సంగ్రామ్
గొప్పగా చదివి సమాజానికి విద్యాబుద్దులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తమ వద్ద పని చేస్తున్న వంట మనిషిని కులం పేరుతో దూషించి విధుల నుండి తొలగించి తన నీచపు బుద్దిని చాటుకున్నారు కంగ్టి కస్తూర్బా గాంధీ బాలిక వసతి గృహ ప్రత్యేక అధికారి.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల వి ద్యాలయం ప్రత్యేకాధికారి ఫాతిమా తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సిర్గాపూర్కు చెందిన నైని భూమవ్వ కంగ్టి కేజీబీవీలో 2014లో రెండో వంట మనిషిగా ఔట్ సోర్సింగ్పై నియామకమైంది. కుటుంబ సమస్యలతో ఇద్దరు ఆడ పిల్లల పోషణ భారంగా మారిన భూమవ్వ పరిస్థితి చూసిన అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ భూమవ్వకు ఉపాధి కల్పించాలని ఆర్వీఎం అధికారులను ఆదే శించారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా కంగ్టి కేజీబీవీలో ఔట్ సోర్సింగ్పై వంట మనిషిగా చేరింది. రెండేండ్లపాటు కేజీబీవీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసింది. గత రెండేండ్లుగా ప్రత్యేకాధికారి పాతిమా తనను అంటరానిదానివంటూ మానసికం గా హింసిస్తోందని వాపోయింది. వంట మనిషిగా చేరిన తనతో సొంత పనులూ చేయించుకుందని ఆమె ఆరోపించింది. కులం పేరుతో దూషించడమే గాక దురుసుగా ప్రవర్తిస్తోందన్నారు. ''నిన్ను తొలగించాను, పాఠశాలకు రావద్దంటూ'' హెచ్చరిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. దీంతో ఇద్దరు ఆడ పిల్లల పోషణ భారంగా మారిందని కన్నీటి పర్యంతమైంది. మానసిక స్థితి బాగాలేదని ఆరోపిస్తూ పొట్ట కొడుతోందని ఆరోపించింది. అవసరమైతే అధికారులు తన మానసిక స్థితిని పరీక్షించాలని భూమవ్వ డిమాండ్ చేసింది. అయితే భూమవ్వను తొలగించాలని ఆర్వీఎం జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు ఇంకా రాకపోయినా భూమవ్వ విధులకు రాకుండా ఎస్వో అడ్డు తగలడం గమనార్హం.
ఇలా సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి, సభ్య సమాజం సిగ్గుపడేలా కులాలు, మతాలంటూ అవమానించడం ఉపాధ్యాయురాలికి తగని పని. 2014లో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు దళిత వర్గానికి చెందిన భూమవ్వను వంట మనిషిగా చేర్చుకున్నారు. అప్పటి నుంచి మంచిగానే పని చేసిన భూమవ్వను గత ఆరు మాసాలుగా ''నీవు అంటరానిదానవు. వంట చేయడానికి పనికి రావంటూ'' వేధించి చివరికి అక్కడి నుంచి వెళ్లగొట్టింది. ఇతరులకు బుద్ధి చెప్పాల్సిన హోదాలో ఉండి చదువు లేనివారు, అజ్ఞానులు వ్యవహరించినట్టు తనే ఇంతటి దాష్టీకానికి ఒడిగట్టింది. సాటి మహిళ అని కూడా చూడకుండా కులం పేరుతో అవమానించడం సిగ్గు చేటు. ఆర్వీఎం అధికారులు ఆమెను ఔట్ సోర్సింగ్ కింద వంట మనిషిగా నియమించుకున్నప్పటికీ కేజీబీవీ ప్రత్యేక అధికారి ఫాతిమా మాత్రం, కులం పేరుతో హింసించడమే కాకుండా ప్రత్యేకంగా కక్షగట్టి లేనిపోని అభాండాలు వేసి వంట మనిషిగా పనికి రాదని అర్వీఎం అధికారులకు ఫిర్యాదు చేసింది. మారుమూల ప్రాంతంలో కుల రక్కసి తాండవిస్తుంటే నివారించాల్సింది పోయి చదువుకొని గురువు స్థానంలో ఉండి కూడా ఇలా ఈ ప్రత్యేక అధికారిణి కుల దురహంకారాన్ని ప్రదర్శించడం శోచనీయం. కుల నిర్మూలన పాఠశాల నుండే ప్రారంభం కావాలి. అలాంటిది ఈ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే కులం పేరుతో సూటిపోటి మాటలు అంటుంటే, వాటిని పిల్లలు కూడా అనుకరించే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి కుల దురహంకారానికి పాల్పడకుండా ఉంటారు.
సెల్ : 9652075318
ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలి
విద్యాబుద్దులు నేర్పి సమాజాన్ని మార్చాల్సిన ఉపాధ్యాయురాలు కుల దురహంకారంతో ఒక వంట మనిషిని అవమానించడం సిగ్గుచేటు. ఇలాంటి కుల చీడ పురుగులను ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించాలి. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కఠినంగా శిక్షించాలి.
- కొటారి నర్సింలు,
కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
Authorization