ఓగోటి కిరణ్కుమార్
''నేను నా జాతికి కత్తిని ఆయుధంగా ఇవ్వలేదు. ఓటు అనే ఆయుధాన్ని అందించాను. దానిని సద్వినియోగం చేసుకొని గొప్పవారు అవుతారో, ఓటును అమ్ముకొని బిచ్చగాళ్లు అవుతారో మీరే నిర్ణయించుకోండి'' అని అంబేద్కర్ దేశ నిమ్నవ ర్గాలకు ఒక బలమైన హెచ్చరిక చేశారు. అయితే ఓటును అమ్ముకునే వారిని కాసేపు పక్కనబెడితే రాజ్యాంగం ద్వారా లభించిన ఓటును తమకు ఇష్టమైన వారికి వేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది నేడు. తమకు మద్దతు ఇవ్వలేదని కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలకు పాల్పడటమే దీనికి పరాకాష్ట.
ఓటు అనేది సామాన్యుడి వజ్రాయుధం. ఆ ఓటు హక్కే లేకుంటే పాలకులు ప్రజలకు మేలు చేకూర్చే పనులు కొన్నైనా చేసి ఉండేవారు కాదు. రాచరిక వ్యవస్థలో నుండే వచ్చిన మనకు దాని పర్యావసనాలు తెలియనివి కావు. అందుకే అతిపెద్ద నూతన రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని భారతదేశం సర్వసత్తాక లౌకిక ప్రజాతంత్ర దేశంగా ఆవిర్భ వించడంతో ప్రపంచంలో భారత్ ఎంతో ముందడు గు వేసింది. ఓటు ద్వారా పాలకులను ఎన్నుకోవడం వంటి పరిణామాల ద్వారా ప్రభుత్వాలకు, ప్రజలకు విడదీయరాని అవినాభావ సంబంధం ఏర్పడింది. ప్రజలు ప్రభుత్వాలపై విశ్వాసం చూపుతున్నారు. పాలకులు ప్రజలకు మేలు చేసే హామీలు గుప్పిస్తూ, మ్యానిఫెస్టోలు రూపొం దిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. అభ్యర్థి వ్యక్తిగత వ్యవహారం, వారి పార్టీ విధివిధానాలు నచ్చి ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేయగలుగు తున్నారు. సాధారణంగా ఇదే వారి హక్కు. మరింత చైతన్యం కనబరిస్తే అభ్యర్థులు ఓటు కోసం ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేసినా అతని వ్యక్తిగత వ్యవహారం, పార్టీ విధివిధానాలు నచ్చకపోతే ఆ అభ్యర్థికి ఓటు వేయడానికి నిరాకరించవచ్చు. అక్కడ నిలబడిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరు నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేసే స్వాతంత్య్రం, హక్కు ఓటరుకు ఉంది. ఇది ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ నాకే మద్దతు ఇవ్వాలి, నేను చెప్పిన వారికే ఓటు వేయాలి అని బలవంతం, ఒత్తిడి తెచ్చే హక్కు ఎవరికీ లేదు. అది చట్టరీత్యా నేరం కూడా. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనీ, తాము చెప్పిన వారికి మద్దతు ఇవ్వలేదనీ ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక కుల బహిష్కరణలను, గ్రామ బహిష్కరణలను మనం చూశాం.
బహిష్కరణలకు గురిచేస్తే ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడొద్దు, జన సమూహంలోనే ఉన్నా పనులకు పిలవరు, దుకాణాల్లో సరుకులు అమ్మరు, చుట్టూ జనం కదలాడుతున్నా అభయారణ్యంలో ఒంటరిగా తిరిగాడుతున్న జంతువుల వలే మాన సికంగా హింసిస్తారు. సాటి మనుషులే ఇలా మానసికంగా హింసించి ఆత్మ సంతృప్తి చెందు తున్నారు. ఇంతకు బాధితులు చేసిన తప్పు ఏంటి? వారు ఎక్కడా చట్టానికి వ్యతిరేకంగా నడుచుకో లేదు. నిబంధనలు అతిక్రమించలేదు. తన హక్కు గా లభించిన ఓటును తనకు ఇష్టమైన వారికి వేయ డం వారి తప్పా. ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకోవ డంలో మంచి చెడులు బేరీజు వేసుకోవడం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేయడం వారి హక్కు. ఇక్కడ బహిష్కరణలకు తావు లేదు. ఇలా బహిష్కరణలకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో చట్టాలు, పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నిందితులకు పాలకుల అండ లభిస్తున్నదా? అందుకే నిందితులను శిక్షించడంలో తాత్సారం జరుగుతున్నదా? అదే నిజమైతే ఆ పాలకులూ శిక్షార్హులే కదా?
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదవులను, కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఏకంగా గ్రామ సర్పంచునే గ్రామ బహిష్కరణ చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంకా వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో జరిగాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బహిష్కరణ లకు గురైన వారంతా అణగారిన కులాలకు చెందినవారే. అంటే అణగారిన కులాల వారికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు లేదా?
అసలు ఓటు లక్ష్యమేమిటి? అంటే పాలకుడు ఎటువంటి వారు ఉండాలో పాలితుడు నిర్ణయిస్తాడు. తమ భవిష్యత్తును చక్కదిద్దే వారిని ఎన్నుకోవాలని ఆలోచిస్తాడు. అలా తమకు అన్ని రకాలుగా ఉపయోగం, మేలు చేకూర్చుతాడని నమ్మిన అభ్యర్థికే ఓటు వేస్తారు. ఇది అతని హక్కు. వారి హక్కును కాదనడానికి ఎవరికి హక్కు లేదు. ఈ బహిష్కరణలు చట్ట విరుద్దం. అయినా ఈ దేశంలో అది యథేచ్ఛం...! ఇంకా మూస పద్ధతిలో ఓటు వేసే చోట కుల నిర్ణయం, కట్టుబాటు, కులం మాట అంటూ కూర్చుంటే అంబేద్కర్ ఆశించిన గ్రామ స్వరాజ్యం ఎప్పుడు వస్తుంది? అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎప్పుడు లభిస్తుం ది?. ''రాజకీయ అధికార సాధనపైనే దళితుల విముక్తి ఆధారపడి ఉంది. రాజకీయ అధికారమే సాంఘికాభివృద్ధికి మూలం. అణగారిన కులాల ప్రజలు ఐక్యమై ఒక బలమైన శక్తిగా ఏర్పడి అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలి'' అని అంబేద్కర్ దేశ నిమ్న వర్గాలకు పిలుపునిచ్చాడు. అందుకే ఓటు విషయంలో అణగారిన వర్గాల్లో చైతన్యం పెరగాలి. ఓటరు ఎప్పుడు ప్రలోభాలకు లొంగకూడదు. పాలకుడిని ఎన్నుకునే విషయంలో నిక్కచ్చిగా, చైతన్యంతో ఆలోచించి ఓటు వేయాలి. మన భవిష్యత్తును మనమే చక్కదిద్దుకోవాలి. ''దేనినైనా అమ్ముకోండి, కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోవద్దు'' అని అంబేద్కర్ ఆనాడే హెచ్చరిం చారు. అణగారిన వర్గాల్లో ఓటుపై చైతన్యం కలుగుతున్న క్రమంలో ఇలాంటి అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి వాటిని ఎదిరిస్తూనే ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తమకు జరిగిన అన్యాయంపై ఇటు ప్రజా మద్దతూ కూడగట్టి పోరాడాలి. మరోవైపు చట్టం పరిధిలో నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటా యి. బాధితులకు కుల సంఘాలు, అభ్యుదయ వాదులు, మేధావులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి అండగా నిలబడాలి. ఓటరు ఓటు కోసం ప్రలోభా లకు గురి చేసే వారిని, తమకు మద్దతు ఇవ్వలేదని బహిష్కరణలకు గురి చేసే వారిని కఠినంగా శిక్షిస్తే మరోచోట, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ఉంటాయి. లేదంటే ఈ ప్రభుత్వాలను ప్రజలే శిక్షించాలి. అందుకు ఓటే ఆయుధం కావాలి.
సెల్ : 9666011107
Authorization