కె.కె. :
అది తొలిసారిగా ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ... ఆ గ్రామ జనాభా 1200. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ (షెడ్యూల్డ్ క్యాస్ట్) రిజర్వేషన్ వచ్చింది. గ్రామాభివద్ధిలో ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతున్న తరుణంలో ఆదిలోనే హంసపాదు.. అతను ప్రజల చేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి ..
భారత రాజ్యాంగం ద్వారా.. శాసనం ద్వారా నిర్మితమై ప్రజల కొరకే ..ప్రజా సంక్షేమం కోసం నియమించబడ్డ గ్రామ ప్రథమ పౌరుడు.. ప్రజలకు అనునిత్యం ఐదేండ్లు జవాబుదారిగా ఉండే ప్రజాపరిపాలకుడు. గ్రామ సర్పంచ్... ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా పాలకుడు ....ప్రజలందరిలో సమైక్యత కోసం, వారి బాగుకోసం గ్రామంలో పండుగలు, ఉత్సవాలు, జాతరలు జరపాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. అలాంటి ఆయనను ''నీవు తక్కువ జాతి (దళితుడివి) వాడివి ...నీవు ఈ దేవుడి తీర్థ ప్రసాదం ముట్టుకోరాదు.. వండిన వంటల దగ్గరకు రావొద్దు. నీ మైల మాకు అంటుతది.. నీవు మాకు వడ్డిస్తే మేము తినాలా?'' అని ప్రత్యక్షంగా అక్కడున్న ఆధిపత్య కులాల వారు సాక్ష్యాత్తు గ్రామ సర్పంచ్ను సూటి పోటీ మాటలతో అవమానపరిచారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.. గత ఆదివారం 14/04/19 రోజున తొలిసారిగా గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా.. గ్రామ బాగుకోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమక్షంలో వైభవంగా శ్రీరాముడి కళ్యాణం జరిపించాలని గ్రామ పంచాయతీ సంకల్పించగా అన్నీ తానై గ్రామంలోని లక్ష్మి నర్సింహస్వామి ఆలయం దగ్గర శ్రీరామ నవమి ఏర్పాట్లు ఎంతో చక్కగా చేశారు సర్పంచ్. పచ్చని పందిరి, టెంట్లు, భోజనాలు కూడా దాతల సహాయంతో ఏర్పాట్లు చేసారు. గ్రామ ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనగా సాయంత్రం 4గంటలకు సీతారాముల కళ్యాణం వేద మంత్రోచ్చారణల మధ్య కమనీయంగా జరిగింది. అనంతరం భోజనాలు వడ్డించడానికి స్థానిక సర్పంచ్ భోజనాల దగ్గరికి వెళ్లేసరికి అక్కడ కుల పిచ్చి ముదిరిన కొంతమంది మేము పెద్దకులస్తులమనే అపోహతో ''అగో ఆ సర్పంచ్ తక్కువ కులం ఆయన. మనం తినే భోజనాలను ముట్టుకుంటున్నాడు. అయన ముట్టుకొని వడ్డిస్తే ఎవరు తింటరు..? అక్క జెర్ర నువ్వైనా చెప్పు.. అక్కడనుంచి వెళ్ళమని..'' అనగానే అక్కడున్న మరో మహిళ ''అయ్యా సర్పంచ్.. నువ్వు వడ్డిస్తే మేము తినం .. నువ్వు ఆ భోజనాల బేషన్లు ముట్టుకోకు, దయచేసి ఇక్కడ నుంచి దూరంగా వెళ్లూ'' అని అరిచింది. ఈ హఠాత్పరిణామానికి ఆ సర్పంచ్ నిశ్చేష్టుడైపోయాడు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్నీ తానై ముందుండి నడిపించాడు. కార్యక్రమ నిర్వహణకు ఖర్చులు, ఏర్పాట్లు అన్నింటికీ అడ్డురాని కులం భోజనం చేసేటప్పుడు మాత్రం ఆటంకమైందా? ఈ ఊహించని పరిణామంతో తీవ్ర అవమానంతో ఆ కార్యక్రమం నుంచి వెనుదిరిగాడు సర్పంచ్. ఇది సాక్ష్యాత్తు భారతదేశంలో కులం అనే రక్కసిపై అలుపెరగని పోరాటం చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజు సాక్షిగా ఏప్రిల్ 14 న జరిగిన సంఘటన.
కుల రక్కసిని పారదోలాలనీ, మనుషులంతా ఒక్కటేననీ, అంటరానితనం నేరంగా పరిగణింపబడాలనీ డా||బిఆర్.అంబేద్కర్ ఎన్నో కలలుగన్నాడు. అందుకోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు. అయినా 70 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో నేటికీ కులజాడలు వీధివీధిలో బుసకొడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే అంటరానితనమనే పదం ఏనాడో తొలగిపోయేది. కానీ నేటి పాలకులు, వారి ప్రభుత్వాలు ఆధిపత్య కులాలకే వత్తాసు పలుకుతూ రాజ్యాంగాన్నే అవమానపరుస్తున్నాడు. దీంతో అణగారిన కులాలు ఏ స్థాయిలో ఉన్నా నేటికీ కుల వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు కుల సమస్యపై, ఈ వివక్షను రూపుమాపేందుకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి, వివక్ష పాటించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సెల్ : 8639518341
Authorization