కులాంతర, మతాంతర వివాహాలను తాము ప్రోత్సహిస్తామని, అ లాంటి వివాహాల వల్ల దేశంలో అసమానతలు తొలగిపోతాయని ఓ కేసు తీర్పులో భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యనించింది. భారతదేశంలో వేళ్లూనుకున్న కుల, మత వ్యవస్థల ప్రమాద తీవ్రత ఈ కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గ పరి ణామం. ఇదే కాలంలో సుప్రీంకోర్టు దేశంలోని సామాజిక సమస్యలు, ప్రజ ల్లో అశాంతిని రెచ్చగొట్టేలా ఉన్న అంశాలపై తన స్పష్టతను ప్రకటించింది. దేశంలోని మనుషుల మధ్య ఐక్యతను దెబ్బతీసే వ్యవస్థలకు గొడ్డలిపెట్టు ఈ మాటలు. కులం, మతం పేరుతో మూక దాడులు, హత్యలు, అత్యాచారాలు ఈ దేశంలో కొత్త కాదు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మారణ ఉదంతాలు పెరుగుతున్నాయన్నది కాదనలేని విషయం. ఇదే కాలం లో సుప్రీంకోర్టు కూడా వాటికి ధీటుగా దేశ ప్రజల పక్షాన తన తీర్పులను ప్రకటిస్తూ వస్తోంది. మూక దాడులను ఎదుర్కొనేందుకు బాధితుడు తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఎదురుదాడికి దిగొచ్చని సూచించింది. అటు దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకేసారి అధికారం చేపట్టి వరుసగా రెండవసారి పరిపాలన కొనసాగిస్తున్నాయి. ఇదే కాలాన్ని పరిశీలనకు తీసుకుంటే మన రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిని హత్య చేసిన ఘటనలు వరుసగా జరిగాయి. ప్రణరు - అమృత, అంబోజు నరేష్ - స్వప్న, మంథని మధుకర్ ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మా రాయి. ప్రేమకు వ్యతిరేకంగా కులాధిపత్య ధోరణికి నిదర్శనంగా ఈ ఘటన ల్లో ప్రేమికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించిన వారిని కోల్పోయిన వారు ఆ జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. హత్యలు చేసినవారికి దక్కిన ప్రశాంతత ఊచల వెనకాలే.. ఇంతా చేసి సాధించేదేమిటో ఈ కుల దురహంకార హత్యలు చేసిన వారికి సమాధానం లభించిందా? అన్నది పెద్ద ప్రశ్న. సాటి వారిని మనిషిగా చూడలేని కుల వ్యవస్థ రాష్ట్రంలో తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అగ్రకుల వ్యక్తుల ముందు చెప్పులు వేసుకొని నడిచినందుకో.. పెండ్లిల్లో గుర్రంపైన ఊరేగినందుకో, దళితులుగా పుట్టి పెండ్లి బరాత్లు ఘణంగా నిర్వహించుకున్నందుకో ప్రాణాలు అర్పించుకోవాల్సి వచ్చింది. కులం ఆధారంగా శిక్షల తీవ్రత ఉంటుందంటే మనం ఏ కాలంలో ఉన్నామో.. ఎటు వెళ్తున్నామో ఆలోచించాలి.
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఏర్పడిందన్న ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతం పేరుతో దాడులు, హత్యలు జరుగుతున్నాయి. దేశ పటిష్టత కోసం దేశ ప్రజల మధ్య ఐక్యత పెంపొందించాల్సింది పోయి మతం, కులం పేరుతో విభజన రేఖలు పెంచుతూ వస్తున్నారు. ఇది దేశ రక్షణకు ప్రమాదకరం. లవ్ జీహాద్తో మతం మారుస్తూ హిందూ మహిళలను ముస్లిముల్లో చేర్పించుకుంటున్నారంటూ ప్రేమ విహహాలకు వ్యతిరేకంగా పెద్ద ఆందోళనలే కొనసాగాయి. అయితే హిందూ అమ్మాయి కోసం ముస్లిం అబ్బాయి మతం మార్చుకున్న ఘటనలో సుప్రీంకోర్టు మతాంతర వివాహాలను ఉటంకించడం గమనార్హం. ప్రేమకు కులం, మతం పట్టింపులు లేవు. వ్యక్తిగత విషయాల్లో వాటి ప్రమేయం, నిర్ణయాక శక్తి చేయగలిగే ఘోరాల తీవ్రతను సుప్రీంకోర్టు సీరియస్గానే తీసుకుంది. కుల, మత విభజన రేఖలు ప్రజల మధ్య విద్వేషాలకు, భయాందోళనలకు దారితీస్తాయి తప్ప ఐక్యతకు కాదు.
భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మాణమనేది నిచ్చెనమెట్ల వంటిది. కొన్ని వేల సంఖ్యలో కులాలు ఉన్న ఇక్కడ ఏ రెండు కులాలు కూడా సమాన స్థాయి కాదంటే.. ఒక కులం వ్యక్తి మరో వ్యక్తితో తాను సమానమనే భావనే కలగదంటే.. ఇది ఎంత పటిష్టంగా నిర్మితమైందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పోలికలు ఉన్నా అన్ని కులాలకు వారివారి ప్రత్యేక ఆచార, వ్యవహారాలున్నాయి. అనేక తరాలుగా వస్తున్న ఈ కుల వ్యవస్థను మానసికంగా అంగీకరిస్తూ తాము ఇతరులకంటే అధికులమనే భావిస్తూ చేసే అకృత్యాల తీవ్రత అంగీకరించలేనిది.
భారతదేశ చరిత్రలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలసలు, దాడుల నేపథ్యంలో ఇతర మతాలు వచ్చాయన్నది ఒక వాదన. ఇందులో వాస్తవం కూడా ఉంది. అయితే మన దేశంలో చట్టాలు, రాజ్యాంగం చెప్పేదేమిటంటే.. మతం, కులం ఆధారంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక అధికారాలూ, శిక్షలు లేవు. అందరూ సమానమే. మీరు ఏ మతానికి, కులానికి చెందినవారైనా భారతీ యులుగా గుర్తించబడతారు. ఆ ప్రకారమే చట్టాలు, కోర్టులు పరిగణిస్తాయి. అయితే భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చుతామనే వ్యాఖ్యల వెనక ఉద్దేశాన్ని కూడా గమనించాలి. ఇది ఒకప్పుడు పూర్తిగా హిందూ దేశమని, ఆ మతం మన దేశంలో ఆవిర్భవించిందని, కాబట్టి ఇప్పుడు మళ్లీ హిందూ దేశంగా మారుస్తామంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే మనదేశంలో బౌద్ధం కూడా ఉద్భవించింది. మైనార్టీలుగా ఉన్న కారణంగా మతం పేరుతో దాడులు చేయడం, వారి ఆచార వ్యవహారాలను నెపంగా చూపుతూ ఆయా మతస్తులను హత్యలు చేస్తూ వస్తున్నారు.
సామాజిక వ్యవస్థను పటిష్ట పరచాల్సిన స్థానంలో మతం, కులం తమ ఆధిక్యతను ప్రదర్శించి మహిళలపై దాడులు, మనుషులను హత్య చేసే వరకూ వెళ్తున్నాయి. బీజేపీకి చెందిన కొందరు మహిళా నేతలు స్వయంగా ఇతర మతాలకు చెందిన మహిళలను రేప్ చేయాలని, అందుకు అవసరమైతే హిందూ యువకులు బృందాలుగా వెళ్లాలని కూడా సలహాలు ఇస్తున్నారు. ఈ దేశంలో పుట్టినందుకు, వారు హిందువులు కానందుకు ఆ స్త్రీలు తమ మాన, ప్రాణాలను అర్పించాలని శాసించడం, అదీ కూడా మహిళలే చేస్తుండటం మతోన్మాద తీవ్రతకు అద్ధం పడుతోంది. కులం, మతం ఈ దేశంలో సృష్టిస్తున్న మారణహోమాన్ని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. వాటి పేరుతో జ రుగుతున్న రాజకీయాలను, దేశంలోని నష్టాన్ని అది ఇప్పుడిప్పుడే అంచనా వేస్తున్నట్టు ఉంది.
ఈ దేశంలో కులం, మతం ఎక్కడ ఉంది? అంటరానితనం ఎక్కడ ఉంది? అని ప్రశ్నించేవారికి అనేక మత దాడులు, కుల హత్యలు సమాధానంగా కనిపిస్తాయి. దళితులు హిందువుల్లో భాగమేనని ఎంత గట్టిగా చెప్పినా ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వారు ఆలయాల్లో ప్రవేశం కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఖరీదైన బట్టలు వేసుకున్నందుకు, ఉన్నత చదువులు చదివినందుకు, గొప్ప ఉద్యోగాలు దక్కించుకున్నందుకు హత్యలు చేయబడుతున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు, వారి కుల కట్టుబాట్లకు బలవుతున్నా ప్రపంచం దృష్టికి రాని ఘటనలు ఎన్నో.. ఆధిపత్యకుల బావుల్లో నీళ్లు తాగినందుకు, వారి భూముల్లో నడిచినందుకు మాన, ప్రాణాలు కోల్పోతుండటం నేటికీ చూస్తూనే ఉన్నాం.
దేశంలో జరుగుతున్న దురాఘాతాలకు కులం, మతం మొదటి కారణాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్గత అశాంతికి, ప్రజల మధ్య అనైక్యతలను పెంచడంలో వీటికి సాటి రాగల అంశాలు లేవు. ప్రజల్లో ఐక్యతను దెబ్బతీసి తమ పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ పార్టీలకు, కుటిల నేతలకు వీటిని మించిన ఆయుధాలు లేవు.. మక్కా మసీదు పేలు ళ్లు, సంఝౌతా ఎక్స్ప్రెస్ ఘటనలు, గోద్రా అల్లర్లు.. ఇలా అనేకం పార్టీల మతతత్వ రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తూ వస్తున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు అమాయకులను బలి పెడుతున్నారు.
కులం, మతం అనేవి పాటించినపుడే మనుగడ సాగిస్తాయి తప్ప అవసరం లేదనకున్నపుడు కాదు. వాటిని సాకుగా చూపుతూ ప్రజల మధ్య విబేధాలు సృష్టించడాన్ని సుప్రీంకోర్టు తేలికగా తీసుకోలేదు. కుల, మత అస్తిత్వాల మీద రాజకీయ పునాదులు వేసుకున్న నేతలు దేశాన్ని ఏలుతున్న కాలంలో సుప్రీం మాటలు దేశంలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. విభజన రేఖలు లేని నాడు అందరూ సమానమైనపుడు విద్వేషాలు ఉండవు. ప్రజల మధ్య శాంతి నెలకొంటుంది. దీనికి ఉత్తమమైన పరిష్కారంగా సుప్రీంకోర్టు కులాంతర, మతాంతర విహహాలను సూచించింది. మన దేశంలో కుల, మత ఆధారంగా వ్యత్యాసాలు చూపబోమని ప్రకటించినప్పటికీ అవి లేకుండా బతకలేని పరిస్థితి. దేశంలో దాదాపు కోట్ల సంఖ్యలో మత, కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. జీవిస్తున్నారు. అయితే వారు ఎక్కడో ఒక చోట తమ అస్తిత్వాన్ని ప్రకటించక తప్పదు. అంతరాలు లేని సమాజం కోసం సుప్రీం మాటలు శిరోధార్యమవుతున్నాయి. కుల, మతం లేకుండా భారతీయులుగానే గుర్తించబడాలనుకునేవారికి, జీవించాలనుకునే వారికి సుప్రీం అండగా నిలవడం ఆనందకరం. విబేధాలు, విద్వేషాలు లేని సమసమాజాన్ని మన దేశంలో కలలుగంటున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు గొప్ప ఆలంబన. ఈ వెలుగులో అంతరాల వ్యవస్థలను కూలదోసి అందరూ ఆనందరగా, సమానంగా బతికే రోజులు వీలైనంత తొందరగా రావాలని ఆశిద్దాం.
- వంగాల రమేష్
సెల్ : 9490099115
Authorization