకు సమానత్వమనే
ఆయుధమందించి
వితంతువులకు అండగ ఉండి
జరిపినావు పెళ్ళీ
నెత్తుటి భూమిలే మట్టి బిడ్డలతో
విత్తనాలు జల్లి
ప్రతీ పల్లె సావిత్రి బాయిలు
హక్కుల పోరులో నాగటి సాగులు
సమానతను తలకెత్తుకున్నరు
సమరానికి సై సైయ్యంటున్నరు
మహిళా లోకం జనగీతం
నీ జీవిత మందించిన సందేశం
''మహిళా''
- సాంబరాజు
93460 18141
Authorization