ఎ.అనిల్
వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. పేరు బాగానే ఉన్నా ఆ పేరుతో గ్రామంలోని అణగారిన వర్గాలపై చేసే పెత్తనం అతి దారుణం. చీటికి మాటికి కుల బహిష్కరణలతో తోటి వ్యక్తిని మానసికంగా, శారీరకంగా హింసించడం చట్ట విరుద్ధం. అయినా ఇక్కడ వీడీసీ పేరుతో ఆ వికృత క్రీడ కొనసాగుతోంది. ఈ వీడీసీ కమిటీలు ఉన్న గ్రామాల్లో నిర్బంధం అధికం. సాటి వ్యక్తిని స్వేచ్ఛగా తన పని తాను చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తోంది. ఎన్నో ఆంక్షలు, మరెన్నో నిర్బంధాల మధ్య బతుకీడ్వాల్సిన పరిస్థితి. తిరగబడితే భౌతికదాడులు, దౌర్జన్యాలు. ఇవన్నీ అధికంగా అణగారిన కులాలపై ఆధిపత్య కులాల దౌర్జన్యంగా గమనించాలి. రెక్కాడితే గానీ డొక్క నిండని ఆ బడుగు జీవులు చాలా వరకు రాజీ పడుతూ జీవితం నెట్టుకొచ్చాయి. కానీ చివరికి తమ పొట్ట కొట్టేందుకు కూడా వీడీసీ సిద్ధపడటంతో ఆ బడుగుల పిడికిళ్లు ఐక్యమై పోరుబాట పట్టాయి. తమ వృత్తికి ఆధారమైన చెరువును నీటితో నింపుకున్నందుకు జరిమానా విధించింది వీడీసీ. తాము కట్టలేమని వీడీసీ దౌర్జన్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే బహిష్కరణ వేటు వేశారు. దీంతో పోరాటం మరింత ఉధృతం చేస్తూ మండలస్థాయి అధికారులను గ్రామానికి రప్పించి విచారణ జరిపే స్థితికి పరిస్థితి దిగజారిపోవడంతో వీడీసీపై అన్ని రకాలుగా వత్తిడి పెరిగింది. గ్రామ ప్రజల్లోనూ వీడీసీపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇక విధిలేని పరిస్థితుల్లో వీడీసీని రద్దు చేయాల్సి వచ్చింది. వీడీసీ పేరుతో కుల దురహంకారం ప్రదర్శిస్తున్న అన్ని గ్రామాలకు ఆ గ్రామం ఇప్పుడు ఆదర్శమైంది. వీడీసీలను రద్దు చేయాలని ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్న గ్రామాలకు గుమ్మిర్యాల్ గ్రామం తొలి అడుగుగా కనిపిస్తోంది.
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో చెరువుల్లో నీళ్లు లేక గంగపుత్రులకు పని లేకుండా పోయింది. దీంతో చెరువునే నమ్ముకున్న వారి కుటుంబాలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. కానీ ఈసారి ఆలస్యంగానైనా చెరువులు నిండేంత వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తూ లిఫ్టు ద్వారా గ్రామంలో ఉన్న మూడు చెరువులు నింపుకున్నారు. దీనిని జీర్ణించుకోలేని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) చెరువుకు రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షలు చెల్లించాలని హుకుం జారీ చేసింది. తామేందుకు కట్టాలంటూ వీడీసీకి ఎదురు తిరిగిన గంగపుత్రులు మత్య్సశాఖ ఎఫ్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో తమపైనే ఫిర్యాదు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడీసీ సభ్యులు.. గంగపుత్రుల ను గ్రామ బహిష్కరణ చేశారు. ఈ పరిణామం పుండు మీద కారం చల్లినట్టు కావడంతో దీనిపై మరింత ఆగ్రహి ంచిన గంగపుత్రులు ఈ ఘటనపై ఇటు పోలీస్స్టేషన్లోనూ, అటు తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో అధికారుల నుంచి వీడీసీపై వత్తిడి పెరిగింది. మరో వైపు గ్రామంలోనూ వీడీసీ పోకడ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రజల నుంచి కూడా వత్తిడి తీవ్ర తరమైంది. దీంతో విధిలేని ప రిస్థితుల్లో వీడీసీని రద్దు చేస్తున్నట్టు ఆ కమిటీ సభ్యులు గ్రామ సభ నిర్వహించి బహిరంగ ప్రకటన చేశారు. నిజామా బాద్ జిల్లాలోని వీడీసీల పెత్తనం దారుణంగా సా గే ఆర్మూర్ డివిజన్లోని ఏర్గట్ల మండలం గుమ్మి ర్యాల్లో చోటుచేసుకుందీ ఘటన. నిజామాబాద్ జిల్లాలోని వీడీసీల పెత్తనానికి గుమ్మిర్యాల్ గ్రామం కల్లెం వేస్తూ ఆ కమిటీని రద్దు చేసే వరకు అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించింది. ఆ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు గుమ్మిర్యాల్ ఆదర్శంగా నిలిచింది.
గుమ్మిర్యాల్ గ్రామంలో మొత్తం 25 గంగ పుత్ర కుటుంబాలున్నాయి. వీడీసీలో 16 మంది వివిధ కులాల పెద్దమనుషులు సభ్యులుగా ఉండ గా, గంగపుత్రుల సంఘం నుంచి వారి కులపెద్ద చిన్నసాయన్న వీడీసీలో సభ్యునిగా ఉన్నారు. కాగా ఇటీవల వర్షాలు కురవడంతో లిఫ్టు ద్వారా గ్రామం లో మూడు చెరువులను గంగ పుత్రులు నింపారు. ఇక చెరువుల్లో చేపలు వేసి వృత్తిని కొనసాగించవచ్చని ఆనందంలో ఉన్నారు. కానీ వారి ఆనందానికి వీడీసీ అడ్డు తగిలింది. గత సంవత్సరం వర్షాలు లేక, మత్స్యకారులకు పని లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గంగపుత్రులపై వీడీసీ జరిమానా కొరడా ఝులిపించింది. దీంతో ఒక్కో చెరువుకు రూ.50 వేల చొప్పున మూడు చెరువులకు రూ.1.50 లక్షలు చెల్లించాలని హుకుం జారీ చేసింది. ఇది తమ వృత్తి పని కాబట్టి అలా చేసుకున్నామని, ఇంతమాత్రానికి తామేందుకు డబ్బులు కట్టాలని గంగ పుత్రులు వీడీసీ నిర్ణయాన్ని తిరస్కరించారు. అయినా వీడీసీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో విధిలేని పరిస్థితుల్లో వీడీసీపై మత్స్యశాఖ ఎఫ్డీవోకు ఫిర్యాదు చేశారు. కాగా కమిటీలో 16 మంది సభ్యులుగా ఉండగా, గంగపుత్ర సంఘం నుంచి పెద్దమనిషిగా ఉన్న చిన్నసాయన్న పేరు మినహాయించి మిగతా 15 మంది పేర్లు రాసి ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష కట్టిన వీడీసీ సభ్యులు గంగపుత్ర సంఘం పెద్దమ నిషికి రూ.20 వేలు జరిమానా విధించారు. గంగపుత్రులందరినీ గ్రామ బహిష్కరణ చేస్తున్నట్టు తీర్మానం చేశారు. అప్పటి నుంచి గంగపుత్ర కులస్తుల పశువులను మందలోకి రానివ్వడం లేదు. మహిళలు బీడీలు చుట్టకుండా ఆంక్షలు విధించారు. ఆఖరికి కిరాణా సామాను, హోటళ్లలో టీ కూడా పోయడం లేదని బాధిత గంగపుత్రులు వాపోయారు. దీంతో ఈ నెల16వ తేదీన ఎస్ఐకి, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. తమను కూలీకి పిలవడం లేదని, ఇతరులను తమ పొలంలో పనికి రానివ్వడం లేదని కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణలో వీడీసీ బుకాయింపు
గంగపుత్రుల ఫిర్యాదుతో 17వ తేదీ శనివారం ఎస్ఐ సంపత్కుమార్ యాదవ్, తహసీల్దార్ వెంకట్రావ్ వీడీసీతో, గంగపుత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. బహిష్కరణతో తాము ఎలాంటి ఇబ్బందులు పడ్డామో బాధితులు అధికారుల ముందు ఈ సమావేశంలో ఎకరువు పెట్టారు. కాగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ తాము ఎలాంటి బహిష్కరణ చేయలేదని బుకాయించారు. గ్రామంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని చెప్పుకున్నారు. దీంతో పోలీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.
సెల్ : 7095174421
వీడీసీ రద్దు ...బహిష్కరణ ఎత్తివేత
గత పది రోజులుగా గంగపుత్రుల బహిష్కరణ వివాదం కొనసాగడంతో ఇటీవల గ్రామంలో ఉన్న 16 కులసంఘాలు కలిసి గ్రామ సభను నిర్వహించాయి. ఊరి ప్రజలందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానంగా గ్రామ కమిటీ (వీడీసీ)ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి ఎలాంటి గ్రామ అభివృద్ధి కమిటీ లేదనీ, ఎవరి మీద ఆంక్షలు లేవనీ, ఎవరి పనులు వారు సక్రమంగా, స్వేచ్ఛగా నిర్వహించుకోచ్చని తెలిపారు. దీంతో గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. ఇదే స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా వీడీసీల రద్దుకు అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు.