రంగనాయకమ్మ
- 12 -
'రిజర్వేషన్ల భ్రమ': దళితులు, ప్రభుత్వ యంత్రాంగంలోకి చేరితే, వారు, మొత్తం దళిత జనాభాకి సహకరిస్తారు-అనే భ్రమ ఒకటి బైట పడినట్టు రచయిత చెపుతారు.
ఖైర్లాంజీ హత్యాకాండ జరిగిన రోజుల్లో, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నది అత్యధికంగా దళితులే. రచయిత ఆ ఉద్యోగుల పేర్లు కూడా ఇచ్చారు. అవి 10,12 పేర్లు! ఈ దళిత ఉద్యోగులు, ఖైర్లాంజీ దురాగతం మీద వాళ్లు చూపగల శ్రద్ధ చూపలేదు. ('దళితులు' అన్నప్పుడు, వారిలో కూడా వేరువేరు కులాలు ఉంటాయి.) ఆ దళిత ఉద్యోగులం దరూ, భోట్ మాంగే కులానికి చెందినవారే!
ఈ సందర్భంలో, రచయిత ఇలా అంటారు: ''ఇక్కడ దళితులకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ శక్తులు పక్షపాతంతో పని చేశాయని ఎవ్వరూ ఆరోపించడానికి లేదు. ఇక్కడ, మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా దళితమయంగా ఉంది. నిజానికి వారంతా, తమ పనిని తాము శ్రద్ధగా, నిజాయితీగా, నిర్వహించితే సరిపోయేది. కానీ, వాళ్లు కనీసం అలా చేయలేదు.'' (పేజీ: 154)
రచయిత ఇంకా ఇలా అంటారు: దీనికి కారణం ఏమనుకోవాలి? ఆ దళిత ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ వర్గంలో కలిసిపోయారు! వారి పదవులూ, జీతాలూ, లంచాలూ, ఆస్తులూ, అవే వారికి ముఖ్యమయ్యాయి. తోటి దళిత మానవుల బాధ వాళ్లకి అక్కరలేదు. ఇలాంటి వాళ్లని చూసే, అంబేద్కరు, ఒకప్పుడు, ''చదువుకున్నోళ్లే మాకు అన్యాయం చేశారు'' (హమే, పఢే లిఖే లోగోంనే, ధోకా దియా) అన్నారు.
ముంబయి నించి వెలువడే దళిత పత్రిక 'మహా నాయక్' (2006 అక్టోబరు 11న), అంబేద్కర్ అన్నదాన్ని శీర్షికగా పెట్టి, ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఈ వ్యాసం వచ్చింది, ఖైర్లాంజీ హత్యలు జరిగిన, 12 రోజులకు.
ఈ రచయిత ఆనంద్, ఆ మోసకారి దళిత ఉద్యోగుల పేర్లన్నీ ఇచ్చారు. ఈ దళితుల్లో, పోలీసు ఉన్నతాధికారులూ, సామాన్య పోలీసులూ, శవ పరీక్షలు మోసంగా చేసిన డాక్టర్లూ, జిల్లా సివిల్ సర్జనూ, నోడల్ అధికారీ.. మొదలైన వారందరూ ఉన్నారు. వారందరూ కూడా, 'ఈ గొడవ మనకెందుకు?' అనుకున్నారే గానీ, తోటి మానవుల బాధల్ని చూసినట్టు ఒక్కరూ కూడా ఖైర్లాంజీ దురంతాల్ని చూడలేదు.
ఈ రచయిత, దళిత ప్రభుత్వోద్యోగుల్ని ఈ రకం గా తప్పు పట్టారు: ఈ వ్యవస్థ, ఒక వ్యక్తిని పై స్తాయి కి తెచ్చిందంటే, అలా ఎందుకు చేస్తుందంటే, ఆ వ్య క్తి, ఈ వ్యవస్థ విలువల్ని నిలబెడతాడని - అట! అం దుకే, ఆ వ్యక్తికి, ఆ పై స్తాయి, బహుమతిగా అందు తుందట! - రచయిత ఇలా వివరించడం బాగుంది.
అయితే, 'ఈ వ్యవస్థ' అంటే, ఏ వ్యవస్థ? ''ఇది, పెట్టుబడిదారీ వ్యవస్థ. శ్రమ దోపిడీని చాలా పెద్ద ఎత్తున సాగించే వ్యవస్థ'' అని ఈ వ్యవస్థ గురించి, ఏ వివరాలూ ఇవ్వలేదు, ఈ రచయిత.
వర్గాలూ, వర్గ దృక్పధమూ - అనే మాటలు మాత్రం అక్కడక్కడా వాడారు. 'శ్రామిక వర్గం' అనీ, 'శ్రమ దోపిడీ' అనీ, ఆ వేరువేరు లక్షణాలతో చెప్పకపోతే, 'వర్గాలు' అనడంతోనే, దోపిడీ వ్యవస్థని బట్టబయలు చేసినట్టా?
ఆంధ్రప్రదేశ్లో, కారంచేడు (1985), చుండూరు (1991), హర్యానా జజ్జర్ (2002) -ఇలా, దళితులపై దురంతాలు చేసిన వాళ్లందరూ శూద్ర కులాల వాళ్లే. అంతకన్నా అగ్రకులాలైన బ్రాహ్మణులు కారు. 'అసలు వర్గ దృష్టితో చూస్తే, శూద్రులందరూ ఒకే వర్గంలోకి రావాలి'- అంటారు ఈ రచయిత. (పేజీ: 156)
ఆ శూద్రుల్లోనే, ఆస్తులూ, పెట్టుబడి దారీ ప్రభుత్వోద్యోగాలూ సంపాదించి, అధికారాలు సాధించిన వాళ్లకి వర్గం మారి పోతుంది గానీ, పాత వర్గంలో ఉంటారా? అలాగే, ఒక దళితుడు, పెట్టుబడిదారుడై, ఏటా శ్రమ దోపిడీ సాగిస్తూ ఉంటే, ఆ వ్యక్తికి వర్గం మారిపోదా? అతను 'ఇంకా నేను నిరుపేదను' అనుకుంటాడా?
మరి నిరుపేదల భావాలు ఎలా మారాలి? రచయిత మంచి మాట చెప్పారు. ఏమిటంటే: అనేక కులాల వారు కలిస్తే, 'బహుజనులు' కదా? ఈ జనులు 'వర్గం' దృష్టితో ఉండాలి గానీ (ఆ దృష్టిని, రచయిత 'శ్రామిక వర్గ దృష్టితో' అనలేదు), 'కులాల దృష్టితో వుంటే, అవి, అనేక కులాలు! ఎవరి కులాన్ని వాళ్లదిగా భావిస్తే, ఆ కులాలు కలవలేవు. 'మనందరం ఒక వర్గం. శ్రామిక వర్గం' అని గ్రహిస్తేనే బహుజనులందరూ కలుస్తారు.
కులాలు అనేవి, దొంతరలుగా ఉంటాయి. ఆ దొంతరలుగా ఉండడం ఐక్యతకు విరుద్ధం-అంటారు రచయిత. ఇది, మంచి మాట. 'బహుజన వాదం' అనేది, ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకే ఓట్లు వెయ్యడానికే పనికొస్తుందేమోగానీ, 'కుల భేదాల్ని పాటించవద్దు' అనడానికి పనికి రాదు. ఇక్యత ఏర్ప డాలంటే, 'వర్గ దృష్టి' (శ్రామిక వర్గ దష్టి) ఉండాలి.
(భారత్లో, మాలా-మాదిగా కులాల్ని చూడండి! 'మాల' కులం, తను మాదిగలకన్నా గొప్ప దాన్ని అనుకుంటుంది. ఈ 2 కులాలూ, తమ కుల భావాల్ని వదిలేసి, ఐక్యంగా వుండాలంటే, 'మనం శ్రామికవర్గం, ఒకే వర్గం' అని తెలుసుకోవాలి. )
ఉత్తరప్రదేశ్లో, దళితుల పార్టీ ఏర్పడింది కదా? అక్కడ, ఆ కాలంలో, దళిత కులాల మీద దురంతాలు తగ్గాయా?- అస్సలు లేదు. పైగా, ఆ నేరాల్లో, ఈ రాష్ట్రానిదే అగ్రస్థానం.
దళిత ముఖ్యమంత్రి మాయావతి, దళితులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పుడు, వారి ఫిర్యాదుల్ని ఎస్సీ, ఎస్టీ, చట్టాల ప్రకారం జరిగినట్టుగా నమోదు చేసుకోవద్దని, పోలీసు స్టేషన్లని ఆదేశించింది. (పేజీ: 156). దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
ఆ దళిత ముఖ్యమంత్రి, తను ముఖ్యమంత్రిగా ఉండాలనీ, దళితుల మీద దురంతాలే లేవనీ, పచ్చి అబద్దాలతో పరిపాలన సాగించిందే గానీ, దళితుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుందా?
ఏ కులస్తులైనా, వర్గ దృష్టి లేకుండా, 'మన కులం' అనే దృష్టితోటే వుంటే, ఆ కులం నించీ వచ్చిన ముఖ్యమంత్రులు అలా తయారవుతారు. 'మనం ఒక వర్గం. వర్గ భేదాల్ని తీసివెయ్యాలి' అనే దృష్టితో జీవితాల్ని చూస్తే, అది వేరు.
రచయిత చెప్పిన చివరి మాటలు: 'భ్రమలు, తర్కాన్ని ఆటంక పరుస్తాయి. తార్కిక శక్తి అనే స్వచ్చమైన నీటితో భ్రమల కుళ్లును కడిగివెయ్యాలి. దీన్ని ఖైర్లాంజీ డిమాండు చేస్తోంది.
(ఈ రచయిత ఆనంద్, 8 చాప్టర్లలో రాసిన సమాచారాన్ని నేను అతి తక్కువగా తీసుకున్నాను. ఆనంద్ రాసినది, తెలుగు అనువాదంగా ఉంది కాబట్టి, దాన్ని తప్పకుండా అందరూ చదవాలి. అయితే, తెలుగు అనువాదంలో, కొన్ని చోట్ల అర్ధం మారిపోయే తప్పులు జరిగాయని, ఎన్.రవి అనే సమీక్షకుడు ఉదాహరణలతో చూపించారు. (వీక్షణం, 2014 ఏప్రిల్ సంచికలో). రాబోయే రెండో ముద్రణలో, ప్రచురణకర్తలు, అలాంటి పొరపాట్లను సవరించుకోవచ్చును.)
ఆనంద్ రాసిన చాప్టర్లన్నీ ముగిసిన తర్వాత, బోట్ మాంగేతో ఇంటర్వ్యూగా, ఆయన మాటలు కూడా చూడగలం. తన భార్యా బిడ్డలకు ఘోర హత్యలు జరిగిన తర్వాత (సెప్టెంబరు 29 తర్వాత, నవంబరు 8న), మాంగే, నాగపూర్లోని తిలక్ పత్రికార్ భవన్లో, కిక్కిరిసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కన్నీటితో మాట్లాడాడు. ఎదటి వాళ్లు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పాడు. అక్కడక్కడా ఆ జవాబుల్ని సిద్ధార్ధ కొంత వివరంగా చెప్పాడు.
భోట్ మాంగే: ఎమ్మెల్యే, ఎంపీలే, మా మీద దాడికి పధకం వేశారు. నేను దూరం నించే ఆ దాడిని చూశాను. నా భార్యా బిడ్డల్ని 'మహర్ కుక్కల్లారా' అని తిడుతూ, కొడుతున్నారు. మా వాళ్ల బట్టలు ఊడదీసి ఈడ్చుకుపోయారు. (మాంగే, ఆ దాడిని తన కళ్లతో దగ్గిరగా ఉండి చూడలేదు. అది, అలా జరిగిందని ఇతరులు చెప్పగా విన్న వివరాలు కూడా ఇక్కడ చెప్పాడు.)
మహద్ ఆసుపత్రికి ఒక మృత కళేబరాన్ని తీసుకొచ్చి నన్ను గుర్తు పట్టమన్నారు. గుర్తు పట్టాను. అది నా కూతురు. (మాంగే భోరున ఏడ్చాడు. ఏడుస్తూనే ఇంకా చెప్పాడు.)
నా బిడ్డ శరీరం మీద ఒక్క నూలు పోగైనా లేదు. ఒళ్లంతా గాయాలు, దారుణంగా హింసించారని తెలుస్తుంది. అదేవిధంగా, నా కొడుకుల శరీరాల మీదా, నా భార్య శరీరం మీదా, గాయాలున్నాయి. రోషన్ శరీరం పూర్తిగా దిగంబరంగా ఉంది. సుధీర్ ఒంటి మీద బట్ట ఉంది. సురేఖ తల పగిలిపోయి ఉంది. అందులో నుంచి మెదడు బైటికి చిట్లి ఉంది. ఆమె కన్ను ఒకటి చితికిపోయి ఉంది. (మాంగే కొంచెం సేపు ఆగిపోయి మళ్లీ చెప్పాడు.) అంతంత అత్యాచారాలు చేసిన వాళ్లు, ఏమీ జరగనట్టు తిరుగుతున్నారు.
రెండు నెలల తర్వాత నేను ఖైర్లాంజీకి తిరిగి వచ్చాను. అనుమానం ఉన్న వాళ్ల పేర్లు ఇచ్చాను. వాళ్లు గ్రామంలో బాహాటంగా తిరుగుతున్నారు. పంట కోతలకు వెళ్తున్నారు. అయినా, పోలీసులు, 'వాళ్లు కనిపించడం లేద'ని చెపుతున్నారు. 'వాళ్ల కోసం ఎక్కడని వెతకాలి?' అంటున్నారు. వాళ్లు ఊళ్లోనే ఉన్నారని నేను చెప్పినా, పోలీసులు వినడం లేదు. సర్పంచిని కూడా అరెస్టు చేయలేదు. శవాలను కాలవలో విసరడానికి తీసుకుపోయిన బండి యజమానినీ, బండి తోలినతన్నీ, అరెస్టులు చెయ్యలేదు. ఉప సర్పంచి, నాతోనే, 'నీ ఇంటిని కూల్చేస్తాం' అనేవాడు.
మాంగే, చాలా మంది ఉద్యోగుల పేర్లు చెప్పాడు మొదట. తర్వాత ఎన్సీపీ ఎమ్మెల్యే అయిన 'నానా పంచ బుద్ధే' పేరుని చెప్పడం మానుకున్నాడు. 2006 నవంబరు 10న, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావ్, మాంగేను కలిసేందుకు ఖైర్లాంజీ వచ్చాడు. మాంగేకి నష్ట పరిహారం చెక్కునీ, ఒక ఉద్యోగ ప్రతిపాదననీ, ఇవ్వబోయాడు. మాంగే వాటిని తిరస్కరించాడు. 'ఇవి కాదు, నాకు న్యాయం కావాలి' అన్నాడు.
అయితే, కొన్నాళ్ల తర్వాత, మాంగే, ప్రభుత్వం ఇచ్చిన చెక్కునీ, ఉద్యోగ ప్రతిపాదననీ, ఆమోదించాడు! (ఎందుకు? తనకి న్యాయం జరిగింది-అనుకున్నాడా?) అప్పటినించే నానా పంచ బుద్దే పేరుని పేర్కొనడం మానేశాడు.
''మొత్తం మీద వాళ్లు (ప్రభుత్వం) భోట్ మాంగే నోరు మూయించగలిగారు''-అన్నారు రచయిత.
ప్రభుత్వం, మాంగే నోరు మూయించగలిగింది - అంటే, మాంగే కూడా నోరు మూసుకుని, డబ్బు తీసుకున్నాడని అర్ధమే కదా? మాంగేని నమ్మించిన వాళ్లు ఏం చెప్పి ఉంటారు? 'ఆ నిందితుల్ని వదిలేస్తామా? వాళ్లకి ఉరిశిక్షలు పడే దాకా పోట్లాడతాం' అనే రకం మాటలు చెప్పి ఉంటారా? ఈ వివరాలు లేవు. మాంగే ఆ డబ్బు తీసుకున్నందుకు, దళితులు చాలా బాధ పడ్డారు. మాంగేని , 'బ్రైన్ వాష్ జరిగిన బందీ' అన్నారు. మాంగే, తను చెప్పిన దాంట్లో, గత కాలంలో జరిగిన పొలాల్లో గొడవల గురించి కూడా చెప్పాడు.
''ఇప్పుడు మీ డిమాండ్స్ ఏమిటి?'' అని అడిగితే, ''నేరస్తుల్ని ఉరి తియ్యాలి'' అన్నాడు మాంగే. ''నేరస్తుల్లో ఆడవాళ్లు కూడా ఉన్నారు'' అన్నాడు. మొత్తం ఊరు ఊరంతా అక్కడ ఉంది. నేను అరవై, డెబ్బై పేర్లే చెప్పాను. ఆ దాడి చేసిన వాళ్లల్లో గోండులూ, కలార్లూ, కుంబీలూ కూడా ఉన్నారు.'' అన్నాడు మాంగే.
''ఆ ఊళ్లో వాళ్లకి, మీ మీద ఎందుకు ద్వేషం?'' అని అడిగితే, ''మేం వాళ్లు చెప్పినట్టు ఆడలేదు. పంచాయితీ మీటింగులకు వెళ్లే వాళ్లం కాదు. వాటి మీద నమ్మకం లేక. మాకు ఊళ్లో వాళ్లతో అప్పు సప్పులు లేవు.'' చివరికి, ఈ మాంగే, తన పొలాన్ని కౌలుకి ఇచ్చాడు. తను, ఒక హాస్టల్కి వాచ్మెన్గా పని చెయ్యడం ప్రారంభించాడు. 2017లో గుండెపోటుతో మరణించాడు. మరణం జరగక ముందు, తను సుప్రీం కోర్టుకి అపీల్ చేశాడు. కానీ, మరణించాడు కాబట్టి, ఆ కేసు ఏమవుతుందో తెలీదు. నేరస్తులు కొందరు జైళ్లల్లో ఇంకా ఉన్నారు. బహుశా వాళ్లు రేపో మాపో బైటికొచ్చేస్తారు. (తెలు గు అనువాదాన్నే ఆధారం చేసుకుని నేను చాలా క్లుప్తంగా రాశాను. ఆ పుస్తకం చదివి చూడండి. అనేక చర్చలు తెలుస్తాయి. ఆ పుస్తకం పేరు: ''మాన వ మృగాలు చెలరేగిన నేల ఖైర్లాంజీ: ఒక చేదు పాట''. రచన: ఆనంద్ తెల్ తుంబ్దే. ప్రచురణ: మలుపు బుక్స్. ఈ పుస్తకం చదవకపోతే ఖైర్లాంజీ దురంతాన్ని సరిగా తెలుసుకున్నట్టు కాదు. ఖైర్లాంజీని ఒక చేదు పాట అంటే, అందులో 'చేదు' అనే వివరణ ఉన్నప్పటికీ, ఆ దురంతాన్ని 'పాట' అనడం ఏమిటి? అది ఒక గాధ. చేదు గాధ! విషాద గాధ!).
(అయిపోయింది)
Authorization