యాదగిరి /రామస్వామి
కామాంధులు కండ్లు ముసుకుపోయి కర్కశంగా ప్రవర్తించారు. 17 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 14 గంటలపాటు ఒకరి తర్వాత ఒకరు వంతుల వారిగా ఆమెకు నరకం చూపారు. వద్దూ వద్దూ అంటూ చేతులెత్తి దండం పెట్టినా వినలేదు ఆ మానవ మృగాలు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటన తెలిసి కండ్లు, చెవు లు వినిపించని నాన్నమ్మ కన్నీరుమున్నీరైంది. బిడ్డ పక్కింటికి వెళ్లిందని రాత్రంతా చూసీచూసి ఆ కండ్లు కాయలు కాసేలా తెల్లవారుజాము వరకూ ఇంటి ముందే కూర్చుండి పోయింది. గత గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఏడ్చుకుంటూ ఇంటికొచ్చిన మనమరాలు జరిగిన ఘోరాన్ని నానమ్మకు వివరించి బోరున విలపించింది.
రాయవరం గ్రామానికి చెందిన ఓ బాలికతో కొముర వెల్లి మండలం అయానా పూర్ గ్రామానికి చెందిన వడ్డెర కులస్తుడు వెంకటేశ్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్ని రోజులు బాగానే సాగింది. బుధవారం రాత్రి వెంకటేష్ ఆ బాలికను బైక్పై బయటకు తీసుకెళ్లాడు. ఊరు బయటకు వెళ్లిన తర్వాత వెంకటేష్ తోటి స్నేహితులకు ఫోన్చేసి మరో ముగ్గురు యువకులను (20-25 వయస్సు) పిలిచాడు. నలుగురూ కలిసి ఆ బాలికను గజ్వేల్ మండల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్ప డ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ కర్కశంగా, మూర్ఖంగా ప్రవర్తించారు. కేకలు వేసినా, కాళ్లు, చేతులు పట్టుకుని వేడుకున్నా వదల్లేదు. ఇదిలా ఉంటే ఈ నలుగురు యువకులు గజ్వేల్లోని లక్ష్మీప్రసన్న కాలనీలో నివాసముంటూ వడ్డెర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ కర్కశానికి సహకరించిన రాయమరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, లైంగికదాడికి పాల్పడిన వారంతా పరారీలో ఉన్నారు. పోలీసులు వారి అచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామ చౌరస్తాలో బాలికను వదిలేయగా అక్కడి నుంచి ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని నాన్నమ్మకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగదేవ్పూర్ ఎస్సై సాయిరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలిక చిన్నతనం లోనే తల్లిదండ్రులను కోల్పోగా నానమ్మ వద్ద జీవనం సాగిస్తుంది. బాలికకు 8 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లిదండ్రులు అనారోగ్యంతో ఒకే ఏడాదిలో మృతి చెందారు. అప్పటి నుంచి 80 ఏండ్ల వయస్సున్న నానమ్మ రాజవ్వ వద్దే జీవిస్తోంది. 8వ తరగతి వరకు చదువుకున్న బాలిక కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక చదువును మధ్యలోనే ఆపేసి గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి అలనాపాలనకు నోచుకోలేకపోయింది. పెద్దగా చదువుకోక పోవడంతో సమాజంపై అవగాహన కూడా సరిగా లేదు. దీన్ని ఆసరా చేసుకున్న ఆ కామంధులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు.
సెల్ : 9490094428, 9701483486
నిందితులను కఠినంగా శిక్షించాలి
బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ కామంధులను కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు లేని బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ కామాంధులపై చట్టం ప్రకారం తగిన శిక్ష వేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
- సర్పంచ్ భర్త కనకరాజు
ప్రభుత్వమే ఆదుకోవాలి
సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులు చట్టంలో ఉన్న సెక్షన్ల ప్రకారం కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. బాలికను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు నింధితులను కఠినంగా శిక్షించాలి.
- ఎల్లం, గ్రామస్తుడు
Authorization