రంగనాయకమ్మ
- 11 -
ఈ నాటి సమాజంలో (అంటే, ఈ భారత పెట్టుబడిదారీ సమాజంలో) దళితులపై హత్యలు, వెనకటి కాలంలో లాగా, రహస్యంగా జరగడంలేదు. బట్టబయలుగా ఉత్సవాలుగా జరుగుతున్నాయి- అన్నారు రచయిత. దీనికి అనేక హత్యల దురంతాల్ని వివరించారు.
హర్యానాలోని బజ్జర్లో అగ్రవర్ణాల మూక, పోలీసు స్టేషన్ సమీపంలోనే, పట్టపగలు ఐదుగురు దళితుల్ని కొట్టికొట్టి చంపేశారు. పోలీసు అధికారులు కూడా ఆ ఘోరాన్ని కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు! ఈ మధ్య ఇటువంటి హత్యలు చేసే వాళ్లకి, 'మనకేం జరగదు, మనం చేసినట్టు రుజువులు దొరకవు' అనే ధీమా పెరిగిపోయింది. అగ్ర వర్ణాలవారు ఈ హత్యల్ని సమర్ధించారు కూడా!
2003లో, మహారాష్ట్ర మరట్వాడా ప్రాంతంలో ని భూట్ గావ్లో, ఆగ్రవర్ణాల మూక, ఒక దళిత యు వకుణ్ణి సజీవ దహనం చేసింది. అదే సమయంలో, బీట్ జిల్లాలోని సొన్న ఖోటా గ్రామంలో, అగ్రవర్ణాల మూక, ఒక దళిత యువకుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశా రు. -ఇటువంటివన్నీ, ఊహకందని క్రూరత్వాలే. ఇవి, ఎందుకిలా జరుగుతున్నాయని అందరూ ఆలోచించి, పరిష్కారాన్ని తెలుసుకోవాలిసిందే.
ఈ దురంతాల్ని చెప్పడంలో, ఈ రచయిత అభిప్రాయం బహుశా ఏమిటంటే, పెట్టుబడిదారీ నాగరికతలో, దళితులపై దురంతాలు మరింతగా పెరిగాయి గానీ, మార్క్సు చెప్పినట్టు ఎక్కడ తగ్గాయి?-అని చెప్పడానికే కావచ్చు.
'కుల విధానం పోవడం' గురించి, రకరకాల భ్ర మలుగా చెప్పిన ఈ రచయిత, ఆ సమస్యకు తన అభిప్రాయంగా ఏం చెప్పారు? 'కుల నిర్మూలన కోసం' ఇలా జరగాలి-అని ఈ రచయిత ఇలా చెప్పా రు: 'కులపరమైన అణిచివేతనూ, అరాచకాలనూ, రూపుమాపాలంటే, మనం, ఆర్ధిక అంశాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది' -ఈ విధంగా చెప్పారు రచయిత.
'ఆర్ధిక అంశాలకు అతీతంగా'! ఆర్ధిక అంశాలనే ఎత్తవద్దంటే, శ్రమలనే ఎత్తకూడదు. అంటే, శ్రామిక వర్గానికి జరిగే శ్రమ దోపిడీనీ, దాని నిరుపేద తనాన్నీ, ఎత్తకూడదు! వాటితో సంబంధం లేకుండా 'అతీతంగా' ఆలోచించాలి -అని అర్ధం ఇది. కుల విధానాన్ని తీసివెయ్యడానికి ఈ రచయిత చివరికి ఏం మార్గం చూపిస్తారో తెలుసుకోవాలనే, ఆయన పుస్తకాన్ని చాలా ఆసక్తిగా మళ్లీ మళ్లీ చదివాను.
'డబ్బు సంపాదన ఎవరికి ఎంత పెరిగినా, ముస్లింలపై కూడా దురాగతాలు తగ్గడం లేదు' అన్నారు. కాబట్టి, డబ్బుకీ, అత్యాచారాలకూ, సంబం ధం లేదు -అన్నారు. 2002లో గుజరాత్ హత్యాకా ండలో, కాంగ్రెసు మాజీ ఎంపీ జాఫ్రీపై జరిగిన ఘో రాన్ని చూశాము-అన్నారు. మిళింద్ మాండే, రాజూ లోఖాడే -వంటి ప్రముఖులు ఏ విధంగా భయోత్పా తాలకు గురి అయ్యారో, రచయిత వివరించారు.
డబ్బు బాగా ఉన్న వాళ్లు కూడా హత్యలకు గురి అయ్యారంటే, 'డబ్బు'కి అతీతంగానే ఆలోచించాలి-అనుకుందాం. అప్పుడు దోపిడీ రాజకీయాలే కారణా లుగా కనపడడం లేదా? దోపిడీ రాజకీయాలు, దేని కోసం? 'పదవుల' కోసం. పదవులు ఎందుకు? ఆస్తు లపై అధికారాల కోసం కాదా? కాంగ్రెస్ ఎంపీని ఎవరు హత్య చేశారు? ఇంకో రాజకీయ పార్టీ వాళ్లు! ముస్లింలను ఎవరు హత్యలు చేస్తున్నారు? హిందూ మతోన్మాదులు కారా? తోటి మానవులపై జరిగే దురతాలకు కారణాలే కావాలంటే, కులాలే-మతాలే, రాజకీయాలే కారణాలుగా వున్న అంశాలు, ఆ రకంగా ఎందుకు, ఏ లాభాల కోసం, అలా ప్రవర్తిస్తున్నారు?
మత కలహాల గురించి చెప్పండి! రాజకీయాల్లో శతృత్వాల గురించి చెప్పండి! ఏ దురంతం చెయ్యడా నికైనా, కత్తుల్నీ, తుపాకుల్నీ, బాంబుల్నీ, క్షణాలలో కొనగలిగే అవకాశాల గురించి చెప్పండి! చివరికి ఎక్కడికి వెళ్తాం? ఆర్ధిక విషయాల దగ్గిరికే చేరి, 'శ్రమ దోపిడీ' దగ్గిరికే చేరతాం. అసమానత్వాలతో కుళ్లిపో యిన మానవ జీవితాలకు కావలిసింది, సమానత్వ మార్గమే! దళితులకు ఎక్కువ భూమీ, ఎక్కువ డబ్బూ వుంటే, వారు కులం ఊబి నుంచి బైట పడగలరా? -అనే సందేహం రావచ్చు. దుసాల గ్రామంలో, పోలీసు పటేల్ అయిన సిద్ధార్ధకి, 50 ఎకరాల భూమీ, ధనమూ వున్నా, అతను హిందూ మూకల దాడికి గురి కాలేదా? -ఇది న్యాయమైన ప్రశ్నే.
పంజాబ్లో, గోవాలో, ఆర్ధికంగా కాస్త ఎదిగిన 70 దళిత ఇళ్లను, దాదాపు 2 వేల మందితో కూడిన జాట్ల గుంపు తగలబెట్టింది! ఆ గ్రామంలోనే, ఆర్ధికంగా కొంత ఎదిగిన వాల్మీకి- దళితులపై, అగ్రవర్ణాల ద్వారా దాడులు జరిగాయి.-రచయితే. 2003లో, పంజాబ్లోని తరాన్లో, అలాగే జరిగిం ది. అక్కడ 'ధర్మా దళితులు', మతపరమైన వ్యవస్థలో తమ హక్కు తమకు కావాలని అడిగినందుకు, వారికీ జాట్ కులస్తులకూ గొడవలు జరిగాయి.
రచయిత, దళితులపై జరిగిన దాడుల సంఘటనల్ని చూపించి, ప్రతీ కుల ఘర్షణకీ మూలం భూమి సమస్యే అని భావించడాన్ని తప్పు-అన్నారు. దీన్ని మార్క్సిస్టు ఆర్ధిక దృక్పధం లోంచి ఏర్పడిన భ్రమ- అన్నారు. (మార్క్సిజం చెప్పేది 'శ్రమ దోపిడీ' వల్ల ఏర్పడే 'శత్రు వర్గాల' గురించే.)
దళితులపై జరిగిన దాడులకు, భూమి అనేది, ప్రధాన కారణాల్లో ఒకటి మాత్రమే-అన్నారు. భూమి హక్కూ, సాగు నీటి హక్కూ వంటి హక్కుల్ని కోరిన దళితులపై దాడులు జరగడం వాస్తవమే-అని కూడా రచయిత అన్నారు. అటువంటి హక్కులు కోరే దళితులపైనే దాడులు జరుగుతాయి గానీ, అటువంటి హక్కులే కోరే 'దళితులు కాని' వారిపై మాత్రం దాడులు జరగవు-అంటారు.
రచయిత, గట్టిగా చెప్పే అభిప్రాయం, కులాల తేడాల వల్లనే, దళిత కులాలపై ఇలా జరుగుతుంది - అని. కింది కులాల్ని, పైకులాలు పీడిస్తాయి-అనే వాస్తవాన్ని ఎవరూ కాదనరు. కాదనక్కరలేదు. అయితే కులాల మధ్య ఎక్కువ తక్కువల్ని తీసివెయ్యడం ఎలాగ? ఈ విషయం కోసం మాత్రం రచయిత ఏ పరిష్కారమూ చూపించలేదు, ఈ పుస్తకంలో. ఆర్ధిక విషయాలకు అతీతంగా చూడాలి - అని చెప్పారనుకోండి. 'అతీతంగా' అంటే, 'కుల విధానమే' అని రచయిత అవగాహన. అయితే, 'కుల విధానం' ఎందుకు వచ్చిందో తెలిస్తే, ఎలా పోతుందో, దాన్ని ఎలా తీసెయ్యగలమో తెలుస్తుంది.
కులాలు, చిన్నా పెద్దా తేడాలతో ఉన్నట్టు భావించేది, పై కులాలే. 'మేము పై కులస్తులం' అని పై కులాల వాళ్లే గర్వంగా అంటారు. 'మేము కింది కులస్తులం' అని ఆ కింది కులాలవారు గర్వంగా అన రు. కింది కులాలవారి శ్రమలు, పైకులాలకు కావాలి. కింది కులాలవారు, ఏ మాత్రం కళ్లు తెరిచినా, అది పైకులాలకు పనికిరాదు. వారికి ద్వేషం!
రచయిత: ''1968లో, తమిళ నాడులోని కీలవే న్మణిలో, వ్యవసాయ వేతనాల వివాదం సైతం, దారు ణ అత్యాచారాలకు దారితీసింది.'' ఇది జరగడం, భూ మి కోసం కాదనే అనుకుందాం. మరి, దేని కోసం? జీతాల పెంపు కోసం. ఈ రచయిత దీన్ని, ''కుల వ్యవస్థ కుత్సితంగా'' భావించారు.
ఆ అత్యాచారాలు, అడుగు కులాల మీద జరిగాయి-అనేది నిజమే. ఆ కులాల వారు, ఆ వేతనాల మాట ఎత్తకుండా, యజమానులు నిర్ణయించిన జీతాలతోనే, వినయ విధేయతలతో పనులు చేస్తే, ఆ ఘర్షణలు జరగవు. కింది కులాలవారు, వేతనాల మాట ఎత్తకుండా అణిగి మణిగి ఉండనక్కర లేదు. అసలు 'వేతనం' అంటే ఏమిటి? దాన్ని పెంచమని అవతలి వాళ్లని ఎందుకు అడగాల్సి వస్తోంది? ఇది, ప్రధానంగా 'శ్రమ దోపిడీ' నించి పుట్టిన సమస్య. 'కుల విధానం' అనేది శ్రమలు చెయ్యడంలో, యజమానీ - బానిసల తేడాల నించి ప్రారంభమై, అది 'కులాల విధానం'గా రూపొందిం దని గ్రహించాలి. కానీ, కింది కులాల మీద, పై కులాల ద్వారా జరిగిన ఏ ఘర్షణ అయినా, 'కులాల ఘర్షణ'గానే కనపడుతుంది. కానీ, అసలు మూలం, శ్రమలు చేసే వాళ్లని దోచే విధానం తగ్గ రాదనీ, దాన్ని నిలబెట్టి వుంచాలనీ, వారు ఎదురు తిరగకుండా, కనీసం ఎదగకుండా చెయ్యాలనీ, చూడడమే. పై కులాలకు, 'శ్రమ దోపిడీ' సంగతి తెలిసే, ఘర్షణలకు దిగుతారని కాదు.
'బానిసత్వం' ఏర్పడిన కాలంలో, 'శ్రమ దోపిడీ' కోసమే అది ప్రారంభమైందని ఎవరికి తెలుసు? బానిస యజమానులకూ ఆ సంగతి తెలీదు. అయి నా, బానిసల వల్ల, యజమానికి ఎటువంటి ప్రయో జనం ఉంటుందో, యజమానికి తెలుసు. అది, 'శ్రమ దోపిడీ' అని తెలియ కుండానే. 'కుల విధానం' ఎందుకు పుట్టిందో, పై కులాల వాళ్లకి కూడా తెలీదు.
భూమి మీద చెట్లూ, క్రిమికీటకాలూ, జంతువులూ, పుట్టడానికి, ప్రకృతి సహజ కారణాలు ఉంటాయి. కానీ, 'కుల విధానం' ప్రారంభం కావడానికి ప్రకృతి కారణాలు ఉండవు. ఆ కారణాల్ని, మానవ సమాజంలో సాగే 'శ్రమ సంబంధాల్లో' వెతకవలిసిందే. ఆ విధానాల్ని పరిష్కరించే మార్గా లు, సమాజంలోనే ఉంటాయి. ఆ పరిష్కారాల్ని తెలుసుకోకపోతే, ఎన్ని వేల సంవత్సరాల వరకైనా, ఆ విధానాలూ, ఆ ఘర్షణలూ, అలాగే ఉంటాయి.
కీలవేన్మణి ఘటనలో, ఆ దుర్మార్గాలకు 'శ్రమ దోపిడీ' యే మూల కారణం. అయితే, కింది కులాల మీద ద్వేషం పాత్ర ఏమీ లేదని భావించకూడదు. మూల కారణానికి ఆ ద్వేషం కలిస్తేనే, అంత కిరాతకత్వం సాధ్యం. 'మత హత్యల మీద చూపే నిరసనల్ని కుల హత్యల మీద ఎందుకు చూపడం లేదు?' - అని, ఈ రచయిత ప్రశ్నించారు. ముస్లింల మీద హత్యలు జరిగినప్పుడు, ఇతర మతస్తులు ఆ హత్యల మీద కూడా చాలా నిరసనలు చూపిస్తారు. కానీ, దళిత కులాలపై హత్యలు జరిగినప్పుడు, వాటి మీద ఇతర కులస్తులు తీవ్రమైన నిరసనలు ఎందుకు చూపరు?- అని రచయిత ప్రశ్న.
''దళితేతర వర్గాల్లో, ఖైర్లాంజీపై సెమినార్లు, చర్చలు, ప్రదర్శనలు, మీడియా ప్రచారాలు, ఆన్ లైన్ పిటిషన్లు మొదలైనవి ఏవీ, చోటు చేసుకోలేదు. ఎందుకు?''అని ప్రశ్నించారు రచయిత.
నిజం చెప్పాలంటే, పెద్ద ఎత్తున, మూకుమ్మడిగా మైనారిటీ మతస్తుల మీద హత్యాకాండ జరిగినప్పుడు మాత్రమే, ఇతర మతస్తులు పట్టించుకున్నారు. ఉదాహరణకి, 1984లో ఢిల్లీలో సిక్కుల ఊచకోతా, 2002లో గుజరాత్లో ముస్లింల ఊచకోతా జరిగినప్పుడు పట్టించుకున్నారు. వాటి కోసం ఇప్పటికీ కోర్టులలో కేసులు నడిపిస్తున్నారు. కానీ, మత కలహాలే చెదురు మొదురుగా, తక్కువ సంఖ్యలో జరిగినప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు. ఖైర్లాంజీ విషయానికి వస్తే, అక్కడ జరిగిన దురంతం గురించి వివరంగా ఇతర ప్రాంతాల వారికి తెలియకపోవడం ఒక కారణం కావొచ్చు. కేవలం ఒక్క కుటుంబం మీద జరిగిన హత్యాకాండగా మాత్రమే భావించిన బండ తనం కావచ్చు.
కారంచేడులోనూ, చుండూరులోనూ, పెద్ద యెత్తున అగ్ర కులాల వాళ్లు హత్యాకాండకి పాల్పడినప్పుడు, ఇతర కులాల వాళ్లు చెప్పుకోదగిన విధంగానే నిరసన వ్యక్తం చేశారు. 1985లో కారంచేడు ఘటనకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వాళ్లు నిర్వహించిన ఊరేగింపుకీ, బహిరంగ సభకీ, దళిత కులాలకు చెందని ఇతర కులాల వాళ్లు కూడా ఎందరో హాజరయ్యారు. కానీ ఆ బహిరంగ సభలో ప్రధాన నిర్వాహకుడైన కత్తి పద్మారావు గారు, సంఘీభావంగా వచ్చిన ఆ 'ఇతర కులాలకు చెందిన' వారిని, ఉదా: వరవరరావు గారినీ, కొత్తపల్లి రవిబాబు గారినీ, మాట్లాడమని అడగనేలేదు. ఆ రోజున నేను కూడా, చీరాలలోనే వున్న విజయనగర్ అనే బాధితుల శిబిరంలో, కొందరు బాధితులతో మాట్లాడుతూ ఉన్నాను. ఆ బహిరంగ సభలో 'అగ్రకులాల వారితో మాట్లాడించ దలుచుకోలేదని' నిర్వాహకులు భావించినట్టు విన్నాను. కానీ, 'ఎన్కౌంటర్' అనే పత్రిక ఎడిటర్ పింగళి దశరథ రామ్ అనే ఆయన్ను, ఆయన అగ్ర కులస్తుడైనప్పటికీ మాట్లాడించినట్టూ, దానికి కారణం ఆయన తన పత్రికలో దళిత మహా సభ నాయకుడికి బాగా ప్రచారం కల్పించడమని నేను విన్నాను. ఆ రాత్రే నేను హైదరాబాదు తిరిగి వెళ్లిపోయాను. తర్వాత కత్తి పద్మారావు గారికి నేనొక రిజిస్టర్డ్ ఉత్తరం రాశాను. దానిలో సారాంశం: 'ఇలా జరిగిందని నేను విన్నాను. నాకు సభల్లో ఉపన్యసించడం చేతకాదు. నన్ను మాట్లాడమన్నా మాట్లాడగలిగే దాన్ని కాదు. కానీ, వరవరరావూ, రవిబాబూ గార్లతో మాట్లాడిస్తే, ఇతర కులాల మేధావులు కూడా మనకి సంఘీభావం తెలుపుతున్నారని, దళిత బాధితులకు మరింత ధైర్యంగా ఉంటుంది గదా? అనే రకంగా రాశాను. దానికి పద్మారావు గారు ఏమీ వ్యతిరేకించకుండా చాలా మంచిగానే జవాబు ఇచ్చారు. 'ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాము' అనే రకంగా రాశారు.
(ఇంకా ఉంది)
Authorization