యండి.ఉస్మాన్ ఖాన్
బ్రిటిష్ వారు భారతదేశంలో ఏవో కొన్ని భాగాలను కాక, క్రమంగా మొత్తం దేశాన్నే ఆక్రమించాలని యత్నిస్తున్నట్టు టిప్పూ పసిగట్టాడు. స్వదేశీ రాజులు కలిసిరావాలని పిలుపునిచ్చాడు. కాని ఎవరూ స్పందించలేదు. అయినా సరే ఒంటరిగానే ఎదురు తిరిగాడు. అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన మొదటి యుద్ధంలో ఆయన ఓటమి చెందిన ఫలితంగా బ్రిటిష్ వారికి మూడు కోట్లు 'కప్పం' చెల్లించడమే కాక, తన కుమారులిద్దరినీ వారి వద్ద 'తాకట్టు'గా ఉంచవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా, టిప్పు బ్రిటీషోడికి 'దాసోహం' అనలేదు. అంతేకాదు, తన రాజ్య స్వయం ప్రతిపత్తిని వదులుకోవడానికి కూడా ఆయన సుతరామూ సమ్మతించలేదు. మరొకరైతే, ఒకసారి ఓటమి చెందగానే బ్రిటిష్ వాడి కాళ్లుపట్టుకొని, ఏదో విధంగా తమ రాజ్యాన్ని కాపాడుకొనేవారు. చివరికి ఆయనను బెదిరించడానికి, తమ వద్ద 'తాకట్టు'గా అట్టిపెట్టుకున్న ఆయన కొడుకులిద్దరినీ ఆ బ్రిటిష్ ముష్కరులు నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. అయినా, కొండంత దుఖాన్ని కడుపులోనే దాచుకొని కడవరకు నిగ్రహం వహించాడే తప్ప, టిప్పు వారికి దాసోహ మనలేదు. ధైర్యం కోల్పోకుండా, నిరాశకు గురికాకుండా ఒంటరి పోరాటం కొనసాగించాడు.
కర్ణాటకలో కుమారస్వామిని కుర్చీ దింపి, అధికార పీఠం అధిరోహించిన ఉత్తరక్షణం యడియూరప్ప సర్కారు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. టిప్పు సుల్తాన్ దేశభక్తుడు కాదు, మతవాద ముస్లిం కనుక అలాంటి వ్యక్తి జయంతిని ఎలా జరుపుకోవాలన్నది బీజేపీ శ్రేణుల వాదన. కానీ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 'కర్ణాటక కేసరి' టిప్పు సుల్తాన్ను స్వాతంత్య్ర సమరయోధుడని, అప్పటి ఇంగ్లీషు పరిపాలకులతో స్వాతంత్య్రం కోసం పోరాడి, వీరమరణం పొందిన మహోన్నత దేశభక్తుడని కొనియాడారు. అలాంటి దేశభక్తుని జన్మదిన మహోత్సవాన్ని వైభవోపేతంగా జరపాలని గత ప్రభుత్వం నిర్ణయించడం, బీజేపీ దాన్ని వ్యతిరేకించడం ఇప్పటి వరకూ జరుగుతూ వచ్చిన తంతు. ఇప్పుడు అధికారం చేతికి రాగానే కర్ణాటకలో ఇదొక్కటే ప్రధానమైన, ఇప్పటికిప్పుడు పరిష్కరించవలసిన సమస్య అన్నట్టు టిప్పు సుల్తాన్ జయంత్యోత్సవాలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది 'యెడ్డి'సర్కార్.
నిజానికి భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో టిప్పుసుల్తాన్ది ప్రత్యేక స్థానం. ఆంగ్లమూకల కబంద హస్తాల నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఆయన సాగించిన పోరాటం అజరామరం. పిన్న వయసులోనే ఆ యువ కిశోరం చూపిన తెగువ, ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎంతైనా శ్లాఘనీయం. పదిహేనేండ్ల పిన్నప్రాయంలోనే సుల్తాన్ రాజ్యపాలనా వ్యవహారాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ, తండ్రితోపాటు యుద్ధాల్లో పాల్గొనేవాడు. అనన్యమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
మైసూరును దక్షిణాదిన బలీయమైన రాజ్యంగా నిలబెట్టాలని కలలుగన్న సుల్తాన్ తండ్రి హైదర్ అలీ, తన జీవితంలోని అత్యధిక కాలాన్ని రణభూమిలోనే గడిపాడు. అదేక్రమంలో 1782లో శత్రువుతో వీరోచితంగా పోరాడుతూ నవంబర్ 6న రణరంగంలోనే తుదిశ్వాస వదిలాడు. ఈ దుర్వార్త తనయుడు సుల్తాన్కు చేరే సమయానికి అతడు మలబార్ తీరాన కల్నల్ హంబల్ స్టోన్తో తలపడుతున్నాడు. తండ్రికన్ను మూసిన వార్త తెలియగానే సుల్తాన్ హుటాహుటిన శ్రీరంగపట్నం చేరుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 31 సంవత్సరాలు. చిన్నవయసులోనే వీరాధివీరుడిగా, ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన టిప్పు సుల్తాన్ మైసూరుకు రాజయ్యాడు. రాజ్యాధికారం సులభంగానే సంక్రమించినా, దక్షిణభారతంలో మైసూరు ఒక బలమైన, స్వతంత్ర రాజ్యంగా అవతరించడం ఇష్టం లేని నిజాం నుండి, మరాఠా పాలకులనుండి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సుల్తాన్ ఏమాత్రం బెదరలేదు. ప్రజలకు ప్రభువుగా, రాజ్యానికి రాజుగానే కాకుండా ప్రజలనే తన ప్రభువులుగా భావించేవాడు సుల్తాన్. ప్రజాసంక్షేమంలోనే రాజ్యసంక్షేమం, రాజుసంక్షేమం దాగుందని బలంగా నమ్మే సుల్తాన్ రాజ్యాభిషేకం రోజునే, ''ప్రజల్ని విస్మరించి, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే నేను నా జీవితాన్ని, నా సంతానాన్ని, చివరికి నా స్వర్గాన్ని కూడా కోల్పోవచ్చు. ప్రజలసంక్షేమం, వారి సంతోషంలోనే నా సంతోషం, సంక్షేమం ఇమిడిఉంది. నాకిష్టమైనదాన్ని కాకుండా నా ప్రజలకు ప్రయోజనకరమైన దాన్నే నేను నా ఇష్టంగా, అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రాజ్యాధికారం ప్రజలకు సేవ చేయడానికేగాని, స్వీయలాభం పొందడానికి కాదు'' అని విస్పష్టంగా ప్రకటించాడు.
బ్రిటిష్ వారు భారతదేశంలో ఏవో కొన్ని భాగాలను కాక, క్రమంగా మొత్తం దేశాన్నే ఆక్రమించాలని యత్నిస్తున్నట్టు టిప్పూ పసిగట్టాడు. స్వదేశీ రాజులు కలిసిరావాలని పిలుపునిచ్చాడు. కాని ఎవరూ స్పందించలేదు. అయినా సరే ఒంటరిగానే ఎదురు తిరిగాడు. అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన మొదటి యుద్ధంలో ఆయన ఓటమి చెందిన ఫలితంగా బ్రిటిష్ వారికి మూడు కోట్లు 'కప్పం' చెల్లించడమే కాక, తన కుమారులిద్దరినీ వారి వద్ద 'తాకట్టు'గా ఉంచవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా, టిప్పు బ్రిటీషోడికి 'దాసోహం' అనలేదు. అంతేకాదు, తన రాజ్య స్వయం ప్రతిపత్తిని వదులుకోవడానికి కూడా ఆయన సుతరామూ సమ్మతించలేదు. మరొకరైతే, ఒకసారి ఓటమి చెందగానే బ్రిటిష్ వాడి కాళ్లుపట్టుకొని, ఏదో విధంగా తమ రాజ్యాన్ని కాపాడుకొనేవారు. చివరికి ఆయనను బెదిరించడానికి, తమ వద్ద 'తాకట్టు'గా అట్టిపెట్టుకున్న ఆయన కొడుకులిద్దరినీ ఆ బ్రిటిష్ ముష్కరులు నిర్దాక్షిణ్యంగా హతమార్చారు. అయినా, కొండంత దుఖాన్ని కడుపులోనే దాచుకొని కడవరకు నిగ్రహం వహించాడే తప్ప, టిప్పు వారికి దాసోహ మనలేదు. ధైర్యం కోల్పోకుండా, నిరాశకు గురికాకుండా ఒంటరి పోరాటం కొనసాగించాడు. బ్రిటిష్ వారితో ఆయన నాలుగు యుద్ధాలు చేశాడు. మధ్యలో రెండింటిలో టిప్పు సుల్తాన్ గెలిచేసరికి బ్రిటిష్ వారికి బెంబేలెత్తి, ఆయనను తుదముట్టిస్తే తప్ప, తాము ఆ రాజ్యంలో కాలు మోపలేమని భయపడ్డారు. టిప్పుపై చతుర్ముఖ దాడికి ఉద్యమించారు. ఉత్తరం నుంచి నిజాం సైన్యాలు, దక్షిణం నుంచి మహారాష్ట్ర సేనలు, తూర్పు, పశ్చిమ దిశల నుంచి బ్రిటిష్ పదాతి దళాలు, అశ్విక దళాలు శ్రీరంగపట్నాన్ని చుట్టు ముట్టాయి. స్వదేశీ సంస్థానాలే విదేశీయులతో చేతులు కలిపాయి. అయినా, టిప్పూ వెనుకంజ వేయలేదు.
టిప్పు జీవిత విశేషాల్లో ఇంకా అనేక ప్రత్యేకతలున్నప్పటికీ, చెప్పుకోవలసిన ముఖ్య అంశం. టిప్పు తన ధర్మాన్ని ఎంతగా అభిమానించేవాడో, పర ధర్మాన్నీ అంతగానే గౌరవించే వాడు. 'పరివార్' శ్రేణులు బొంకుతున్నట్టు ఆయన పరమత దురభిమాని ఎంతమాత్రం కాదు. అన్ని మతాలను సమానంగా, గౌరవభావంతో చూసే వాడు.
ఈస్టిండియా పాల కులతో పోరాడుతున్న క్రైస్తవ మతాచార్యులను అమితంగా గౌరవించే వాడు. మసీదు- మందిరాలమధ్య ఎలాంటి తారతమ్యం చూపలేదు. 1791-92లో మైసూరు రాజ్యంపై దాడి చేసిన మరాఠాలు శృంగేరీ పీఠానికి చెందిన శారదామాత విగ్రహాన్ని పెకిలించేశారు. ఈ విషయాన్ని శృంగేరీ పీఠాధిపతి టిప్పూకు తెలియజేశాడు. దీనిపై విచారం వ్యక్తం చేసిన సుల్తాన్ పీఠాధిపతికి రాసిన లేఖలో 'పవిత్ర స్థలం పట్ల అపచారానికి పాల్పడినవారు తగిన ప్రతిఫలం అనుభవిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆలయ పునరుద్ధరణకు ఇతోధిక సహాయ సహకారాలు అందజేశాడు. మైసూరు రాజ్యంలోని అనేక ఆలయాలకు ప్రతి ఏడాది గ్రాంటుగా ప్రత్యేక నిధులను మంజూరు చేసేవారు. ఈమేరకు టిప్పు సుల్తాన్ 156 ఫర్మానాలను జారీచేశాడు.
ఒకసారి సుల్తాన్ వద్దకు ఒకవ్యక్తి వచ్చి బ్రాహ్మణులు నమ్మదగినవారు కాదు అన్నాడట. ఈ ఆరోపణ వినగానే టిప్పు అగ్గిమీద గుగ్గిలమై, తండ్రి హైదర్తోపాటు, తానూ అమితంగా గౌరవించే పూర్ణయ్య పంతులు (బ్రాహ్మణుడు) సేవలను ఉదహరించాడట. ఎవరు తప్పు చేస్తే వారిని మాత్రమే నిందించాలి తప్ప, ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాజాన్ని, జాతిని తప్పుపట్టడం, నిందించడం అహేతుకం, అవివేకం అన్నాడాయన. ఎవరి పాపపుణ్యాలు వారివే అన్న దైవగ్రంధ ప్రవచనాన్ని ఉటంకిస్తూ, మరెప్పుడూ ఇలాంటి ఫిర్యాదులు తీసుకురావద్దని ఆ వ్యక్తిని కఠినంగా మందలించాడు. టిప్పు కొలువులో ముఖ్యమైన పదవుల్లో అనేకమంది హిందువులున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన పదవి ప్రధాన దివాన్గా పూర్ణయ్య పంతులుగారే ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా కృష్ణారావు, నిఘా విభాగానికి శ్యామయ్య, దౌత్య ప్రతినిధులుగా అప్పాజీ రామ్, శ్రీనివాసరావు, శ్రీపాల్రావులు ఉన్నారు. సైన్యంలో మూల్ చంద్, సుజన్ రావ్, హరిసింగ్ తదితరులున్నారు. సుల్తాన్ సైన్యంలోని 19 మంది సేనాపతుల్లో 10 మంది, 13 మంది మంత్రులలో ఏడుగురు హిందువులేనని ప్రఖ్యాత చరిత్రకారుడు బి.ఎన్.పాండే తన గ్రంధంలో పేర్కొన్నారు.
పరమత సహనానికి మారుపేరుగా నిలిచిన టిప్పు సుల్తాన్ అసమాన ధైర్య సాహసాలతో తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకొని, పిన్నవయసులోనే అనేక విజయాలు నమోదు చేశాడు. మలబారు ప్రాంతంలో ప్రారంభమైన ఆ యుద్దవీరుని జీవితం అటు ఈస్టిండియా కంపెనీతో, ఇటు స్వదేశీ పాలకులైన నిజాం, మరాఠాలతో పోరులోనే గడిచింది. చివరిశ్వాస వరకూ బ్రిటిష్ ముష్కర మూకలను భారతదేశం నుండి తరిమికొట్టడానికి అవిశ్రాంతంగా పోరాడిన స్వదేశీ పాలకుడిగా టిప్పు సుల్తాన్ చిరస్మరణీయమైన ఖ్యాతిని గడించాడు. ఈ అసమాన పోరాట యోధుడు, మాతృదేశాన్ని బ్రిటిష్ ముష్కర మూకల బానిసత్వం నుండి రక్షించడానికి చివరి శ్వాస వరకూ ప్రయత్నించిన స్వాతంత్య్ర పిపాసి, ప్రజారంజక పాలనను అందించి అధికారానికి అక్షర భాష్యం చెప్పిన ప్రభువు. చివరకు నాల్గవ ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో - 1799 మే నెలలో బ్రిటిష్ సేనలతో పోరాడుతూ యుధ్ధభూమిలోనే తుదిశ్వాస వదిలాడు. రాష్ట్రపతి కోవింద్ అన్నట్టు అది వీరమరణం. ఎవరెన్ని కుట్రలు పన్నినా, మానవజాతి ఉన్నంత వరకూ టిప్పు సుల్తాన్ దేశభక్తి, ఆయన పాటించిన సమానత్వ విలువలు, అమరత్వం అజరామరంగా నిలిచి ఉంటాయి.
Email: mdokhan645@gmail.com
Authorization