డా.పోలం సైదులు
స్వాతంత్య్రానికి పూర్వం పరాయి పాలనలో దేశంలో అష్టక ష్టాలను అనుభవించాము. పూర్వం నుండి కులాల రచ్చను వెలికి తీసి, నిమ్న వర్గాల వారిని అష్టకష్టాల పాలుచేసి, ఆర్థిక వెసులు బాటు కలిగినవారే తమ మనుగడను సులభంగా కొనసాగించ డానికి వీలుండేది. స్వాతంత్య్రం సముపార్జించి శతాబ్దానికి పరుగెడుతున్నా, నేటికీ కులాల సమస్య వెంటాడుతూనే ఉంది.
ఈ మధ్యన రిజర్వేషన్ల పుణ్యమాని గ్రామ సర్పంచులుగా గెలిచిన నిమ్న వర్గాల వారిని అష్టకష్టాల పాలుచేస్తున్న, ఆధిపత్య కులాల అజామాయిషీని ప్రతిరోజు దినపత్రికలలో చూస్తూనే ఉన్నాం. నిమ్నకులాలకు చెందిన అందరు ఒకే విధంగా ఆలోచించి, సమైక్యంగా కొనసాగితే ఈ సమస్య ఉండేదికాదు. నేడు దేశంలో అత్యల్ప జనాభా కలిగిన సామాజికవర్గం, అధిక సంఖ్యలో పాలకవర్గంలో ఉండటానికి గల కారణం అట్టడుగు, నిమ్న కులాలకు చెందిన నాయకులన్నది నగసత్యం. స్వార్ధపూరిత ఆలోచనలతో ఆధిపత్య, పెత్తందార్ల అడుగులకు మడుగులొత్తుతూ తమ లాభార్జనే ద్వేయంగా, తన కులాన్ని, వర్గాలను పట్టించుకోకపోవడం, వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడితే అసలుకే ఎసరు వస్తుందనే ఏకైక కారణంతో, దశాబ్దాల నుంచి దేశంలో కులపిచ్చికి తెరలేపి, రాజకీయాలలో సీట్లను సైతం ఏదో కులాలపేరు, సామాజిక వర్గాల పేర్లు చెబుతూ, వారి కులపోళ్ల ఓట్లను చేజిక్కిచ్చుకోవడానికి జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇదిలా కొనసాగినన్ని రోజులు అభివృద్ధికి ఆటంకమే కాకుండా, కులపిచ్చి ఇంకా పెరిగి ప్రజల్ని చీలికలు, పేలికలుగా మార్చి అగ్రవర్ణాల ఆధిపత్యానికి ఎదురులేకుండా చేస్తుందనేది వాస్తవం.
దేశంలోనూ, రాష్ట్రాలలోనూ ఒక నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే అందులో ఏ కులానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు? ఎలాంటి సామాజికవర్గాలు సమైక్యంగా ఉంటారు, ఎవ్వరికి అవకాశం కల్పిస్తే గెలుస్తారనే ఎన్నో రకాల సమీకరణాలను విశ్లేషించి, చివరగా బహిరంగ సభలు పెట్టి జనాలను అధిక సంఖ్యలో పోగుజేసి కులాన్ని లేవదీసి, మీవాడు, మీకు అండగానుంటాడు, మీ అభివృద్ధికి దోహదపడతాడనే మాయమాటలు చెబుతూ, జనాలలో కులం మరింత వేళ్లూనుకునేలా చేస్తున్నారు.
అంబేద్కర్ ఎంతో ఆలోచించి నిమ్న కులాలవారు అభివృద్ధికి ఆమడ దూరంలోనున్నారని, రిజర్వేషన్స్ కల్పిస్తే, అవికూడా అభివృద్ధి చెందిన కుటుంబాలే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో షెడ్యూల్డ్ తెగలు గానీ, షెడ్యూల్డ్ కులాలకు సంబందించిన కుటుంబాలను తీసుకుంటే, ఆర్థికలేమి కారణంగా అందరూ పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. ఎలాగైనా కష్ట నష్టాలను ఎదుర్కొని తమ పిల్లలకు విద్యనందిస్తే, రిజర్వేషన్స్ కారణంగా ఏదైనా ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. తర్వాత తరాల్లోనూ ఆ కుటుంబాలే ముందు వరుసలో వారే ఉండి, ఆ రిజర్వేషన్స్ను కాస్త తన్నుకుపోతున్నాయి.
రాజకీయాల్లో సైతం కుల సమీకరణాల వల్లనో, రిజర్వేషన్స్ కారణంగానో వివిధ రాజకీయ పార్టీలు టికెట్స్ ఇవ్వదలిస్తే, పార్టీకి ఇంత సొమ్ము ఇచ్చే, ఎన్నికలలో ఖర్చుపెట్టడానికి సొమ్ము ఉన్నవారికే ఆ అదృష్టం దక్కుతుంది. గెలవడానికి తన కులం కావాలి, కానీ తను ఆర్థికంగా బలపడుతున్న సమయంలో తన కులాన్ని పట్టించుకోడు. రిజర్వేషన్స్ను అందరికంటే ముందే ఉపయోగించుకుంటాడు. ఎన్నికలలో నిలబడితే తనకులం అభివృద్ధి చెందలేదని, ఓట్లు వేస్తే ఎలాంటి కార్యకలాపాలను చేపడుతాడో వాగ్దానాలివ్వడం, ఆ పార్టీ ఆది నాయకత్వం సైతం కులాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ''మీ కులపోడికి అవకాశం ఇచ్చాం, మీరు గెలిపిస్తే, మీ అభివృద్ధిని మీవాడే పరుగెత్తిస్తాడ''ని మాయమాటలు చెప్పడం నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం. తీరా గెలిచాక ఏ ఒక్కరోజు అసెంబ్లీ లేదా పార్లమెంటు సమావేశాలలో తన వారి గురించి మాట్లాడే సందర్భాలు ఉండవు. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలనే నిర్ణయం అధినాయకత్వమే చూసుకుంటుంది. ఐదు సంవత్సరాలూ ఇలాగే మభ్యపెట్టి మళ్లొచ్చే ఎన్నికలలో మరో కొత్తపాట పాడుతారు. ప్రతిసారీ జరిగే తంతు, అందరికీ తెలిసిందే.
దేశంలోని జనాభాలో అతితక్కువ శాతంలో ఉన్న ఆధిపత్య కులాలు, అతి ఎక్కువ శాతంలో పరిపాలనలో ఉండటం, వెనుకబడిన కులాలలో రిజర్వేషన్స్ను, అందులోనే ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలే ఎక్కువగా ఉపయోగించుకుంటూ, లేదా వ్యాపారం ద్వారానో, మరే ఇతర కారణాల వల్లనో ఆర్థికంగా బలపడిన వారికే రాజకీయాలలో అవకాశాలు రావడం, కులాలను తెరమీదకి తెచ్చి, కుల రాజకీయాలు చేయడం వంటివాటిని చూస్తుంటే యావత్తు దేశంలో ఎవరు పాలకులు? ఎవరు పాలితులు? రాజ్యాంగం అమలు ఎక్కడా? రిజర్వేషన్స్ వలన అట్టడుగు స్థాయిలోనున్న వారికి ఎలాంటి లాభం చేకూరుతుంది? వీటన్నింటి గురించి చర్చించి, పరిష్కరించడానికి ముందుకు రావాల్సిన అవసరం లేదా? అంటే దేశంలో ఆర్థికంగా మెరుగుగానున్నవాడు, ఇంకా ఆర్థికంగా ఎదగాలి, పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలిపోవాలి. అదే కదా జరుగుతున్నది. రాజ్యాధికారం చేపట్టడానికి ఒక నీతి, నిజాయితీ ఉండదు, అవసరం తీర్చుకోవడానికి ఎలాంటి వాగ్దానాలైనా చేస్తారు. అవసరం కోసం ఇంకేమైనా చేయడానికి వెనుకాడరు. కులాలలో చైతన్యం రాకూడదు. ఎక్కడబడితే అక్కడ పుల్లలు బెట్టి, మంట రాజేస్తూ ఉంటే ఏమీ పట్టనట్టు ఉంటే పరిస్థితి ఎలా మారుతుంది?
అక్కడోఇక్కడో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తే చేతికి మట్టి అంటకుండా దానిని ఆపడానికి అనేక కుల నాయకులే ఆధిక్యత రాజకీయాలకు ఆయుధాలవుతున్నారు. ఇదేమీ సమాజం! అభివృద్ధి జరుగుతుందనే నమ్మకమే లేదు. ఏండ్లు గడుస్తున్నాయి, ప్రపంచీకరణలో భాగంగా ఎన్నో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. కానీ మనలో మార్పు ఎప్పుడో అర్థంగానీ పరిస్థితులు దాపురించి, సగటు మానవుడిని ఆందోళనకు గురిచేస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే, భవిష్యత్లో అతని వ్యక్తిగత కుటుంబం, ఆ రిజర్వేషన్స్ను ఉపయోగించుకోకుండా తన కులంలో మరొకరికి అవకాశమివ్వడానికి సహకరిస్తారా? లేదా నిమ్న కులాలకు, వర్గాలకు చెందిన ఉద్యోగస్తులు, పాలకులు, ఆర్థికంగా మెరుగుపడిన ప్రతిఒక్కరు ఒక్కతాటిపైకి వచ్చి, అందరి అభివృద్ధిని కాంక్షించడానికి ప్రయత్నించే సాహసం చేస్తారా? అంటే సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
ప్రతి కుటుంబంలో చదువుకున్నవారు ముందుగా చైతన్యం కావాలి. సంపూర్ణ అవగాహన తెచ్చుకొని యావత్తు దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంటికి ఒక సైనికుడిగా తయారై తమ కుటుంబంలోని వ్యక్తులను చైతన్యపరుస్తూ, వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తూ, నూతన ఒరవడికి తెరతీస్తే గానీ, సమాజంలో మార్పు సాధ్యం కాదు. మన బతుకులు మారడానికి మరే అవకాశాలు లేవు, నేడు సమాజంలో కొనసాగుతున్నవి స్వార్ధపూరిత రాజకీయాలే. దారిద్య్రరేఖకు దిగువనున్న వారి అభివృద్ధికి దోహదపడని రాజకీయాల వలన ఉపయోగమేమిటో అర్థం చేసుకొని దానికనుగుణంగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. మన కార్యాచరణ అంతిమంగా కుల నిర్మూలనకు దోహదపడాలే తప్ప కులాన్ని మరింత బలోపేతం చేసేదిగా మారకూడదు. ఈ స్పృహ ఎంత విస్తృతమైతే అంత ప్రయోజనం.
సెల్ : 9441930361
Authorization