ఓగోటి కిరణ్కుమార్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో కుల బహిష్కరణలు ఎక్కువ య్యాయి. కుల కట్టుబాట్ల పేరుతో జరుగుతున్న ఈ బహిష్కరణలపై ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడంతో వీటి తీవ్రత ఎక్కువవుతోంది. కొన్ని ప్రాంతాల్లో బహిష్కరణలు ఏండ్ల తరబడి కొనసాగిన ఘటనలు రాష్ట్రంలో ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా రాఘవపట్నంలో మరో కుల బహి ష్కరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో ఎగోలపు లక్ష్మీరాజం కుటుంబాన్ని అదే కులానికి చెందినవారు కుల బహిష్కరణ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కులం మాట వినలేదని ఇక్కడ లక్ష్మీరాజంను కుల బహిష్కరణ చేస్తున్నట్టు కుల పెద్దలు తీర్మానం చేశారు. గత నెల మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ఇటీవలే వెలుగుచూసింది. బహిష్కరణకు గురైన లక్ష్మీరాజంకు గ్రామంలోని ప్రజలు ఎలాంటి సహకారం అందించకూడదని తీర్మానించారు. ''కూలి పనులకు పిలువకూడదు. ఎవరూ అతనితో మాట్లాడకూడదు, కిరాణ షాపుల్లో సరుకులు అమ్మకూడదు, ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ఎక్కించుకోకూడదు'' ఇలా కుల బహిష్కరణకు గురైన వారికి ఎలాంటి సహకారం అందించకుండా గ్రామస్తులతో అవినాభావ సంబంధాలు కలిగి ఉండకుండా మానసికంగా హింసిస్తారు. ఒక రకంగా బాధితుడు జనం మధ్యలోనే ఉన్నా అభయారణ్యంలో ఉన్న దుస్థితిని తలపింపజేస్తారు. ఈ క్రమంలో బాధితుడు కుల పెద్ద మనుషులను తమపై విధించిన కుల బహిష్కరణను ఎత్తి వేయాలని కుల సంఘానికి విన్నవించుకున్నాడు. అయి నా కుల పెద్దలు వినిపించుకోలేదు. బతిమిలాడినా ఫలితం లేకపో వడంతో బాధితుడు పోలీసస్టేషన్లో ఫిర్యాదు చేశా రు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన పెద్ద గంగన్నను అదివరకే కుల బహిష్క రణకు గురి చేశారు. అతనికీ ఎలాంటి సహకారం అందించకూడదని తీర్మానం చేశారు. అతనితో ఎవరు మాట్లాడినా వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇలా బహిష్కరణకు గురైన వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే అవసరం నిమిత్తం కుల బహిష్కరణకు గురైన గంగన్నతో లక్ష్మీరాజం కొన్నిసార్లు మాట్లాడినట్టు కుల పెద్దలు చెబుతున్నారు. దీంతో కుల సంఘం పెద్ద లు లక్ష్మీరాజం కుటుంబాన్ని కూడా కులం నుంచి బహిష్కరించారు. ఈ ఘట నలపై పోలీసులు విచారణ జరుపుతు న్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుల బహిష్క రణను ఎత్తివేసే విధంగా ప్రయత్నిస్తున్నారు.
సెల్ : 9666011107
కుల బహిష్కరణలు దుర్మార్గం
ప్రపంచ దేశాలతో శాస్త్ర, సాంకేతిక రంగాలలో పోటీ పడుతూ దూసుకుపోతున్న తరుణంలో కూడా ఇంకా కుల బహిష్కరణల చట్రంలో నలిగిపోవడం దారుణం. ఇలాంటి కుల పీడనల నుండి అణగారిన వర్గాలు బయటపడాలి. అందరూ ఐక్యంగా ముందుకు సాగాలి. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి కావాలి. కానీ సాటి మనిషిని మానసికంగా పీడించే కుల బహిష్కరణల వంటి దుర్మార్గపు ఆలోచనలకు దూరంగా ఉండాలి. అదే అణగారిన జాతుల ఐక్యతకు, భవిష్యత్తుకు మంచిది.
- మేడే శాంతికుమార్, మాల, మాదిగల సమాఖ్య సమితి