నిజామాబాద్ జిల్లాలో మరోసారి వీడీసీ బుసలు కొట్టింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని బాల్కొండ మండల కేంద్రంలో ఏకంగా 1500 కుటుంబాలను బహిష్కరించింది. ఇందులో ముస్లింలతోపాటు గౌడ్లు, పద్మశాలీల కుటుంబాలున్నాయి. శ్మశాన(కబరస్తాన్) వాటిక స్థలం వీడాలంటూ వీడీసీ జారీ చేసిన ఆదేశాలను ధిక్కరించినందుకు ముస్లింలను, గ్రామానికి సంబంధించిన భూమిలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీయాలని యత్నించిన వ్యక్తిని నిలువరించేందుకు మొత్తం కులంపై బహిష్కరణ వేటు వేశారు. ఇక మరో ఘటనలో పద్మశాలికి చెందిన ఓ డాక్టర్ వ్యక్తిగత భూకేసులో చెప్పినట్టు వినడం లేదని, ఏకంగా ఆ కులస్తులను బహిష్కరించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాభివృద్ధి కమిటీలు మరోసారి విషం చిమ్మాయి. వందల ఏండ్లుగా ఖబరస్తాన్ కోసం వినియోగించుకుంటున్న స్థలం తమదే అంటూ ఓ సామాజిక తరగతి ముందుకొచ్చింది. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలనీ, ఇకపై ఆ స్థలంలో సమాధి చేయొద్దని హుకుం జారీ చేసింది. అయితే ముస్లింలు దీనిపై పోలీసులను ఆశ్రయించారు. నాటి నుంచి కేసు స్టేషన్లో పెండింగ్లో ఉంది. తాజాగా కేసు ఉపసంహరించుకోవాలని వీడీసీ తరపున ఆ సామాజిక తరగతి ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు ముస్లింలు ససేమీరా అనడంతో.. వీడీసీ ఆదేశాలు భేఖాతారు చేస్తారా అంటూ బహిష్కరణకు పాల్పడింది. ఇక మరో ఘటనలో గ్రామానికి చెందిన భూములను వీడీసీలోని కొంతమంది పెద్దలు.. ఉన్నత కులానికి చెందిన వ్యక్తులతో మిలాఖత్ అయ్యి స్వాహా చేశారు. ఈ ఉదాంతాన్ని బయటకు తీసేందుకు గౌడ కులానికి చెందిన యువకుడు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని వీడీసీ.. వ్యక్తిని అణిచివేసేందుకు మొత్తం కులాన్ని బహిష్కరణకు గురిచేసింది. అలాగే డాక్టర్కు చెందిన ఓ ప్రయివేటు భూతగాదా కేసులో వీడీసీ జోక్యం చేసుకుని.. మొత్తం పద్మశాలీలను బహిష్కరించింది. బహిష్కరణలో భాగంగా పద్మశాలీలతోపాటు ఇతరులను కిరాయికి ఉంటున్న ఇండ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తోంది. నిత్యావసరాలు అందనీయకుండా సభ్యు లు అడ్డుకుంటున్నారు. ఈ కులస్తులతో మాట్లాడితే.. వారికీ అదే గతి పడుతో ందని హెచ్చరిస్తున్నారు.
అధికారుల విచారణ
బహిష్కరణపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. ఈ ఘటనపై తహసీల్దార్ సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు బాధితులతోపాటు వీడీసీ పెద్దలు హాజరయ్యారు. 1500 కుటుంబాల బహిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు.. వీడీసీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవడంతో వీడీసీ గొంతు మార్చింది. తామెవరినీ బహిష్కరించలేదని, కేవలం ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇక బాధితులు మాత్రం వీడీసీ పెద్దలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు అందనీయకుండా చేయడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ఎస్ఐ శ్రీహరి, తహసీల్దార్ బాసిత్ సమక్షంలో ఈ విచారణ జరిగింది.
సద్దుమణిగిన వివాదం
గౌడ, పద్మశాలి, ముస్లింల కుటుంబాలను బహిష్కరిస్తూ వీడీసీ (గ్రామాభివృద్ధి కమిటీ) తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకుంది. ఆర్మూర్ ఏసీపీ రాములు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఆదేశాలను విరమించుకున్నారు. బహిష్కరణ ఎత్తివేస్తున్నట్టు బాల్కొండలో మైకుల ద్వారా ప్రకటించారు.
- మీస భాస్కర్
సెల్ : 9868985708
రాజీ ప్రయత్నమే తప్ప చర్యలు లేవు
గ్రామాభివృద్ధి కమిటీల విలాసాలకు అవసరం వచ్చినప్పుడల్లా గ్రామంలోని ఏదో ఒక బలహీన వర్గంపైన, బలహీనులపైన విరుచుకుపడి అందినంత దోచుకోటానికి తెగబడుతున్నాయి. బహిష్కరణ లాంటి ప్రజాస్వామిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎన్నిసార్లు పాల్పడినా పోలీసులు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఇలాంటి చట్ట విరుద్దమైన చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈ వీడీసీలు రెచ్చిపోతున్నాయి. బాల్కొండలో సైతం ఎప్పటిలాగే రాజీ కుదిర్చారు.. కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోలేదు. రాజీ ప్రయత్నాలతో వీడీసీల బుద్దిమారదు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి బహిష్కరణ లాంటి అప్రజాస్వామిక చర్యలకు పూనుకోవు. వీడీసీలకు కొన్ని రాజకీయ పార్టీలు వంత పాడుతున్నాయి.
- పెద్దివెంకట్రాములు,
టీమాస్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్
Authorization