మానవ హక్కుల గురించి పోరాడినవారు ఎవరంటే ముందుగా మనకు అబ్రహం లింకన్, మార్టిన్ లూధర్కింగ్, నెల్సన్మండేలా తదితర ప్రపంచ నాయకులు గుర్తుకొస్తారు. భారతదేశంలో ఫూలే, అంబేద్కర్లు ముందు వరుసలో ఉంటారు. అంతర్జాతీయ సమాజంలో బానిసత్వం, వర్ణ లేదా జాతి వివక్ష అనేవి అవిభక్త కవలలుగా పెరిగి అక్కడి సమాజాన్ని అతలాకుతలం చేశాయి. భారతదేశంలో బానిసత్వం, వర్ణ వివక్ష ప్రత్యక్షంగా కన్పించకపోయినప్పటికీ, అంటరానితనం, కులం వివక్షల రూపంలో నిమ్నవర్గాల హక్కులని కాలరాస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావ్ఫూలే, డా||బి.ఆర్.అంబేద్కర్లు వెనుకబడిన, నిమ్న వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారు. పోరాడటమేకాదు, పేదవారి సమస్యల పరిష్కారానికి రాజ్యాంగబద్దమైన మార్గాలను సూచించారు. ఫూలే, అంబేద్కర్లు ఇద్దరూ స్త్రీ వాదులే. స్త్రీ విద్య ద్వారానే మహిళా సాధికారత వస్తుందని నమ్మి ఆచరించారు. ఫూలే ఆశయ సాధనలో నుంచి వికసించిన కుసుమమే సావిత్రీబాయిఫూలే. ఫూలే, అంబేద్కర్లు వ్యక్తిగత ఆరాధనను ఖండించారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. అణగారినవర్గాల వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించి, ఆత్మగౌరవంతో జీవించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని వివరించారు. వారు భారతదేశంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి బ్రిటీష్వారు చేపట్టిన విధానాలను స్వాగతిస్తూనే, బ్రిటీష్ వారు భారతదేశంలో కొనసాగించిన శ్రమదోపిడీని నిరసించారు. వలసవాదం మంచిది కాదన్నారు. ''వ్యక్తిగత ప్రయోజనాలకంటే, దేశ ప్రయోజనాలే ముఖ్యమని'' అంబేద్కర్ అనేవారు. అదే సందర్భంలో అణగారిన వర్గాల ప్రయోజనాల కు విఘాతం కల్గితే వారి హక్కుల సాధనకే అత్యంత ప్రాధాన్యతనిస్తానన్నారు. మతం ఆధారంగా దేశ విభజన మంచిది కాదన్నారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో భాగమేనని, మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఆ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరారు. దేశ సమగ్రత కోసం దక్షిణ భారతదేశ ప్రజల మనోభావాలని గుర్తించాలన్నారు. రెండో రాజధానిని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు బెంచిని కూడా దక్షిణాదిలో ఏర్పాటు చేయాలన్నారు. భారతదేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యలని భారతదేశం కోణంలోనే చూడాలన్నారు. బుద్దిజం సమానత్వాన్ని బోధిస్తుందని, నిమ్నవర్గాల సమస్యల పరిష్కారానికి పాలకులు బుద్దుని బోధనలను పాటించాలని సూచించారు. అంబేద్కర్ ఉపయోగించిన జాతి అనే పదానికి విస్తృత అర్థం ఉంది. ప్రతిమతంలో, ప్రతి ప్రాంతంలో అణగారిన, బడుగుబలహీన వర్గాల వారున్నారు. అందుకే దేశంలో ప్రాంతాన్ని బట్టి రిజర్వేషన్లు మారుతుంటాయి. ఫూలే, అంబేద్కర్ లిద్దరూ మంచి రచయితలు. దార్శనికులు, గొప్ప సంఘ సంస్కర్తలు. సనాతన సంప్రదాయాలను తిరస్కరించారు.
అంబేద్కర్కు ప్రజాస్వామ్యంపై అపార నమ్మకం. కులవ్యవస్థ ఆధారంగా ఒక జాతినిగానీ, ఒక నీతినిగానీ నిర్మించలేమన్నారు. ఆయన మంచి ఆర్థికవేత్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి వాటిని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారు. అంబేద్కర్ మంచి న్యాయవాది. రాజనీతిజ్ఞుడు. ఫూలే తన ''గులాంగిరి'' రచన ద్వారా వెనుకబడినవర్గాల హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయో విపులంగా వివరించారు. ఫూలే దంపతులు బాలికా విద్యకు ప్రాధాన్యత నిచ్చారు. ఫూలే ఆలోచనలను అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారు. ఫూలేని తనకు మార్గదర్శకుడిగా అంబేద్కర్ ప్రకటిం చారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవారు ఉత్తములై ఉండాలని అంబేద్కర్ ఆశించారు. ''ఆధునిక భారత దేశ సాంఘిక ఉద్యమపిత''గా జ్యోతిరావు ఫూలేను, అంబేద్కర్ను ''భారతరాజ్యాంగ పిత''గా అభివర్ణిం చవచ్చు. కొలంబియా యూనివర్శిటీ అంబేద్కర్ను ''నవభారత నిర్మాత''గా కొనియాడింది.
దురదృష్టవశాత్త్తూ ఫూలేను బీసీ నాయకుడిగా, అంబేద్కర్ను దళిత నాయకుడిగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిద్దరూ సిసలైన భారతీయులు. గొప్ప సంఘ సంస్కర్తలు. సమానత్వం కోసం పోరాడిన యోధులు. వారిద్దరదీ బెదిరించడమో లేదా బెదిరిపోయే నైజం కాదు. పరిస్థితులను ఎదిరించి పోరాడే తత్వం వారిది. ఈ తత్వాన్ని నేటి యువత అలవర్చుకొని వారి బాటలో పయనించాలి. ఫూలే జయంతిని ''సామాజిక న్యాయదినోత్సవం''గా, అంబేద్కర్ జయంతిని ''రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం''గా ప్రకటించి భారతరాజ్యాంగ ప్రతులను ప్రతి విద్యార్థికి ఉచితంగా అందించినట్టయితే వారిరువురికి ఘనమైన నివాళులు అర్పించినట్టవుతుంది.
సెల్ : 9492712836
Authorization