కె.కె.
మహిళలు ఏ రంగంలోనైనా వేధింపులకు గురికాకుండా తప్పించుకోలేకపోతున్నారు. చదువులు చదివి ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తన కాళ్లపై తాను నిలబడే స్థితికి చేరినా వివక్షపూరిత వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తోటి ఉద్యోగులే సహ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. తమకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం మరింత దుర్మార్గం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులపై సహ ఉద్యోగులు వేధింపులకు పాల్పడటం దారుణం. స్థానిక కార్యాలయంలో వేధింపుల విషయమై ఇటీవల రెండు సార్లు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో గ్రీవెన్స్డేలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బంది చేష్టలకు మహిళా ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ పని చేసే సిబ్బంది వైద్యశాలలోనే మద్యం సేవించడం, ఉద్యోగినుల పట్ల అమర్యాదగా మాట్లాడటం చేస్తున్నారని బాధితులు వాపోయారు. దీంతో మహిళా ఉద్యోగులు అక్కడ పని చేసేందుకు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి చర్యలపై సదరు ఉద్యోగులను ప్రశ్నిస్తే, తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పినా నిందితులు వినిపించుకోవడంలేదు. తమకు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని ఎక్కడ ఫిర్యాదు చేసుకున్నా ఏమీ కాదని వేధింపులకు పాల్పడ్డ వారు అంటున్నారు. వేధింపులకు గురి చేస్తున్న వారిని జిల్లా వైద్యాధికారులు సైతం వెనకేసుకు రావడం సరికాదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.
సెల్ : 8639518341
వేధిపులపై ఉప వైద్యాధికారి విచారణ
మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదుపై గత శనివారం జిల్లా ఉప వైద్యాధికారి వినోద్ ప్రభుత్వ వైద్యశాలలో విచారణ చేశారు. వేధింపులకు పాల్పడ్డ ఉద్యోగులను విచారించారు. మహిళా ఉద్యోగినులపై సహ ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నారని ఇటీవల గ్రీవెన్స్డేలో ఫిర్యాదు అందిందని, ఈ అంశంపై జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారని ఆయన తెలిపారు. దీంతో విచారణ చేశామన్నారు. వివరాలు కలెక్టర్కు నివేదిస్తామన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
మహిళా ఉద్యోగుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పని ప్రదేశంలో మహిళలను వేధించడం సరికాదు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి. నిందితులకు మద్దతిచే పై అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. లేకుంటే బాధితుల పక్షాన ఆందోళనకు దిగుతాం.
- వజ్జా సురేష్
సీఐటీయూ మండల నాయకులు