వెంకటేశ్వర్లు:
ఆధునిక సమాజం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్న వేళ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కులాలు, మతాలు, వర్గ విభేదాలు లేకుండా తమ శక్తి సామర్థ్యాలతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన తరుణంలో కూడా ఇంకా అనేక చోట్ల ఆధిపత్య కుల పెత్తందారులు తమ అహంకార ధోరణిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆయా ప్రాంతాలలో వారు తమ ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకు పెత్తనాన్ని సాగించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. దీంతో వారి ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండాపోతుంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అణగారిన వర్గాలపై అక్కడి ఆధిపత్య కుల పెత్తందారులు దాడులు, అత్యాచారాలు, హత్యలు, హింసకు పాల్పడుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి పాలకులు గానీ, సంబంధిత అధికారులు గానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో పెత్తందారుల కబందహస్తాల్లో అణగారిన వర్గాల వారి జీవితాలు నిత్యం నలిగిపోతున్నాయి. నిత్యం తీవ్ర భయాందోళనల నడుమ బడుగుల బతుకులు సాగుతున్నాయి. గత శుక్రవారం నేలకొండపల్లి మండలంలోని మోటాపురం గ్రామంలో జరిగిన ఘటన ఇందుకు మరో సాక్షీభూతంగా నిలుస్తోంది.
అదొక ఉద్యమ నేపధ్యం కలిగిన ఊరు. సుమారు 1400 మంది ఓటర్లు, 2000 మందికి పైగా జనాభా కలిగి ఉంది. గ్రామంలో మొదటి నుండి ఆధిపత్యకులాల వారిదే పెత్తనం. బయటకు పెద్దగా కనిపించకపోయినా ప్రతి విషయంలో వారి అనుమతి, ప్రమేయం లేకుండా ఏ పనీ ముందుకు సాగేదికాదు. అది గ్రామభివృద్ధి విషయమైనా సాంప్రదాయాలు, కట్టుబాట్లలోనైనా వారిదే పై చేయిగా ఉండేది. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి వంటి కుల వృత్తులు చేసుకునే వారు తాము చెప్పినట్టు చేయాలి, ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు. అలా చేస్తే ఊరి కట్టుబాట్లు వ్యతిరేకించినట్టుగా భావించేవారు. గత కొంత కాలంగా కుల వృత్తులకు చెందిన వారి పిల్లలు పైచదువులు చదువుకుని ఉన్నత స్థానాలలో కొనసాగడంతోపాటు కొత్త తరం వారు ఆయా వృత్తి పనులు చేయడం లేదు. వయసు రీత్యా పాత తరానికి చెందిన వారు కూడా ఆయా కుల వృత్తికి సంబంధించిన పనులు చేయడం లేదు. ఓపికతో ఒకవేళ వారు చేసినా పనులకు తగిన కూలి ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేండ్లుగా గ్రామంలోని రజకులు కుల వృత్తిలో తాము చేసే పనులకు గానూ సరైన కూలి ఇవ్వకపోవడం చేత ఆ పనులు మానేశారు. ఈ పరిస్థితులన్నింటినీ మనసులో పెట్టుకున్న గ్రామ ఆధిపత్య కుల పెత్తందారులు రజకుల అవసరాలు, బలహీనతలు, ఇబ్బందులను ఆసరా చేసుకుని అప్పుల రూపంలో వారికి డబ్బులు ఇచ్చి వడ్డీల పేరుతో నిత్యం వేధింపులకు దిగేవారు. కందగట్ల నాగమ్మ అనే రజక మహిళ ఏలూరి భారతమ్మ అనే ఆధిపత్య కుల మహిళ వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నది. అసలు డబ్బులు ఇచ్చినా వడ్డీ చెల్లించాలని వేధించారు. గత గురువారం ఇంటికి వచ్చిన భారతమ్మ కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషించిది. అదేమని అడిగిన తన కొడుకుపై చేయి చేసుకున్నది. తమను కులం పేరుతో దూషించడం, కొట్టడమే కాకుండా వడ్డీ డబ్బుల విషయమై మాట్లాడదామని ఆధిపత్య కుల పెద్దలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. జరిగిన విషయమై వారికి వివరిస్తుండగానే ఆ గ్రామ ఆధిపత్య కుల పెద్ద మీసాల కోటయ్య ఒక్కసారిగా దాడికి దిగాడు. జరిగిన ఘటన చూసిన ఆమె కోడలు అడ్డుకోబోయింది. దీంతో కోపోద్రిక్తులైన ఆధిపత్యకుల పెద్దలు తూము బిక్షం, ఏలూరి శ్రీను, చావా బిక్షం, బొల్లి వెంకన్న, చావా కిరణ్లు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కావాలనే అప్పుల వడ్డీని సాకుగా చూపి వారు చెప్పినట్టుగా గ్రామంలో ఏ పనీ చేయడం లేదనే మూకుమ్మడిగా దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా 'మాకు ఎదురు చెబితే, మాట్లాడితే మీ కుటుంబాలన్నింటినీ కిరోసిన్ పోసి చంపేస్తామ'ని బెదిరించారు. వారి పెత్తందారి విధానాలతో విసిగి వేసారిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన విషయంపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తమకు ప్రాణభయం ఉన్నదని బాధితులు వాపోతున్నారు. వారికి ఎదురు తిరిగిన కారణంగా భవిష్యత్తులో ఊరిలో ఏ రకంగా ఎవరూ సహకరించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు తగిన రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎంబీసీ, కేవీపీఎస్, రజక, ఎంఆర్పీఎస్ వంటి అనేక సంఘాల వారు మోటాపురం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామనీ న్యా యం జరిగే వరకు పోరాడతామని వారికి ఆత్మస్థైర్యం, భరోసా కలిగించారు. ఆయా సంఘాల వత్తిడితో స్థానిక ఎస్ఐ ఎన్.గౌతమ్ సెక్షన్-354, 294-బి, 323, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేయడమే కాదు వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు ప్రాణభయం ఉన్నందున వారికి తగిన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సెల్ : 9948843937
బట్టలు చిరిగేలా కొట్టారు
మహిళలమనే ఇంగిత జ్ఞానం, కనికరం కూడా లేకుండా వందల మంది ఊరి జనం చూస్తుండగానే కిందపడేసి తీవ్రంగా గాయపరిచారు. ఇది మాకు చాలా అవమానంగా ఉంది. వంటి మీద బట్టలు చిరిగేలా కొట్టడంతో మాకు చాలా బాధనిపించింది. ఇంత కర్కషంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. వారు కావాలనే కుట్ర పూరితంగానే దాడి చేశారు. దీనిపై మాకు న్యాయం జరగాలి.
- కందగట్ల లక్ష్మీ ,బాధితురాలు మోటాపురం
కులం పేరుతో అవమానపరిచారు
నిత్యం వారి బట్టలు, బతుకులు శుభ్రం చేసేవారమనే జాలి కూడా లేకుండా, చులకన భావంతో మాపై దాడి చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానపరిచారు. ఇలా జరుగుతుందని ఏనాడు ఊహించలేదు. మాపై వారికున్న అభిప్రాయం ఏంటో తేలిపోయింది. వారు ఇచ్చినంత తీసుకుని చెప్పినట్టు వృత్తి పనులు చేయడం లేదనే అక్కసుతోనే ఇదంతా చేశారు.
- కందగట్ల సైదమ్మ బాధితురాలు. మోటాపురం
మాకు రక్షణ కల్పించాలి
మేము వారిపై కేసులు పెట్టామనే కోపంతో మాపై కక్ష పెంచుకుంటున్నారు. భవిష్యత్తులో మమ్ములను ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టే ప్రమాదముంది. అందుకే మాకు రక్షణ కావాలి. ఆడవారిమనే జాలి కూడా లేకుండా విచక్షణారహితంగా మాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షంచి మాకు న్యాయం చేయాలి.
- కందగట్ల నాగమ్మ ,బాధితురాలు మోటాపురం
పెత్తందారులను కఠినంగా శిక్షించాలి
మోటాపురం గ్రామంలో రజక మహిళలపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలి. ఆధునిక సమాజంలో కూడా ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడటం దారుణం. ఇటువంటి పెత్తందారులకు తగిన బుద్ది చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అగ్రకుల పెత్తదారుల ఆగడాలకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలి.
- దోనేపల్లి వెంకన్న, ఎంబీసీ సంఘం జిల్లా కార్యదర్శి
అనాగరిక చర్యలు సిగ్గుచేటు
ఆధిపత్యకుల పెత్తందారుల అహంభావానికి పెత్తందారి విధానాలకు ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఇటువంటి దాడులు జరగకుండా వారిలో మనుషుల మధ్య ఉండే విలువలు కులాల మధ్య ఉండాల్సిన భావాలు, సంబంధాలపై వారికి సరైన అవగాహన కల్పించాలి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలి.
- పగిడికత్తుల నాగేశ్వరరావు ,కేవీపీఎస్ జిల్లా నాయకులు