కె.సతీష్
కార్యదర్శి పంచాయతీకి ప్రభుత్వ అధికారి. అంతటి విలువైన పదవిలో ఉన్న పంచాయతీ కార్యదర్శినీ కులం వివక్ష అవమానించింది. ఆ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామసభలో సర్పంచ్, ఉప సర్పంచ్ తదితర గ్రామ పెద్దలు కూర్చీలపై కూర్చోగా కార్యదర్శి మాత్రం కింద కూర్చొని సభ నిర్వహించారు. కార్యదర్శి దళితుడు కావడమే ఇందుకు కారణమైంది.
చివ్వెంల మండల పరిధిలోని గుంజలూరు గ్రామంలో దళితులైన గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్నను దళితురాలనే కారణంతో కింద కూర్చోబెట్టి సమావేశం నిర్వహించారు. గుంజలూరు గ్రామంలో గతంలో దళితులను అవమానపరిచి, కులం పేరుతో దూషించగా కేసులు నమోదైన ఘటనలున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆధిపత్య కులాల వారు సర్పంచ్గా గెలిచారు. దీంతో నూతన పాలక మండలి ఏర్పడిన మొదటి సమావేశంలోనే సర్పంచ్, ఉప సర్పంచ్ సర్పంచ్ కుమారుడు కుర్చీలో కూర్చుంటే పాలనాధికారి అయిన గ్రామ కార్యదర్శిని మాత్రం కింద కూర్చోబెట్టడాన్ని ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కార్యదర్శిగా గ్రామంలో పాలనా వ్యవస్థను చక్కబెట్టాల్సిన ఒక ప్రభుత్వ అధికారి అవమానకరంగా కింద కూర్చుని గ్రామసభ నడిపించడాన్ని గ్రామంలోని దళిత సంఘాల నాయకులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు పూర్తిగా తప్పు పడుతున్నారు. కానీ విజ్ఞానవంతులైన పాలనాధికారే ఇలా ఆధిపత్యవర్గాల ముందు కూర్చో కూడదనీ, నేనే కావాలని కూర్చోలేదని సమాధానం చెప్తుంటే జాతి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదని గ్రామంలోని ప్రజా సంఘాల నాయకులు పంచాయతీ కార్యదర్శిపైన తీవ్రమైన ఆక్రోశం వెళ్ళబుచ్చుతున్నారు.
సెల్ :9177943970
ఆధిపత్య వర్గాల అహంకారానికి నిదర్శనం
గ్రామసభలో ఒక పాలనాధికారి కింద కూర్చొని సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీకి సంబంధం లేని ఆమె కుమారుడు కుర్చీలో కూర్చొని గ్రామసభ నడిపించడమంటే సమాజాని కి ఏమి సంకేతాలు పంపుతున్నారో అర్థం కావడం లేదు. ఇది ఆధిపత్య వర్గాల అహంకారానికి నిదర్శనం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తించే ముందు తన స్థాయిని గుర్తించాలి. మనిషిగా ఇలా ప్రవర్తించడం ఆమెకూ తగదు.
- మోలుగురి సైదయ్య,
సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి
దళిత జాతికి అవమానం
గ్రామ సభలో పాలనావిభాగంలో ఎలాంటి సంబంధంలేని సర్పంచ్ తనయుడు కుర్చీలో కూర్చుంటే పాలనాధికారి అయిన పంచాయతీ కార్యదర్శి కింద కూర్చొని సభ నడిపించడం దళిత జాతిని అవమాన పరిచినట్టుగానే భావిస్తున్నాం.
- బొల్లికొండ సైదులు, వార్డు సభ్యులు
Authorization