జియాఉద్దీన్ ముహమ్మద్
రాష్ట్రంలో అత్యధిక ముస్లింలు ఆర్థిక అక్షరాస్యత లేని వారే. దీనివల్ల ముస్లింలు ఇంకా వెనకబడి దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో చాలామంది చేతి వృత్తులు, చేతి పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ముస్లింల తలసరి ఆదాయం ఒక డాలర్కన్నా తక్కువగా ఉన్నది. దీనికితోడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు, దీని మూలంగా ముస్లింలు రోజువారీ వడ్డీ వ్యాపారుల దగ్గర అత్యధిక వడ్డీలకు అప్పు తీసుకొని వారి వ్యాపారాలను నెట్టుకొస్తున్నారు. ఇది వీరి జీవితాలకు గుదిబండగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లింల బతుకులు బాగుపడతాయనుకున్నారు కానీ స్థితిగతులు, పరిస్థితులు అంతగా మారలేదు. ముస్లింల సంక్షేమంపై భారతదేశంలో గోపాల్సింగ్ కమిటీ, రాజేందర్ సచార్ కమిటీ, సుధీర్ కమిషన్, రంగనాథ్ మిశ్ర కమిషన్, అమితాబ్ కుందూ నివేదిక, అబూ సాలెహ్ షరీఫ్ నివేదిక, ఇలా ఎన్ని నివేదికలు వచ్చినా అభివృద్ధి మాత్రం శూన్యం.
అధిక సంఖ్యాక వర్గాల జనాభా కేటాయింపులతో పోలిస్తే అల్ప సంఖ్యాకులకు చాలా తక్కువ కేటాయింపులు జరిగాయి. అల్ప సంఖ్యాకుల విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది ఉపకార వేతనాలు, ఫీజులు చెల్లించడం, హాస్టల్ సౌకర్యాలు కల్పించడం. రెండవది రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన చేయడం, మదర్సాలలో అధికార విద్యను బోధించేలా వాటికి సహాయం చేయడం మొదలైనవి. వాటి ద్వారా నాణ్యమైన, ప్రధాన స్రవంతి విద్యను అందించడం. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సంబందించిన పథకాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. అనగా 68 శాతం బడ్జెట్ వాటికే కేటాయించారు. అమలులో ఉన్న పథకాలే కాకుండా ముస్లింల అభివృద్ధికి అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టారు. అవి పేద ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం. ముస్లిం విద్యార్థులు తక్కువగా పాఠశాలకు చేరడానికి, మధ్యలో చదువు మానివేయడానికి వారి పేదరికమే ప్రధాన కారణం. ఈ సమస్య పరిష్కారానికి, పాఠశాలలు, కళాశాలలో వారి నమోదును పెంచడానికి ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తుంది. ముస్లింలలో 42శాతం ప్రభుత్వ ఉచిత శిక్షణ పొందుతున్నారు. ప్రతి 5 ముస్లిం కుటుంబాలలో 2 కుటుంబాలు ప్రభుత్వ ఉచిత శిక్షణ సౌకర్యాలు ఉపయోగించుకుంటుంటే 3వ వంతుకన్నా తక్కువ ఉపకార వేతనాలు పొందుతున్నారు.
ప్రీ-మెట్రిక్యూలేషన్ ఉపకార వేతనాలు కుటుంబ సంవత్సర ఆదాయం లక్షకన్నా తక్కువగా ఉండి, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రీ-మెట్రిక్యూలేషన్ ఉపకార వేతనాలకు అర్హులు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు 100 చొప్పున పది నెలలకు రూ.1000 ఇస్తారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వారికి అదనంగా నెలకు రూ.600 చెల్లిస్తారు.
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు విద్యా సౌకర్యాలు పెరుగుతున్నప్పటికీ ముస్లింలలో గల పేదరికం, ఉన్నత విద్య చదవడానికి పెరుగుతున్న ఖర్చులు మొదలగు కారణాల వల్ల ముస్లిం వర్గాల ప్రాతినిధ్యం తగ్గుతున్నది. ఈ పథకం కింద గుర్తించిన వృత్తి విద్యా కోర్సులలో చేరిన పేద ముస్లిం విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లిస్తుంది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించు కొని దాదాపు 12,825 పేద ముస్లిం విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చదువుతున్నారు. రాజేందర్ సచార్ నివేదిక ప్రకారం కేవలం 4శాతం ముస్లిం మతానికి చెందిన పిల్లలు మాత్రమే మదర్సాలలో చదువుతున్నప్పటికీ ముస్లింలకు నాణ్యమైన విద్య అందించడానికి మదర్సాలను ఆధునీకరించాలన్న వాదన ముందుకు వస్తున్నది. ముస్లిం మతానికి చెందిన అత్యధిక పిల్లలు 57.4 శాతం ఉర్దూ, తెలుగు మీడియంలో ప్రభుత్వ స్కూలులో చదువుతున్నారు. దీనికోసం 6 ఆంగ్ల మాధ్యమ స్కూళ్లను ఏర్పాటు చేశారు. అల్ప సంఖ్యాక వర్గాల వారు పోటీ పరీక్షలలో పాల్గొనడం, విజయం సాధించడం చాలా తక్కువ. పేద విద్యార్థులు ఈ పరీక్షలలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి వారికి శిక్షణ, మార్గదర్శకత్వం అవసరం. సాంకేతిక విద్యా కోర్సులలో చేరడానికి ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల విద్యా అభివృద్ధి కోసం 9 జిల్లాలలో 61 సెంటర్లు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలలో ముస్లిం వాటా చాలా తక్కువ. ప్రైవేట్ కోచింగ్ ఖరీదైన వ్యవహారం కావడం ముస్లింల పేదరికం పేద సామాజిక ఆర్థిక పరిస్థితులు దీనికి కారణం. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక స్టడీ సర్కిల్స్ మంజూరు చేసింది. పేద ముస్లిం విద్యార్థులు విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ ఎడ్యుకేషన్ చేయడానికి ఆర్థిక సహాయం అందచేసే నూతన పథకం ఆరంభించింది.
500 మంది విద్యార్థులకు విదేశీ చదువు అందించడానికి ప్రభుత్వం 25 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన మొత్తం కేటాయింపులలో 24శాతం మాత్రమే.
నిరుద్యోగ అల్ప సంఖ్యాక యువతలో ఆదాయ పెంపు కార్యక్రమాలను ప్రోత్సహించడానికి వారికి స్వయం ఆధారిత వ్యక్తులుగా రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అల్పా సంఖ్యాకులను ఉద్దేశించి బ్యాంకుతో సంబంధంగల సబ్సిడీతో కూడిన ఆదాయ పెంపు పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు సేవల రంగం, వ్యవసాయ, వ్యవసాయ సంబంధ కార్యకలాపాలకు సంబంధించిన బ్యాంకు రుణాలపై ఒక లక్షకు మించి 50శాతం సబ్సిడీ ఇస్తుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో యువకులకు 1000 ఆటోలు పంపిణీచేశారు. ఈ పథకం ప్రకారం ఆటో ధరలో 50శాతం సబ్సిడీ లభిస్తుంది. 50 శాతం బ్యాంకు రుణం కూడా లభిస్తుంది. సచార్ కమిటీ రికమండేషన్ ఆధారంగా ''మల్టీ సెక్టరోల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫర్ మైనారిటీస్'' కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 12వ పంచ వర్ష ప్రణాళిక కాలంలో జిల్లా స్థాయి నుంచి ముస్లింలు అధికంగా గల బ్లాకులు పంచాయతీలకు ఈ పథకాన్ని విస్తరించింది. మైనారిటీల సామాజిక, ఆర్థిక పరిస్థితుల అభివృద్ధికి అల్ప సంఖ్యాకులకు అధికంగా గల ప్రాంతంలో అసమానతలను తగ్గించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద కుటుంబాలకు అమ్మాయిల వివాహం చేయడం అత్యంత భారం. దీనికోసం ఆర్థికంగా సహాయ పడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టింది. వృద్ధులకు సీనియర్ సిటిజన్లకు పెన్షన్ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆసరా పథకానికి 58 సంవత్సరాలు పైబడిన వారు, వితంతువులు, అంగ వైకల్యంగల వారు అర్హులు.
తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ రెండో అధికార భాషగా చలామణి అవుతోంది. ఉర్దూ అకాడమీకి ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించింది. ఉర్దూ రాత ప్రతులు ముద్రణకు ఆర్థిక సహాయం, ఉర్దూ గ్రంథాలయాలు, ఉర్దూ వార్తా సంస్థలు, ఉర్దూ పుస్తక ప్రచురణ కార్యక్రమాలను ఉర్దూ అకాడమీ చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం డైరతుల్ మారిఫ్కు రూ.రెండు కోట్లు ఆమెర్లోని హజరత్ మొహినుద్దీన్ చిస్తీ దగ్గర గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5000 మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు, మౌజాన్లకు రూ.1000 ఇచ్చే నూతన పథకం ప్రారంభించింది.
ఆర్థిక శాఖ గణాంకాలను పరిశీలిస్తే అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఉద్దేశించిన నిధులు ప్రభుత్వం నాలుగు పర్యాయాలు, చిన్న మొత్తాల రూపంలో విడుదల చేసింది. గత సంవత్సరం బడ్జెట్లో నాలుగు పథకాలకు అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలకు అవసరమైన ప్రాథమిక పాఠశాల నిర్మాణం, ముస్లిం విద్యార్థులకు తెలంగాణ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇవ్వడం, ప్రముఖ విద్యా సంస్థల్లో అల్ప సంఖ్యాక విద్యార్థులకు ప్రవేశం లభించడంలో సహాయ పడటం, చర్చీలు, శ్మశాన వాటిక నిర్వాహణలకు ఒక్కపైసా కేటాయించలేదు. తెలంగాణ ప్రభుత్వ అల్ప సంఖ్యాక వర్గాల శాఖ సెక్రటరీ అభిప్రాయం ప్రకారం జూన్ 2న రాష్ట్రం ఏర్పడింది. జూన్ 4న బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కనుక నిధులు సద్వినియోగానికి సమయం లభించలేదు. దీనికి అదనంగా రాష్ట్ర విభజన కార్యక్రమం కొనసాగింది. కనుక రాష్ట్రానికి అవసరమైన అధికారుల కేటాయింపులు జరగలేదు. ఫలితంగా క్రమబద్దత వ్యవస్థ లేకపోవడం ఒకేసారి ఒక సెక్రటరీ 4 శాఖలను పర్యవేక్షించాల్సిన అవసరం ఏర్పడడం వలన అలా జరిగిందని చెప్పారు.
అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలను జన జీవన స్రవంతిలో కలుపాలంటే వారు అందరితో సమానంగా మారాలంటే నిర్దిష్ట భౌతిక, ఆర్థిక లక్ష్యాలను సాధించాలి. విద్యా, ఆరోగ్యం గహ నిర్మాణం, రుణాలు అందుబాటులో మొదలగు రంగాలకు ప్రభుత్వం అధిక నిధులను వ్యయం చేయాల్సి ఉంటుంది. అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది.
సెల్ : 9989236393
Authorization