సదాశివరావు
కాసులకు కక్కుర్తి పడి.. ప్రాణాలు పోయాల్సిన చేతులే పసిగుడ్డులను చిదిమేస్తున్నాయి. నిరక్షరాస్యత, పేదరికం, మూఢనమ్మకాలు వెరసి కన్నవారే కాదంటున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులతో దూసుకుపోతున్న సమాజంలో అవగాహన లోపంవల్ల కొంతమంది, ఆర్థిక పరిస్థితుల వల్ల మరికొంతమంది, కాసులకు కక్కుర్తిపడి ఇంకొంతమంది ఆడ శిశువుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్ల పుడితే ఆర్థిక భారంగా భావిస్తున్నారు. ఆడ శిశువులను అమ్మకానికి పెడుతున్నారు. విద్య లేకపోవడం, మూఢనమ్మకాలు, పేదరికం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలంటే భారంగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని భార్యను పుట్టింటికి పంపించిన ఘటనలు ఉన్నాయి. మరికొంతమంది చిన్నారులను విక్రయించిన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించి కడుపులోని శిశువు ఆడా, మగా తెలుసుకొని ఆడపిల్ల అయితే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది. కడుపులో ఉన్నది ఆడ శిశువని నిర్ధారణ చేసుకొని హత్యకు పాల్పడ్డారు. ఇలా కొన్ని ఘటనలు మాత్రమే బహిర్గతమవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొంత మార్పు వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు అమ్మాయి పుడితే ఎలా వదిలించుకోవాలనే దుస్థితి నేటికీ కొనసాగుతున్నది. ప్రయివేటు ఆస్పత్రుల్లో కాసులకు కక్కుర్తిపడి కొందర గర్భిణులకు నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ చేస్తున్నారు. పుట్టేది అమ్మాయి అని నిర్ధారించడంతో వారు భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. సంబంధిత అధికారుల ఉదాసీనత వల్ల ఆస్పత్రులపై పర్యవేక్షణ లేకపోవటంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్వతహాగా నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రెండు కాన్పుల తర్వాత కూడా మూడో కాన్పులో అమ్మాయి అని తేలితే అబార్షన్లు చేయించుకుంటున్నారు. అయితే పట్టణాల్లో జరిగే అబార్షన్లను గోప్యంగా ఉంచుతున్నారు. గత కొంతకాలంగా భ్రూణ హత్యలు ఈ ప్రాంతంలో కొనసాగుతూనే ఉన్నాయి. మూడో కాన్పులోనూ ఆడపిల్ల కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా విక్రయించడానికీ వెనుకాడడం లేదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని దంట్ల కుంట తండాకు చెందిన ఒక గిరిజన మహిళ తన మూడో కాన్పులో ఆడశిశువు అని తెలుసుకొని అబార్షన్కు ఒడిగట్టింది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20కిపైగా వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవగాహన లోపం, విద్య లేని కారణంగా నేటికి అమ్మాయి పుడుతుందని తెలిస్తే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. తొర్రూరు పట్టణంలోని పలు ప్రయివేటు ఆస్పత్రుల్లో రహస్యంగా స్కానింగ్ చేసి ఆడపిల్లలు అనే నిర్ధారించుకొని అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో జరిగే అనేక ఘటనలు వెలుగు చూడడం లేదు. ఒక సంఘటన వెలుగు చూసినప్పటికీ వాటిపై అధికారుల చర్యలు శూన్యం.
సెల్ : 7893020654
Authorization