నరేష్:
కుల కట్టుబాట్ల పేరుతో జరుగుతున్న ఈ బహిష్కరణలపై ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడంతో వీటి తీవ్రత ఎక్కువవుతోది. దీంతో ఏండ్ల తరబడి బహిష్కరణలు కొనసాగిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది మానవుడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో ఇంకా గిరిజన గ్రామాల్లో బానిసత్వం రాజ్యమేలుతోంది. తాజాగా గ్రామాల్లోని పెద్దలు, దొర పటేళ్లు పంచాయితీ నిర్వహించి ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడమే కాకుండా జరిమానా విధించారు. దీంతో మానసిక వేధనకు గురై తీవ్ర మనస్థాపంతో ఆ కుటుంబ యాజమాని భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కొత్తగుడెంలో చోటు చేసుకుంది.
బయ్యారం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ఈసాల ధనంజయ, పద్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నాగేష్, చిన్న కుమారుడు నరేష్, కూతురు ప్రమీళ. అయితే పెద్ద కుమారుడు నాగేష్ మూడేండ్ల కింద అదే గ్రామానికి చెందిన కోరం రేణుకను ప్రేమించాడు. వీరిరువురు మూడు నెలలపాటు కొత్తగూడెం గ్రామం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉండి తర్వాత స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఆ అమ్మాయిని నాగేష్ వివాహం చేసుకోవాలని గ్రామ పెద్దలు, గ్రామ పటేల్ కలిసి పంచాయితీ పెట్టి తీర్పునిచ్చాడు. నాగేష్ ఇంటికి ఆ అమ్మాయిని పంపించారు. నెల రోజులపాటు ఆ అమ్మాయి నాగేష్ ఇంటి దగ్గర ఉండి ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో అమ్మాయి తన తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. అయితే తమ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆమె తల్లిదండ్రులు మళ్లీ పెద్ద మనుషులను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలు రెండోసారి పంచాయితీ పెట్టి మళ్లీ నాగేష్ ఇంటికి పంపించారు. ఈ క్రమంలో నాగేష్ సదరు అమ్మాయిని ఇంటి వద్దనే ఉంచి ''పని కోసం వేరే ఊరికి వెళుతున్న, మళ్లీ ఇంటికి వస్తా'' అని చెప్పి వెళ్లి పోయాడు. తిరిగి ఊరికి రాకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఏండ్ల తరబడి కేసు అలానే ఉంది. ఈ క్రమలో గల 4 నెలల క్రితం గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి సదరు అమ్మాయికి రూ.నాలుగు లక్షలు చెల్లించాలని తీర్మానం చేశారు. అంతేకాకుండా డబ్బులు చెల్లించే వరకు వారి ఇంటికి ఎవ్వరూ వెళ్లకూడదనీ మాట్లాడకూడదని షరతు విధించి, గ్రామ పెద్దల నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే రూ.1 లక్ష జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. ఈ పోరు పడలేక నాగేష్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మహిళకు ప్రస్తుతం ఒక పాప కూడా జన్మించింది. ఇటీవల ధనంజయ చిన్న కొడుకు వివాహ సమయంలోనూ ఆంక్షలు పెట్టారు. ఈ క్రమంలో గత మంగళవారం ఉదయం ధనంజయ ఇంటికి పెద్ద మనుషులు వచ్చి జరిమానా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. నాలుగు నెలలుగా చెబుతున్నా లెక్కచేయడం లేదనీ పెద్ద మనుషుల తీర్పును ధిక్కరిస్తున్నారని బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురైన ధనంజయ భార్య పద్మ పెద్ద మనుషులు ఉండగానే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మానుకోట దవాఖానాకు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఈసాల ధనంజయ పెద్ద కుమారుడు నాగేష్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకోలేదని, సదరు యువతికి అన్యాయం చేశాడని ఎస్టీ (కోయ) సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు ధనంజయ కుటుంబాన్ని గత నాలుగేండ్లుగా కుల బహిష్కరణ చేశారు. కుల పెద్దల నిర్ణయం ప్రకారం వారితో ఎవరూ మాట్లాడవద్దు, శుభ కార్యాలకు పిలవొద్దు, ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కులానికి సంబంధించిన వారు ఎవ్వరూ వెళ్లవద్దని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని ఎవరైనా ధిక్కరిస్తే వారికి రూ.1 లక్ష జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. ధనంజయ కూతురు ప్రవీళ కూడా మండలంలోని కోటగడ్డ గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడిని ఏడాదిన్నర క్రితం ప్రేమించి, గుడిలో వివాహం చేసుకుంది. ధనంజయ చిన్న కుమారుడు నరేష్ కూడా అదే గ్రామానికి చెందిన గీతపల్లి శారదను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం గత మే 10న మహబూబాబాద్ జిల్లా అనంతారం గుడిలో జరిగింది. వీరి వివాహానికి కనీసం అమ్మాయి తల్లిదండ్రులు కూడా రాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. ఈ విధంగా ధనంజయ, పద్మ దంపతుల ముగ్గురు సంతానం కూడా కుల బహిష్కరణ అనంతరం కులస్థులు ఎవ్వరూ రాకుండానే గుడిలో వివాహం చేసుకున్నారు. ధనంజయ చిన్న కుమారుడు నరేష్ వివాహ సమయంలోనైనా కులస్థులు కలిసి రావాలని పెద్ద కుమారుడు నాగేష్ ఊరికి రాకుండానే ధనంజయ ఏమైనా తానే భరిస్తానని, పెద్ద మనుషుల వద్దకు వెళ్లి పంచాయితీ పెట్టాడు. దీంతో పెద్ద మనుషులు సదరు బాధితరాలు రేణుక తల్లిదండ్రులకు 4 లక్షల జరిమానా కట్టాలని నిర్ణయించారు. ఈ జరిమాన కట్టిన తర్వాత కుల బహిష్కరణ రద్దు చేసి, కులంలో కలుపుకుంటామని తెలిపారు.
సెల్ : 9705032042
అమ్మాయికి అన్యాయం జరిగిందని...
ఈసాల ధనంజయ కుటుంబాన్ని నాలుగేండ్ల క్రితం కుల బహిష్కరణ చేసిన విషయం వాస్తవమే. కులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఊరి నుంచి మూడు, నాలుగు నెలల పాటు వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి, తిరిగి వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో కలిసి జీవిస్తామని ఒప్పుకున్నాడు. నాగేష్ ఇంటికి వెళ్లిన అమ్మాయిని మానసికంగా హింసించినప్పుడు సదరు అమ్మాయి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. బాధిత అమ్మాయికి న్యాయం చేయాలని నాలుగేండ్ల క్రితం పంచాయితీ పెట్టి రూ.4 లక్షలను అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చే విధంగా నిర్ణయించాం. డబ్బు చెల్లించకపోవడంతో కుల బహిష్కరణ చేశాం. కుల పెద్దల మాటను గౌరవించకుండా కుల పెద్దల మీదనే సదరు ధనంజయ పోలీసు కేసు పెట్టాడు.
- కుల మాజీ పటేల్ ఊకే జనార్దన్, ప్రస్తుత పటేల్ పూనేం మంగయ్య
కుల బహిష్కరణ చేయొద్దు
ఈసాల ధనంజయ కుటుంబాన్ని నాలుగేండ్లుగా కుల బహిష్కరణ చేయడం అన్యాయం. గత నాలుగేండ్లుగా వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఎవ్వరూ రాకపోవడం, కులంలో ఎవరి ఇంటి వద్ద ఏ శుభకార్యం జరిగినా రానివ్వకపోవడం వంటివి చట్టరిత్యా నేరం. ఈ విధంగా కుల బహిష్కరణ కారణంగా ధనంజయ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి, ఆవేదనకు గురయ్యారు. మారుతున్న నేటి తరుణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం చాలా బాధాకరం. ధనంజయ కుటుంబానికి రూ.4 లక్షలు జరిమానా విధించడంతో ఆ కుటుంబం కొంత ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ విధంగా కుల బహిష్కరణ చేయడం ఇకనైనా మానుకోవాలి.
- చింత వెంకట రమణ ( కొత్తగూడెం - సర్పంచ్)
పెద్దమనుషులకు కౌన్సెలింగ్ ఇచ్చాం
మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ధనంజయ అనే వ్యక్తి తనను కుల బహిష్కరణ చేసి, రూ.4 లక్షలు జరిమానా విధించి కుల పెద్దలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో సదరు పెద్ద మనుషులను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాం. ఈ క్రమంలో ఈ నెల 18న ధనంజయ భార్య పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలవడంతో వారి కుటుంబ సభ్యుల వాగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.
- మురళీధర్ రాజ్ (ఎస్ఐ - బయ్యారం)
Authorization