భారతదేశం నా మాత భూమి భారతీయులందరూ నా సోదరులు భిన్నత్వంలో ఏకత్వం నా దేశ ప్రత్యేకత అని విద్యార్థి దశలో ఉన్నప్పుడు అక్షరాలకంటే ముందు ప్రతిజ్ఞ నేర్పింది నా బడి. దానికి నేను గర్వపడుతున్నాను. నేనే కాదు భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఈ ఉన్నతమైన లక్షణంతో గర్వపడుతున్నాడు. దేవాలయాల్లో ముస్లిం ప్రార్థనలు మసీదులలో హిందూ దేవతల ప్రతిమలు నా దేశ భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీకలు. అందుకే నా భరత భూమి నాకు గర్వకారణం. 200ఏండ్లు పాలించిన బ్రిటీషు తెల్ల దొరలను తరిమికొట్టేందుకు హిందూ ముస్లిం భాయి భాయి అంటూ చేయి చేయి కలిపి బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని సముద్రపు సరిహద్దులు దాటించేదుకు చేసి న త్యాగాలు అనేకం. బంగారు భవిష్యత్తు నిర్మాణాని కి దేశ సమగ్రత సౌభాగ్యానికి ప్రజలందరూ ఐక్యతకు సంస్కృతి సాంప్రదాయాలు, విశ్వాసాలు కాపాడుకు నేందుకు ఐక్యంగా నిర్మించుకున్న భారత రాజ్యాంగం నేడు ధ్వంసం అవుతోంది. నాటి కలలు కల్లలు అవుతున్నాయి. దేశభక్తి అంటే దేశంలో భక్తి పేర విధ్వంసం సృష్టించడం, ప్రజలకు అభద్రతాభావం కల్పించడంగా మారిపోయింది. ఈ క్షణంలో ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
భారత రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు
భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 16న ఆమోదం పొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచంలోని తాత్విక పునాదులను అనుసరించారు. ఉదారవాదం, ప్రజా స్వామ్య సామ్యవాదం, లౌకికవాదం, గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. సమన్యాయ పాలన, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు. వీటన్నింటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక లక్షణాలు రూపొందాయి, కానీ అవి నేడు దేశభక్తి పేరుతో పెను ప్రమాదంలో చిక్కు కున్నాయి. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. భారతదేశంలోని భిన్నత్వం, అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది. భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపర్చారు. పీఠికలో 'సర్వ సత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా' పేర్కొ న్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను నూత నంగా చేర్చారు. దీంతో పీఠిక 'సర్వసత్తాక, సామ్య వాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా' రూపొందింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజ లకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించ డానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుప ర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకోబడట ంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించడంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది.
భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం గురించి పేర్కొనలేదు. కానీ 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్ సిక్రి, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హెగ్డే మొదలైనవారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్య, సమాఖ్య విధానం, లౌకిక విధానం, సమన్యాయం, సార్వభౌమాధికారం మొదలైనవాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు. మినర్వామిల్స్ కేసు (1980), వామన్రావ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1981) కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూప ప్రాధాన్యతను తెలిపింది.
రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 35 వరకూ ఉన్న నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. భారత పౌరులకు స్వేచ్ఛ కల్పించడానికి ఈ హక్కులు దోహదపడతాయి. సుప్రీంకోర్టు 32వ నిబంధన ద్వారా హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదు రకాల రిట్లు జారీ చేస్తాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ నిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపర్చారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా సస్పెండ్ అవుతాయి.
రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకూ ఉన్న నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడ తాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్ర మాణాలు పెంపొందించడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, తమ రాజకీయ సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు న్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, హింసను విడనాడటం, ప్రభు త్వ ఆస్తులను కాపాడడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెం పొందించుకోవడం వంటి అంశాలు ప్రాథమిక విధు ల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయిత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు.
భారత రాజ్యాంగం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. సమిష్టి బాధ్యత, కార్యానిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం ముఖ్య లక్షణాలు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి జమ్మూ కాశ్మీర్ ప్రజల, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోకుండానే ఆ రాష్ట్ర ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది.
భారత రాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయవ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఐదు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా కొనసాగుతోంది. దేశంలో పౌరుల ప్రాథమిక హక్కుల ను కాపాడడంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర వహిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజాప్రయో జనాల వ్యాజ్యం ప్రాధాన్యత తగ్గిపోయింది. కొన్ని తీర్పులను అధికారవర్గాలు ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలకు ప్రజలు రాక తప్పడంలేదు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి.వేర్ భారతదేశాన్ని 'అర్ధ సమాఖ్య' అని వర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలైన ఒకే పౌరత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, అఖిల భారత సర్వీసుల పాత్ర, కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలో ఉన్నాయి.
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వజనీన ఓటు హక్కు ప్రసాదించింది. స్త్రీ, పురుషులందరికీ కుల, మత, వర్గ, లింగ, జాతి బేధాలు లేకుండా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషింస్తుంది అని, రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధికారం కొనసాగుతుందని విశ్వసించారు. కానీ డబ్బున్న వారే రాజ్యాన్ని చేజిక్కించుకొని తమ పెట్టుబడులను విస్తరించుకుంటూ ప్రజలు నిరుద్యోగులుగా, పేదవారిగా.. ఉపాధి కోసం, ఎన్నికల సమయంలో నాయకులు విసిరే ఎంగిలి మెతుకులకోసం అమలు కాకపోయినా ఉచిత హామీల కోసం ఎదురు చూసే నిర్భాగ్యులుగా మార్చివేయబడ్డారు. రైతు గిట్టుబాటు కోసం కాకుండా, నిరుద్యోగి ఉపాధి కోసం కాకుండా, కార్మికుడు కనీస వేతనం కోసం కాకుండా అణిచివేయబడ్డ వర్గ ఆత్మగౌరవం కోసం కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్థులు పంచే నోట్ల కోసం ఎదురుచూసే దుస్థితి ఏర్పడింది.
గతంలో లేనంతగా భారత్లో ప్రజాస్వామ్య విలువలు పతనమయ్యాయి. నిరసన ప్రదర్శనలపై కాల్పులు, లాఠీఛార్జీలు, పోలీసుల అక్రమ అరెస్టులు సర్వసాధారణమయ్యాయి. కవులు కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రశ్నించేవారు పట్టపగలు హత్యకు గురికావడం సాధారణమైంది. ప్రజల అభిప్రాయాలు, సమాచారం స్వేచ్ఛగా పంచుకునే ఇంటర్నెట్ వందల సార్లు ఆపివేశారు. అయినా ఈ దేశంలో స్వేచ్ఛ ఇంకా బతికే వుంది. కాకపోతే అది ప్రజల స్వేచ్చని హరించే వారి చేతిలో ఉంది. దాన్ని ప్రజల చేతిలోకి తేవడం కోసం మరో ఉద్యమం ఉవ్వెత్తున జరగాలి. రాజ్యాంగ రక్షణ కోసం ప్రజాస్వామ్య ప్రేమికులు, స్వేచ స్వప్నకులు, మతాలు, ప్రాంతాల హద్దులు చేరిపి ఒక్కటై అడుగు ముందుకు వేయాలి.
- మందా సైదులు
సెల్ : 9704874247
Authorization