బందెల రాజశేఖర్:
తెలంగాణ ప్రాంతంలో నేటికీ మనువాదపు ఛాయలు కొనసాగుతున్నాయి. మనువాద రాజ్యాంగం సమాజం లో చాపకింద నీరులా ఇంకా అమలవుతోంది. పలుచోట్ల దళితులపై దాడులు కొనసాగడమే ఇందుకు నిదర్శనం. దళితులు రాజకీయంగా చైతన్యం అవుతున్న నేపథ్యాన్ని జీర్ణించుకోలేని అగ్రకులాల నాయకులు అణిచివేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రచార సభలో ఏర్పాటు చేసిన భోజనంలో ఒక దళిత మాజీ సర్పంచి భర్త అన్నం తింటుండగా ''దళితుడివైనా నీవు మా ముందే కుర్చీలో కుర్చొని తింటావా..? నీకు ఎంత మోరారా..?'' అని బూతులు తిడుతూ ఆధిపత్య కులాల నాయకులు ముకుమ్మడి దాడి చేయడం ఇందుకు నిదర్శనం. ఇది ఎక్కడో కాదు సామాజిక ఉద్యమాల గడ్డ అయినా జగిత్యాల పట్టణానికి కూతవేటు దూరంలో రూరల్ మండలంలోని అబ్సిషాపూర్ గ్రామంలో చోటు చేసుకోవడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది.
అసలేం జరిగింది..
జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని హబ్సీపూర్ గ్రామంలో గతనెల 28న నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించారు. ఆ సందర్భంగా గ్రామంలో టీఆర్ఎస్ తరుపున ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎండపెట్ల గంగయ్య ( ఇతను మాజీ సర్పంచ్ కమల భర్త) కొంత మంది దళిత మహిళలను తీసుకొని అన్నం తినేందుకు వెళ్లాడు. కుర్చీవేసుకొని భోజనం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన సర్పంచు మారె రాజేశ్వర్రెడ్డి (టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచు, ఎమ్మెల్యే సంజరుకుమార్కు అనుచరుడు) మరో నలుగురు అనుచరులతో వెళ్లి 'ఒక దళితుడివైనా నీవు, నీతోపాటు మీ కులం వారిని తీసుకొని వచ్చి మా ముందే కుర్చీలో కుర్చొని అన్నం తింటున్నా వా..? నీకు, నీ కులపోల్లకు ఎంత మోరారా..?' అని గంగయ్య గళ్ల పట్టి కింద పడేశారు. కిందపడిన గంగయ్యపై ఒకేసారి ఆ ఐదుగురూ కలిసి ముకుమ్మడిగా దాడి చేశారు. కుర్చీలు మీద ఎత్తేసి విచక్షణారహితంగా కొట్టారు. అడ్డుకు నేందుకు వెళ్లిన దళిత మహిళలను బెదిరిం చారు. దాడికి గురైన గంగయ్య తలకు, ము ఖం, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికిలో చికిత్స పొందాడు.
దళితుడు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేకే దాడి
అబ్సిషాపూర్ గ్రామంలో సుమారు వెయ్యి మంది ఓటర్లుంటారు. 300 మంది దళిత ఓటర్లుంటారు. ఈ ఊరిలో పెత్తనమంతా అగ్రకులాల వారిదే. దళిత కులానికి చెందిన ఎండపెట్ల గంగయ్య గత సర్పంచు ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అయన భార్య కమలను నిలబెట్టి గెలిపించాడు. దీనిని ఆధిపత్య కులాల వారు ఓర్వలేకపోయారు. మొన్న జరిగిన సర్పంచు ఎన్నికల్లో అ ఊరు జనరల్ అయింది. మారె రాజేశ్వర్రెడ్డి టీఆర్ఎస్ తరుపున పోటి చేసి గెలిచాడు. జనరల్ అయినప్పటికీ మరోసారి కాంగ్రెస్ తరుపున గంగయ్య పోటి చేసి ఓడిపోయాడు. 'జనరల్ స్థానం అయినా పోటి చేస్తావా?' అని ఎన్నికల సందర్భం నుండే గంగయ్యపై రెడ్డిలు కక్ష పెంచుకున్నారు. సర్పంచు ఎన్నికల తర్వాత గంగయ్య అయన అనుచరులతో కలిసి ఎంపీ కవిత, ఎమ్మెల్యే సంజరుకుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో గంగయ్య పోటీ చేసే అకాశాలుండటంతో తమకు ఊరిలో ప్రాధాన్యత తగ్గుతుందని కక్షతో గంగయ్యపై అదును చూసి దాడి చేసినట్టుగా గ్రామస్తులు అనుకుంటున్నారు.
సెల్ : 9490099402
నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి
దళితులు రాజకీయంగా ఎదగడాన్ని ఆధిపత్య కులాల నాయకులు జీర్ణంచుకోవడంలేదు. గంగయ్యపై ఆధిపత్య కులాల నాయకులు ఓర్వలేకనే దాడి చేశారు. వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేయడంలేదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైనా వారిని అరెస్ట్ చేయాలి. దాడికి పాల్పడిన సర్పంచు మారె రాజేశ్వర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద అరెస్ట్ చేసి గంగయ్యకు న్యాయం చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.
- తిప్పారపు సురేష్. కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడం లేదు
దళితుడినైన నన్ను ఒక మాజీ సర్పంచు భర్త అని కూడా చూడకుండా, రాజకీయంగా ఓర్వలేక అంతమంది ముందు సర్పంచు రాజేశ్వర్రెడ్డి తన అనుచరులతో కలిసి నాపై దాడి చేశారు. నాకు తీవ్ర అవమానం కలిగింది. దాడి చేసిన వారిపై దాడి జరిగిన మరుసటి రోజు జగిత్యాల రూరల్ పోలీసుస్టేషన్ ఎస్ఐకు ఫిర్యాదు చేశార. ముందుగా ఎస్ఐ సతిష్ మా ఫిర్యాదు తీసుకోలేదు. మీ గోడవ ఎమ్మెల్యే చెప్పాడనీ, ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడాడంటూ రాత్రి వరకు మమ్మల్ని నిరీక్షించేలా చేశారు. ఒత్తిడి తేవడంతో చివరకు కేసు నమోదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సంజరుకుమార్ జగిత్యాల డీఎస్పీ, సీఐతో ఫోన్లో కేసు కాకుండా చూడాలని ఒత్తిడి పెంచినట్టుగా తెలిసింది. డీఎస్పీ, సీఐ కూడా మా గ్రామానికి వచ్చి నాపై జరిగిన దాడిపై విచారణ జరిపారు. దాడి జరిగి పది రోజులవుతున్నా నిందితులను అరెస్ట్ చేయకుండా జాప్యం చేయడంతో పోలీసులపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. నాకు న్యాయం చేయాలి.
- ఎండపెట్ల గంగయ్య, బాధితుడు
Authorization