పరిపూర్ణం
దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వివక్షపై వామపక్ష ప్రజా సంఘాలతోపాటు దళిత సంఘాలు, మేధావులు, ఆందోళనలు చేస్తున్నా ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వాలు కొమ్ముకాస్తుండటంతో నేటికి వివక్ష వీడటం లేదు. జిల్లా ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధితోపాటు జిల్లా కేంద్రంలో కార్మికులుగా పనిచేస్తున్న దళితులకు అవమానాలు, కన్నీళ్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో నేటికీి దళిత ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలోనూ సామాజిక వివక్ష కొనసాగుతోంది. అధికారులు సైతం ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తుండటంతో దళిత సామాజిక వర్గాలకు రక్షణ లేకుండా పోయింది.
నూతన జిల్లాలతో పరిపాలన సౌలభ్యం కలుగుతుందని ప్రకటించినప్పటికీ పాలనా సౌకర్యాలు ఎలా ఉన్నా... దళితులకు అవమానాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. నూతనంగా నాగర్కర్నూల్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నికైన నాటినుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఇరువురు నేతలు పోటీ పడినప్పటికీ చైర్పర్సనగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి పెద్దపల్లి పద్మావతికి అవమనాలు తప్పడం లేదు. జిల్లా పరిషత్ కార్యాలయాలు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ కార్యాలయం లేకపోవడం, రహదారి సైతం లేని ప్రదేశంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయడంతో మొదలైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. సాధారణ ప్రొటోకాల్ ప్రకారం జిల్లా పరిషత్ చైర్మన్కు క్యాబినేట్ హోదా ఉన్నప్పటికీ ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడం శోచనీయం. నియోజకవర్గంలోని బిజనపల్లి మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమరలో ఆమెను చివరి సీటులో కూర్చోబెట్టారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్డియాలజీ ప్రారంభోత్సవానికి ప్రచురించిన ఆహ్వాన పత్రికలో ఆమె పేరు లేకుండా చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ జెండావిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ్వరూ.. హాజరు కాకపోవడం గమనర్హం. అయితే దళితులు జరిపే కార్యక్రమానికి అగ్రకుల ఎమ్మెల్యేలు,. అధికారులు వస్తే.. అవమానకరంగా భావించడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో హమాలీలను సాంఘీక బహిష్కరణ చేయడం మరో దారుణంగా చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలో వ్యాపారి పరుశరాములు వస్త్రాలను అన్లోడ్ చేయించుకున్నాడు. రెండు రోజులైనా హమాలీ డబ్బులు ఇవ్వకపోవడతో హమాలీ మల్లయ్య డబ్బులు అడిగాడు. ''ఏందిరా వాడు వచ్చిండు... వానికి డబ్బులు ఇచ్చి పంపు'' అని తిట్ల పురాణం ఎత్తుకున్నాడు వ్యాపారి పరుశరాములు. దీంతో హమాలీ మల్లయ్య గొడవకు దిగాడు. ''మామీద ఆధారపడి బతికే మీరు మమ్ములనే ప్రశ్నిస్తారా?'' అంటూ... స్థానిక హమాలీలను కూలీ పనులకు రాకుండా నిలిపేశారు. వారిని పనుల్లో పెట్టుకోరాదని, వారితో ఎవ్వరూ మాట్లాడరాదని వ్యాపారులు తీర్మానం చేశారు. వారం రోజుల క్రితం బట్టల లోడ్ రాగా.. స్థానిక కూలీలకు పని చెప్పకుండా వనపర్తి నుండి హమాలీలను రప్పించుకున్నారు. ఇక్కడ ఉన్న వారికి పని కల్పించకుండా ఇతర జిల్లాల నుండి కూలీలను తెప్పించుకోవడంలో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాగర్కర్నూల్లో పనిచేస్తున్న వారిని వదలి బయట నుండి కూలీలను రప్పించడం పట్ల కార్మిక సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యేకు హమాలీలు ఫిర్యాదు చేయగా అతను సైతం వ్యాపారులకు వత్తాసు పలకడం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో అనేక ఏండ్లుగా హమాలీ సంఘం ఏర్పాటుచేసుకున్నారు. హమాలీలు, వ్యాపారుల మధ్య ఎంతో సఖ్యత ఉండేది. ఇటీవల హమాలీలతో ఐరన్ మార్చంట్ అసోసియేషన్ వారికి జరిగిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారి దళితులైన హమాలీలను సాంఘిక బహిష్కరణకు గురిచేసి అవమానించారు. దళితులకు రక్షణగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే, సీఐలు సైతం వ్యాపారులకే వత్తాసు పలకడం వివక్షకు పరాకాష్ట. నేడో రేపో హమాలీలతో చర్చలు జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నా వారు కూడా వ్యాపారులకే మొగ్గు చూపుతున్నారని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెల్ : 99490099324
బూతుమాటలతో దాడి చేశారు
పనిచేసిన కూలీ డబ్బులు అడిగితే తిట్ల పురాణం ఎత్తుకున్నారు. మా పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని కాదని ఇతర జిల్లాల వారికి పనులు ఇస్తున్నారు. మాతో వ్యాపారులు ఎవ్వరూ మాట్లాడటం లేదు. మమ్మల్ని సాంఘిక బహిష్కరణ చేశారు.
- మల్లయ్య, హమాలీ కార్మికుడు
హమాలీలపై వివక్ష తగదు
జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న హమాలీల విషయంలో వ్యాపారులు వివక్ష చూపుతున్నారు. కూలీ డబ్బులు ఇవ్వమని అడిగితే నానా రకాల బూతు మాటలంటున్నారు. ప్రశ్నిస్తే.. సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. పనులు ఇక్కడి వారికి కాదని పక్క జిల్లా కూలీలకు ఇవ్వడం దారుణమైన విషయం. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడం చేతనే ఆధిపత్య కులాల వారు ఇలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, వ్యాపారులు వివక్ష మానకపోతే మునుముందు ఆందోళన తీవ్రతరం చేస్తాం.
- రామయ్య పొదిల, హామాలీల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు
మాకు పనులు ఇవ్వడం లేదు...
మాకు పనులు ఇవ్వడం లేదు. వారం రోజులుగా కూలీ లేక పస్తులుంటున్నాం. అధికారులు, ఎమ్మెల్యే సైతం మాకు సహకరించడం లేదు. ఇప్పటికైనా మాకు పనులు కల్పించి అదుకోవాలి. లేనిచో మాకు వలసలు తప్పవు.
- రామస్వామి హమాలీ కార్మికుడు
Authorization