సత్యభాస్కర్
ఇటీవల కాలంలో కుల, మత, ప్రాంతాలకతీతంగా యువతీ యువకులు కలిసి మెలిసి తిరగడం, ప్రేమలో పడటం సాధారమైంది. గతంలోలా కాకుండా బాల, బాలికలిద్దరికీ సమానంగా చదువు చెప్పిస్తున్నారు. విద్య, ఉపాధి రంగాలలో ఇద్దరికీ అవకాశాలు లభిస్తుండటతో, సహజంగానే వాళ్ల మధ్య సంకోచాలు మాయమై స్నేహాలు మొదలవుతున్నాయి. కుటుంబాలలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఆడపిల్లలను కూడా రకరకాల పనుల్లోకి పంపాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో యువతీ యువకుల మధ్య పరిచయాలు స్నేహంగా మారి ప్రేమకు దారితీస్తున్నాయి. వాటి తుది ఫలితంగా పెండ్లి ప్రతిపాదన ముందుకొస్తోంది. అప్పటి దాకా ఆ ఇద్దరి వ్యవహారంగా సాగిన విషయంలోకి కుటుంబ రూపంలో ఉన్న సమాజం, కట్టుబాట్లు, కులం, మతం, ఆర్థిక అంతరాలు, చట్టం అన్నీ రంగ ప్రవేశం చేస్తున్నాయి. తమ ప్రేమ విజయవంతం కావాలని ఆ యువతీ యువకులు, పెండ్లి అనేది తాము నిర్దేశించిన కట్టు బాట్లకు, తరతరాల సాంప్రదాయాలకు లోబడే జరగాలని సమాజం చెరో వైపు మోహరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఎవరు ఎవరితో కలిసి తిరగాలనే దాన్ని కూడా నియంత్రించే పరిస్థితులున్నాయి. ఈ విధంగా యువతకు, సమాజంతో తలెత్తిన వైరుధ్యం సవ్యంగా పరిష్కరించబడకపోతే హత్యలు, ఆత్మహత్యల రూపంలో హింసాకాండ చెలరేగుతోది. కులాంతర వివాహాలు చేసుకున్నారని కన్న తల్లిదండ్రులే పిల్లలను హత్య చేయడం చూస్తున్నాం. ఆ పిల్లలు పారిపోతే వాళ్ల తల్లితండ్రులు, బంధువుల మీద దాడులు చేసి కసి తీర్చుకుంటున్నారు. ఊర్ల నుంచి వెలివేస్తున్నారు. మైనారిటీ తీరని పిల్లలు కలిసి వెళ్లిపోయినా, పెండ్లి చేసుకున్నా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించబడుతున్నారు. యుక్త వయస్సు పిల్లలు పెండ్లి చేసుకుంటే ఆ పిల్లాడికి/ పిల్లకు నెమ్మదిగా బుద్ధి చెప్పి ఆ కాపురంలో నిప్పులు పోసి, చీల్చేయడం తల్లిదండ్రుల పవిత్ర కర్తవ్యం అవుతోంది. ఆ గృహహింస బాధితులు నా మొగుడు/పెళ్లాం నాకు కావాలని వాళ్ల ఇండ్ల ముందు ధర్నాలు చేయడం, పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కడం చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో సాగే హింసా కాండకూ, ఒత్తిడికీ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని కాపురాలు విడాకులతో ముగుస్తున్నాయి. ఆ విధంగా ఆ యువతీ యువకుల ప్రేమకు, పెండ్లికి ముగింపు పలికి సమాజం తర తరాల సంప్రదాయాలను కాపాడినందుకు సంతృప్తి చెందుతోంది. యువత మీద పైచేయి సాధిస్తోంది.
ప్రేమ -పెండ్లిల వ్యవహారం ఈ రకంగా ఉంటే, పెద్దల ఆశీర్వాదంతో వాళ్లే కుదిర్చిన కాపురాలు కూడా మరో రకగా కూలుతున్నాయి. భార్య/భర్త పరాయివాళ్లతో ఫోన్లో తరచుగా మాట్లాడుతున్నారనో, చాట్ చేస్తున్నారనో, టిక్టాక్ వీడియోలు చూస్తున్నారనో, చేస్తున్నారనో, సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారనో అనుమానించి ఘర్షణ పడుతున్నారు. ఒక్కోసారి ఆ అనుమానాలు నిజమై భర్త ప్రియురాలు కలిసి భార్యను లేదా భార్య ప్రియుడు కలిసి భర్తను హత్య చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా దిగ్భ్రాంతి చెందడం, మన రాతలోనో, టీవీ చర్చలలోనో ఆవేదన వ్యక్తం చేయడం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో ముగుస్తోంది. ఈ రకమైన హత్యాకాడ ఎందుకు సమాజంలో పునరావృతమవుతోందనే విషయాన్ని మూలాలలోకి వెళ్లి అవగాహన చేసుకుని, పరిష్కా రం కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిమీద, ముఖ్యగా యువత మీద ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రేమ -పెండ్లిండ్లతో సమాజం కట్టుబాట్లను ధిక్కరించి తేనె తుట్టెను కదుపుతోంది వాళ్లే కాబట్టి!
ఈ సమస్యను పైపైన తడిమితే, పైపై జవాబులే లభిస్తాయి. తల్లిదండ్రుల పెంపకం బాలేదనో, టీవీ, ఇంటర్నెట్, సినిమాల దుష్ప్రభావం, తరతరాల కట్టుబాట్లు, సంప్రదాయాలు బలహీన పడడం లాంటి కారణాలను చూపిస్తుంటారు. ఈ నిర్ధారణలకే పరిమితమైతే చూపే పరిష్కారం కూడా పరిమితంగానే ఉంటుంది. కేన్సర్ రోగానికి పైపూతలతో వైద్యం చేయడమే అవుతుంది. కాబట్టి రోగ నిర్ధారణ కోసం మరింత లోతుగా వెళ్లి పరిశీలించాలి. ఈ సమస్యకు మూలాలు మన సమాజంలోనే ఉన్నాయి తప్ప వ్యక్తులలోనో, కుటుంబాలలోనో లేవు. 72ఏండ్ల స్వతంత్రంలో భారత దేశం ఆర్థికంగా బాగా ఎదిగింది. విదేశాలతో పోటీ పడగల నగరాలు మనకున్నాయి. ప్రపంచస్థాయి విద్యాలయాలున్నాయి. సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో బాగా ఎదిగాము. వైద్యరంగంలో కూడా మంచి పేరు సంపాదించాం. మనుషుల వేషభాషలలో కూడా ఆధునికత ఉట్టిపడుతోంది. ఈ అభివృద్ధినంతా చూస్తే మనం చర్చించే' ప్రేమ-పెండ్లిండ్లు' ఒక సమస్యే కాకూడదు. కానీ మన దేశంలోనే అది సమస్య అవుతుంది. ఎందుకవుతోంది అని ఆలోచిస్తే దాని పరిష్కారం కూడా దొరుకుతుంది.
ఎందుకంటే మన కండ్లకు కనబడే ఆధునికత, అభివృద్ధి వేరే పెట్టుబడిదారీ దేశాలలో లాగా సామాజిక పరిణామ క్రమంలో రాలేదు. ఈ ఆధునికతకు పునాది ఒక అనాగరిక ఫ్యూడల్ సమాజం మీద ఆధారపడి ఉంది. దీనిలో వేలాది సంవత్స రాల అమానుష కుల వ్యవస్థ తిరోగామి, చాందస వాద భావజాలం, మనదేశంలో ఇంకా పదిలంగాను, పట్టుతో ఉన్నాయి. స్త్రీ పురుష సంబంధాలు, పెండ్లి, పిల్లల పెంపకం లాంటి విషయాలన్నింటినీ, కఠిన నిబంధనలతో ఈ ఫ్యూడల్ భావజాలమే నియంత్రిస్తుంటుంది. వాటి పరిరక్షణ కోసం మధ్యయుగాలలోలాగే దాడులకు, హింసాకాండకు పాల్పడుతుంటుంది. బ్రిటిష్ వలస పాలనలో ఆధునికత మన భూభాగంలోకి ప్రవేశించినా అది ఈ ఫ్యూడల్ పునాదితో రాజి పడిందే తప్ప ఘర్షణ పడలేదు. ఇక్కడి ఫ్యూడల్ వ్యవస్థను, ప్రభువులను సంరక్షిస్తూ తమ దోపిడీ పాలనను యధేచ్చగా కొనసాగించారు. తర్వా త వాళ్ల నుంచి పరిపాలనా పగ్గాలు చేపట్టిన మన స్వదేశీ పాలకులు కూడా అదే బాటలో సాగారు. అందుకే ఈ రోజుకూడా కుల దురహంకార హత్యలు, మూకదాడులు, గోరక్షణ హత్యలు, స్త్రీల మీద అత్యాచారాలు, గృహహింసా మొదలగునవి యథేచ్ఛగా సాగుతున్నాయి.
అందుకే సూటు బూటులతో పోటీపడే మన భారతీయులు విశ్వాసాల విషయంలో మాత్రం తమ పూర్వీకులకు ఏమి తీసిపోవడం లేదు. ఇంటికి రాగానే, బట్టలు మార్చినట్టు తమ బుర్రలోని శాస్త్రీయ విజ్ఞానాన్ని అటకెక్కించి కాలం చెల్లిన తాతల నాటి కులాచారాలకు, కట్టుబాట్లకు, మత విశ్వసాలకు నిబద్దులవుతున్నారు. ఈ వైరుధ్యం వల్లనే మన కుటుంబ వ్యవస్థ అటు ఆధునికతకు, ఇటు మధ్య యుగపు ఫ్యూడల్ భావజాలానికి మధ్య నలిగిపోతూ, ఘర్షణపడుతూ అమానుష హత్యాకాండకు తెరతీస్తోంది. పాలక వర్గాలు కూడా ఈ రకమైన ఫ్యూడల్ భావజాలాన్ని పెంచిపోషించేలా చర్యలు తీసుకుంటున్నాయి. అధికార పీఠాల మీద ఉన్న వాళ్లే యజ్ఞాలు, యాగాలు చేస్తూ, గుళ్లు గోపురాలు కట్టిస్తూ, వివిధ మతపర యాత్రలకు కార్యక్రమాలకు అండ దండలందిస్తూ బ్రిటిష్ వారి వారసులమని రుజువు చేసుకుంటున్నారు. రాజ్యాంగం ఆశించిన లౌకిక విలువలను పాతరేస్తున్నారు. కాబట్టి యువత తాము స్వప్నించే ప్రేమ ప్రపంచం సాకారం కావాలంటే, ఈ ఫ్యూడల్ భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకలించే సమరానికి సిద్ధపడాలి. ప్రజల మధ్య నిరతరం కులాలు, మతాల కుంపట్లను రగిలిస్తూ వాళ్లంతా దానిలోనే కొట్టుమిట్టాడుతుంటే, ఆర్థిక వనరులను కొల్లకొడుతోన్న క్యాపిటలిస్టు కార్పొరేట్ శక్తులను అడ్డుకోవాలి. ఈ ప్రతిఘటనా క్రమంలోనే యువత తమ ప్రేమలను రక్షించుకోగల సామర్ధ్యాన్ని పొందగలుగుతుంది. ఈ పోరాటంలోనే కుటుంబ సంబంధాలు కూడా ప్రజాస్వామీకరించబడి స్త్రీ, పురుషులు సమాన హౌదాలో జీవించే ప్రేమమయ సమాజం ఏర్పడుతుంది.
సెల్: 9848391638
Authorization