లక్ష్మీదేవునిపల్లి.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో మారుమూల గ్రామం. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని గ్రామం. కానీ వివాదాల్లో మాత్రం ముందుంది. గత సర్పంచ్ ఎన్నికల్లో గ్రామం ఎస్సీ రిజర్వ్ అయింది. అదే సామాజిక తరగతికి చెందిన సుమలత పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కానీ సర్పంచ్ స్థానంపైన కన్నెసిన ఇతరులు.. పోటీ నుంచి తప్పుకోవాలని ఆమెను బెదిరించారు. అయినా ఆమె పట్టువిడవకుండా పోటీలో నిలిచి గెలిచింది. అప్పటికే అగ్రహంతో ఉన్న కొందరు.. కులం నుంచి ఆమెను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఆమెతో మాట్లాడితే రూ.25 వేల జరిమానా విధిస్తామని కులస్తులను హెచ్చరించారు. వీరి ఆగడాలు మితిమీరడంతో ఈ నెల 16న పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
లక్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన సుమలత ఆర్థిక ఇబ్బందుల కారణంగా 7వ తరగతి వరకు చదువుకొని మానేసింది. ఇంటి దగ్గరే ఉంటూ ఇంట్లో పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. ఎలాగోలా తాను చదువు కొసాగించాలని ఓపెన్లో పదవ తరగతి వరకు చదివి ఉత్తీర్ణులైంది. వివాహమై ఒక బాబు పుట్టిన రెండేండ్లకే భర్త ప్రమాదంలో మరణించడంతో పుట్టింట్లోనే ఉంటుంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండేది. ఇటీవల తన తల్లి సిద్ధవ్వ మరణించడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. అనంతరం ఎన్పీఎంవీఏగా వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, ఇటు మధ్యాహ్న భోజనం వంటలు చేస్తూ తండ్రి, కుమారుడిని పోషించుకుంటూ జీవిస్తోంది.
అనుకోకుండా సర్పంచ్గా పోటీ
సర్పంచ్ ఎన్నికల్లో లక్మీదేవునిపల్లి గ్రామానికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో సర్పంచ్గా పోటీ చేయాలని నిశ్చయించుకుంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. తన వద్ద డబ్బులేకున్నా గ్రామస్తులు విరాళాలు ఇవ్వడంతో పోటీ చేసింది. ఈ నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకోవాలని కులసంఘం నుంచి హెచ్చరిక వచ్చింది. క్రమంగా ఒత్తిడి తీవ్రతరం చేశారు. పోటీలో నుంచి తప్పుకోవాలని లేకుంటే సంఘం నుంచి బహిష్కరిస్తామని, నీ కుటుంబంతో ఎవరూ మాట్లాడబోరని హెచ్చరించారు. అయినా బరిలో నిలిచి తన ప్రత్యర్థిపై 312 ఓట్ల అధిక్యంతో సర్పంచ్గా గెలిచింది.
కులం నుంచి బహిష్కరణ
సర్పంచ్గా గెలిచినా ఆమె ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కులస్తులు చెప్పినా వినకుండా సర్పంచ్గా పోటీ చేసి గెలుస్తావా? అంటూ కులం నుంచి బహిష్కరించారు. తమ కులస్తుడు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లిన ఆమె తండ్రిని కులస్తులు గెంటేశారు. దశదినకర్మ రోజు గుండు చేసుకోనివ్వకుండా, అక్కడికి ఎందుకు వచ్చావంటూ నెట్టేశారు. దీంతో జరిగిన విషయం ఆమె కూతురు సుమలతకు చెప్పాడు. కులస్తుల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, అధికారులు గ్రామాన్ని సందర్శించారు. కులస్తులతో సమావేశమై కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామంలో అందరూ కలిసిమెలసి ఉండాలని, బహిష్కరణ లాంటి చట్టవిరుద్ధ పనులు చేయొద్దని సూచించారు. దీంతో కులస్తులు వెనక్కుతగ్గారు. అందరితో కలిసి ఉంటామని తెలపడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. కానీ ఎప్పుడు ఏ రూపంలో బుసకొడుతుందో తెలియదు. అయినా వెరువక పోరాడుతున్న సుమలత అభినందనీయురాలు.
సెల్ :9248155353
ఆదర్శ గ్రామంగా తీర్చడమే లక్ష్యం
సర్పంచ్ విధులు, అధికారాలు ఇంకా పూర్తిగా తెల వదు. తెలిసిందల్లా అవినీతికి పాల్పడకుండా మా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే. అన్ని వివ రాలు తెలుసుకుటా. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా. ప్రస్తుతం గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రజల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా.
- సుమలత, సర్పంచ్
Authorization