వనం నాగయ్య
అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరలే దన్న కక్షతో ఏకంగా గ్రామప్రథమ పౌరురాలైన సర్పంచ్నే గ్రామబహిష్కరణ చేశారు. మహిళా సర్పంచ్ అందులోనూ ఆదివాసీ గిరిజన మహిళ కావడంతో ఆ గ్రామంలోని కులపెద్దలు ఏకపక్షంగా తీర్పుచెప్పి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ను తీవ్ర అవమానానికి గురిచేశారు. ఃఃమేము చెప్పినట్టు టీఆర్ఎస్ లో చేరలేదు కాబట్టి నీ కుటుంబంతోపాటు గ్రామంలోని నీ బంధువులకు సంబంధించిన ఏడు కుటుంబాలను కూడా మా కులం నుంచి బహిష్కరిస్తున్నాంఃః అని తీర్మానం చేశారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఏకంగా సర్పంచ్ కుటుంబాన్నే తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసిన ఈ ఉదంతం ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలోని ఉట్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవి...
ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలోని ఉట్నూరు గ్రామంలో 2018 డిసెంబర్ 21న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర అవగాహనతో ఉమ్మడి అభ్యర్థిగా పోదెం సులోచనను పోటీలో ఉంచారు. సులోచన ఘనవిజయం సాధించారు. అప్పటినుండి ఆమెను టీఆర్ఎస్లో చేరాలని ఆ పార్టీ స్థానిక నాయకులు ఏపూరి పాపారావు, ఈసం భాస్కర్, కొల్లి రాంప్రసాద్, గుంపెన పల్లి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటేశ్వర్లు, కొనకంచి శంకర్, సుధాకర్, తదితరులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తాను ప్రజలకి చ్చిన వాగ్దానం ప్రకారం పార్టీ మారబోననీ, తనకు టీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టంలేదని మొదటినుండీ ఆమె చెబుతూ వస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహానికి గురయ్యా రు.నువ్వు సర్పంచ్వైతే ఏంటి? మేం చెప్పినట్టే టీఆర్ ఎస్లో చేరాలి.. లేకపోతే నీ పాలన మాకు అవసరం లేదంటూ పలురకాలుగా బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా ఆమెతో పాటు ఆమె అనుచరులంతా తాము కాంగ్రెస్లోనే ఉంటామని తెగేసి చెప్పారు.
బహిష్కరణ ఆపై జరిమానా..
టీఆర్ఎస్లో చేరాలని అనేక విధాలుగా ఒత్తిడిచేసినా ఫలించకపోవడంతో సర్పంచును గ్రామంలోని బొడ్రాయి వద్దకు పిలిపించి నిన్ను, నీ కుటుంబానికి సంబంధించిన ఏడు కుటుంబాలను కులం నుండి బహిష్కరిస్తున్నాం అని వెల్లడించారు. అప్పటి నుండి తన కుటుంబానికి గ్రామంలో ఎవరింట్లో శుభకార్యాలైనా ఆహ్వానాలు పంపవద్దని హుకుం జారీచేశారు. దీంతో తాను ప్రథమ పౌరురాలినైనా ఇంతటి అవమానాన్ని ఎదుర్కొంటున్నానని ఆవేదనతో సర్పంచ్ సులోచన స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏసీపీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడే ఇరు వర్గాలను పిలిపించి వారికి అన్ని విధాలుగా చట్టం గురించి వివరించారు. వెలివేయడం, బహిష్కరించడం దుర్మార్గమైన చర్య అని సూచించారు. వెంటనే అంతా కలిసి ఉండకపోతే అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోగా పోలీసులు శాంతింప చేశారు.
సెల్ : 9490099343
కుల బహిష్కరణ తప్పుడు సంస్కృతి
ఓ మనిషిని సామూహిక బహిష్కరణ చేయడం అమానవీయం. ఈ దేశంలో చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారుల తీరు సక్రమంగా లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ కఠిన చర్యలు తీసుకోవడం లేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. ఓ గ్రామ ప్రథమ పౌరురాలినే బహిష్క రించిన వారిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.
- స్కైలాబ్బాబు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులబహిష్కరణ దుర్మార్గమైన చర్య
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లోనూ నేటికీ కులబహిష్కరణలు, వెలివేతలు చోటుచేసుకోవడం బాధాకరం. ఉట్నూరు ఘటన దురదృష్టకరం. ఒక ఆదివాసీ గిరిజన మహిళను ఇలా వెలివేయడం శోచనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
-దుగ్గికృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లాకార్యదర్శి
Authorization