''రాజు మరణించే నొక తార రాలిపోయే
కవియు మరణించే నొక తార గగన మెక్కె
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు''
ఫిరదౌసిలో జాషువా చెప్పిన మాటలు అక్షర సత్యాలై నిలిచాయి. జాషువా రచనలు ప్రజల జీవ నాలుకలపై ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి. జనం మదినిండా సజీవంగా అలరారుతున్నాయి. 19వ శతాబ్ధం చివరి దశలో సామాజిక ప్రయోజనం కోసం భావకవిత్వ రీతినుంచి పక్కకు జరిగి మూఢాచారాలతో తులతూగుతున్న ఆనాటి పెత్తందార్ల అధర్మాలకు అడ్డు కట్టగా నూతన ఒరవడితో తన రచనలు కొనసాగించారు గుర్రం జాషువా. దళితుల్లో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిల్చారు.
''కులమతాలు గీసుకున్న గీతలు జొచ్చి పంజరాన కట్టువరను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను'' తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడిన ప్రతి బిడ్డకు ఆ స్థల కాలాలను బట్టి ఒక మతం, ఒక కులం, ఒక భాష, ఒక ప్రాంతం, ఇట్లా ఒక గుర్తింపు వస్తుంది. అయితే మనం నాగరికులుగా బతుకుతున్న క్రమంలో చదువుకుని విద్యావంతులమై ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో జన్మతా ఏర్పడిన పరిమితులను అధిగమించాలి. మనిషి తనను తాను విస్తృతపరచుకోవాలి. అది వివేకం కూడా. లేకుంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలిపోతారు. సాంస్కృతికంగా, వైజ్ఞానికంగా ఎదుగుదల లేకుండా మరుగుజ్జులుగా మిగిలిపోతారు. మన కులాలను దాటి ఇతర కులాలను, మన మతాన్ని దాటి ఇతర మతాలను, మన భాషను దాటి ఇతర భాషలను మన దేశాన్ని దాటి ఇతర దేశాలను అభిమానించలేని వాళ్లు సాంస్కృతిక మరుగుజ్జులు. అలా అభిమానించే వాళ్లు విశ్వమానవులుగా చరిత్రలో నిలిచిపోతారు. తామే గొప్పవాళ్లమని, తమ వంశమే గొప్పదని, తమ కుల, మతాలే గొప్పవని పొంగిపోవడం కురచ బుద్ధి. ''విపులాచ పథ్వీ'' అని ఎప్పుడో మన పెద్దలు చెప్పినట్టు పథ్వి విశాలమే గాని, మనలో అనేకులు అనేక కారణాలచేత ఈ మార్పులను అంగీకరించలేకపోతున్నారు. ఈ సమాజానికి హానిచేసే నిరంకుశత్వానికి, అరాచకానికి దారితీస్తుంది. దీనికి పరిష్కారం విశ్వజనీన చింతన. గుర్రం జాషువా ఇలాంటి విశ్వజనీన చింతనగల తెలుగుకవి. 'మాది తెలుగు కలికి.. మా కలికి తెలుగు కులము అచ్చముగ భారతీయుడనయితిని నేడు అని ధైర్యంగా ప్రకటించుకున్న కవి జాషువా. ''విశ్వనరుడ నేను'' అని విశ్వజనీనతను కూడా ప్రకటించుకున్న కవి మరొకరు లేరు. వినుకొండ వీధులనుండి విశ్వవీధులకు ప్రయాణించాడు గుర్రం జాషువా. పుట్టుకతో వచ్చిన కుల, మత ప్రాధేశిక పరిమితులను తాను గుర్తిస్తూనే వైజ్ఞానికంగా సాంస్కృతికంగా విశాలమై జాషువా చేసిన ప్రకటన అది.''ఎల్లలోకము వొక్కయిల్లై / వర్ణ భేదములెల్ల కల్లై'' పోవాలని కోరుకున్న గురజాడ అప్పారావు వారసత్వం. వీరి మార్గంలోనే గుర్రం జాషువా ''విశ్వసౌభ్రాతృత నభ్యసింపుము'' అని ప్రబోధించారు. వీరి మార్గంలోనే శ్రీశ్రీ. 'అవిభక్త కుటుంబీక రక్తబంధూ! / మానవుడా! మానవుడా!' అని సంబోధించారు. అందుకే వీరందరు విశ్వకవులయ్యారు. జాషువా ఒకవైపు తెలుగు జాతి, దాని చరిత్ర, భాషా సాహిత్యాలు, తెలుగు పాలకులు, నాయకులు, తత్వవేత్తల గురించి కవిత్వం రాశారు. మరోవైపు భారతదేశం, భారత చరిత్ర, భారత వీరులు, భారత తత్వవేత్తల గురించీ కవిత్వం రాశారు. ఈ అన్నిటిలోను తనదైన దళిత వేదనను వినిపిస్తూ వచ్చారు. అదే సమయంలో సమాజంలోని అనేక వైరుధ్యాలను, ముళ్ల కంచెలను ఎత్తిచూపి, వాటికతీతంగా ''విశ్వనరుడ నేను'' అని ప్రకటించారు. నిజానికి ఈ ప్రకటన భారతీయ సమాజంలోని సాంఘిక నిరంకుశత్వం మీద నిరసన. అదే సమయంలో అది ఆయన సాంస్కృతిక ఎదుగుదలకు సంకేతం. గౌతమబుద్ధుడు, ఏసుక్రీస్తు, బాపూజీ ఈ ముగ్గురిని ఆయన శాంతి, అహింసా, కరుణవంటి విశ్వజనీన భావాలకు మూల పురుషులుగా భావించారు. రుక్మిణి కళ్యాణం, శివాజీ, ముంతాజమహలు, క్రీస్తు చరిత్ర, కాందిశీకులు వంటి కావ్యాల ద్వారా ఆయన తన విశ్వజనీన భావాలను చాటారు. అన్ని మతాల ఇతివృత్తాలను తెలుగు కవిత్వంగా మార్చడం ద్వారా తాను మతపరమైన కంచెలను దాటినట్టు సూచించారు. ''అణ్వస్త్రాలు మాకొద్దు అన్న వస్త్రాలు కావాలి'' అనే నినాదం పెట్టుబడిదారీ దేశాల అణ్వాయుధ వ్యామోహాన్ని నిరసిస్తూ ప్రపంచ ప్రజలందరూ చేశారు. 'కాందిశీకుడు' కావ్యాన్ని సంపూర్ణంగా బౌద్ధతాత్వికతతో ప్రపంచ శాంతి స్థాపన కోసమే రాశారు జాషువా. ''దిక్కులు నిండ నిప్పులన్ గ్రక్కుచునున్న / నేటి రణమృత్యువు సేయు దురాగతముల్'' ఈ కావ్యంలో నిరసించారు జాషువా. అలాగే 'ఎల్లజాతుల వారు లేకోదరులైనట్లు / ముద్దుముద్దుగ పొంది పొసగుచోటు' ఈనాటికి అవసరమే. యుద్ధంలో పాల్గొని ఆ బీభత్సాన్ని భరించలేని ఒక తెలుగు సైనికుడు బర్మా నుండి బయటపడి నల్లమల అడవులను చేరుకుంటాడు. అక్కడ కాసేపు సేదతీరినపుడు ఆయనకు ఒక బౌద్ధి భిక్షువు కపాలం కనిపిస్తుంది. కాందిశీకునికి ఈ కపాలానికి మధ్య జరిగిన సంవాదమే ఈ కావ్యం. కాందిశీకుడు బుద్ధుని కాలానికి తన కాలానికి మధ్య వచ్చిన మార్పులను వివరిస్తాడు. అన్నీ చెప్పి 'వెలితి వడ్డది మాకు విశ్వసౌభ్రాత్రంబు మధురాతిమధుర సమత్వ దృష్టి' అని అంటాడు. అలాగే 'ఆ శించుచున్నారా సకల దేశాల ముత్తమమైన నిరతబాంధవ్య లబ్ధి' అన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తాడు. ప్రపంచ ప్రజల మధ్య మంట పెడుతున్న ప్రపంచ యుద్ధం ఎప్పుడు నశిస్తుందో ప్రపంచ శాంతి ఎప్పుడు సాధ్యమవు తుందోనని ఆవేదన పడతాడు. జాషువా ప్రశ్నలకు ఇంకా జవాబు దొరకలేదు. 'నాదు కన్నీటి కథ సమన్వయం సేయనార్థ హృదయంబు గూడ కొంతవసరంబు'' అని గబ్బిలం గురించి జాషువా వాపోయాడు. ఉత్తమ జాతి పక్షులుగా పిలువబడే హంసలు, చిలుకలను పక్కకు తీసి సమాజంలోకి అతి వేగంగా దూసుకుపోయేలా 'గబ్బిలం' కవి కండ్లకు దళితంగానే కనిపించింది. జాషువా రచనలు అగ్రరాజ్యాధికారం తుదముట్టించే దిశలో కొనసాగాయి. దళితులకు తిండి బట్టలతోపాటు స్వేచ్ఛ జీవనం కూడా దుర్భేద్యంగా ఉండేది ఆనాటి కాలంలో. 'కఠిన చిత్తుల దురాగములు ఖండించి కనికర మొలకించు కులమునాది' అందుకే 'నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయున్' అని హెచ్చరించాడు. గర్జించాడు. శాసించాడు. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీస్తూ జాషువా విప్లవమూర్తిగా సాక్షాత్కరించాడు. పంచమ కులం ఎక్కడుందని ఆవేదనకు గురయ్యాడు.
'ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాను గాని అవసరమునకన్నా హీనుడు భాగ్యుడు.. హైందవ కులస్థుడెవరమ్మా, సవిత్రి.?' అంటూ తన పద్యాలను తెలుగు సాహిత్య చరిత్రలో దళిత సాహిత్యానికి మార్గదర్శకంగా రాశారు. బాబాలు, వెంకటేశ్వర స్వాములపై హేతువాద రీతిలో రాసిన పద్యాలు చైతన్యవంతంగా కనిపిస్తాయి. అయితే కులం ద్వారా కలిగిన అవమానం, దారిద్య్రంతో జాషువా హృదయం ద్రవించింది. 'ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు గసరి బుసగొట్టు నాతని గాలి సోక నాల్గు పడగల హైందవ నాగరాజు''అని హిందుత్వాన్ని తీవ్ర ధ్వనితో నిరసించాడు కవి. 'విశ్వనరుడను నేను, నాకు తిరుగులేదు'' అని తన వీర కవిత్వాన్ని యావత్ ప్రపంచానికి ఒక చక్కని అక్షర పూలమాలలుగా అందించారు. ఈ కోవలోనే 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారాలు అందించింది. అంతేకాక కవి కోకిల, కవి విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ బిరుదులు అందుకున్నారు. 'మత పిచ్చిగాని, వర్ణోన్నతిగాని, స్వార్థ చింతనము గానీ నాకతులందుండదు' అని జాషువా స్పష్ట పరిచారు. ఎవరూ చూడని చీకటి కోణాలను చూడగల క్రాంతదర్శి కవి జాషువా. జాషువా కవిత్వంలో జాలి, దయ, కరుణలు కనిపిస్తాయి. నిజానికి జాషువా జీవితం నుండి అతని కవిత్వం వికసించింది. తన రచన ద్వారా అణగారిపోతున్న పేద సమాజాన్ని మా ర్చాలి అనుకున్నారు. ఆ కోవలోనే ప్రయత్నించారు. జాషువాలో, అతని రచ నలలో కసి గానీ, ద్వేషం గానీ లేదు. కేవలం ప్రతిఘటన మాత్రమే. అందరూ సమానమనే తత్వాన్ని బోధించారు జాషువా. వారి ఆలోచనలు, ఆరాటం, తపన అంతా సమాజ మార్పు కోసమే.. జాషువా కలాన్ని గళంగా మార్చి విశేష సాహిత్య సంపదను సృష్టించారు. ప్రజల్లో తన రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించారు. సమాజంలో చెరగని ముద్ర జాషువా. వారి ఆశలు, అకాంక్షలు, లక్ష్యాలు నెరవేర్చడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి.
- అనంతోజు మోహన్ కృష్ణ
సెల్ : 8897765417
Authorization