ఇటీవల 29, ఫిబ్రవరి, 2020 నాడు అమెరికా, తాలిబన్ల ప్రతినిధులు ఖతార్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో శాంతి ఒప్పందం మీద సంతకాలు చేయడంతో పద్దెనిమి సంవత్సరాల యుద్ధం ముగింపు దిశలో అడుగు వేసింది. 2001వ సంవత్సరం నుండి సాగిన ఈ యుద్ధంలో 1,57,000 మంది మరణించారని అంచనా. వీరిలో 43,000మంది పౌరులున్నారు... 2,400మంది అమెరికన్ సైనికులు మరణించగా 20,000మంది గాయపడ్డారు. 1100మంది నాటో దళాల సైనికులు మరణించారు. 25లక్షల మంది అఫ్ఘాన్ ప్రజలు కాందిశీకులుగా మారి వివిధ దేశాలలో తల దాచుకుంటున్నారు. వేలాదిమంది తాలిబన్ సైనికులు మరణించారు. అమెరికాకు 2ట్రిలియన్ డాలర్లు ఖర్చయిందట. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదురులేని సైనికశక్తిగా, ఆధునిక సాంకేతికలో మేటిగా విర్రవీగే అమెరికా 18సంవత్సరాలు అఫ్ఘనిస్తాన్లో తిష్టవేసినా తాలిబన్లను ఓడించలేక పోయింది. తాలిబన్లు నానాటికి బలపడుతూ 60,000 యోధులతో మెజారిటీ ప్రాంతాలను నియంత్రిస్తున్నారు. రాజధాని కాబూల్తో పాటు అన్ని పట్టణాల మీద దాడిచేసే స్థాయికి చేరారు. అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కూల్చివేసే శక్తి సామర్థ్యాలు సాధించారు. అమెరికా చేతులెత్తేసి ఈ ఊబి నుంచి బయట పడడానికి శాంతి ఒప్పందాన్ని చేసుకుంది.
అఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలకు ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిన ఈ యుద్ధం ముగియడం ఆనందదాయకం కావాలి. అందులోను ముఖ్యంగా మహిళలకు, తమ పిల్లలు, భర్తను సంసారాలను కోల్పోయిన వాళ్లకు ఇది ఊరట కలిగించే వార్త కావాలి. కానీ ఆశ్చర్యకరంగా ఆ దేశంలోని మహిళా హక్కుల నేతలు ఈ శాంతి ఒప్పందం, తాలిబాన్లకు తిరిగి అధికారం బదలాయింపు జరిగే అవకాశాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దానికి కారణముంది. రష్యా సైన్యం అప్ఘ్గనిస్తాన్ నుంచి వైదొలిగాక 1996లో తాలిబన్లు అఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చారు. అప్పటినుండి వాళ్ళ పాలనలో షరియత్ చట్టం అమలు పేరిట ఛాందసంగా వ్యవహరిస్తూ స్త్రీలకు విద్య, ఉద్యోగ హక్కులు నిషేధించి ఇంట్లోనే పురుషుల ఆధీనంలో వుండాలని హుకుం జారీ చేశారు. హింసాయుత పద్ధతుల్లో స్త్రీ స్వేచ్ఛను హరిస్తూ మధ్య యుగాలనాటి పరిస్థితులు సృష్టించారు. అఫ్ఘాన్ ప్రజలే కాకుండా, ప్రపంచం కూడా ఈ నిషేధాలను చూసి నివ్వెరపోయింది, నిరసించింది. ఆనాటి అనుభవాలే వాళ్ళలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.. ఒక మహిళా హక్కుల నేత, మాజీ పార్లమెంట్ సభ్యురాలు ''ఒక యుద్ధం ముగిసింది. మా యుద్ధం ఇప్పుడే మొదలయింది'' అని అన్నారంటే అక్కడి మహిళల స్థితి తెలుస్తుంది.
మహిళా స్వేచ్ఛకు ఇస్లామిక్ చాందసవాదుల నుండే కాదు, హిందూ మతోన్మాదుల నుండి కూడా ప్రమాదం ఎదురుకానుందని మన దేశం లోకూడా సంకేతాలు వెలువడుతున్నాయి.. కేంద్రంలో పూర్తి మెజారిటీలో వున్న బీజేపీకి కర్త, కర్మ, క్రియ అయిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్భగత్, మహిళల పట్ల వెల్లడించిన అభిప్రాయాలు గమనిస్తే, ఈ విషయంలో ఆయన తాలిబన్ల కన్నా తక్కువేమి తినలేదని స్పష్టమవుతుయింది. పశ్చిమ దేశాల సంస్కతి దిగుమతి అవడం వల్లనే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. భార్యభర్తలు వివాహం ద్వారా ఒక వొప్పందంలోకి వస్తారు. భార్య ఇంటి పట్టునే ఉండి భర్త అవసరాలు, ఇల్లు వాకిలి, సంసారాన్ని చూసుకోవాలి. భర్త ఆమె రక్షణ, అవసరాలు చూస్తాడు. మహిళలలో కూడా విద్యా, ఆర్ధిక స్వతంత్రం పెరగడంతో విడాకులు ఎక్కువైపోతున్నాయి అని శ్రీ భగత్ అన్నారు. దీని సారాంశం ఒక్కటే! మహిళలను ఇంటికే పరిమితం చేసి భర్తకు దాసిగా సేవలు చేసుకొనే పూర్వీకుల చాందసవాద సంస్కతి తిరిగి తేవాలి! మహిళల పట్ల తాలిబన్ వైఖరికి, మన ఆర్ఎస్ఎస్ చీఫ్ చెబుతున్న దానికి ఏమి తేడా లేదు! ఈ మధ్య కాలంలో మహిళల మీద హత్యాచారాలు చేసే వారిలో బీజేపీ నాయకుల పేర్లు తరచుగా వినబడు తున్నాయి. వాళ్ళను శిక్షించే బదులు వాళ్ళేదో ఘనకార్యం చేసినట్టు బీజేపీ వెనకేసుకొస్తోంది. అదేవిధంగా బీజేపీ అనుబంధ సంఘాలు హిందూ సంస్కతి పరిరక్షకులమంటూ వాలెంటైన్ డేను నిషేధించి, ఆ రోజు కలిసివున్న యువతీ యువకుల మీద చట్ట వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతూ భయోత్పాతాన్ని సష్టిస్తున్నాయి. యువతులకు డ్రెస్ కోడ్ను నిర్దేశిస్తున్నారు. వీళ్ళకి తాలిబాన్లకు తేడా ఏముంది!?
ఇంతే కాకుండా, అంతిమంగా దేశంలో మనుస్మతి తెస్తామని ఈ సంఫ్ుపరివార్ శక్తులు ప్రకటిస్తు న్నాయి. ''స్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అని మనుస్మతి ప్రకటించిందన్న విషయం గమనంలో ఉంచుకోవాలి. స్త్రీ పురుషులకు సమాన హక్కులు గ్యారంటీ చేసిన మన దేశ రాజ్యాంగం అంటే కూడా వీళ్లకు నచ్చదు. దాని స్ఫూర్తిని ఆచరణలో పదే పదే ఉల్లంఘిస్తూ, అంతిమంగా మనుస్మతిని తేవాలని కంకణం కట్టుకున్నారు.. కాబట్టి మన దేశంలోని స్త్రీలు, ముఖ్యంగా యువతులు, విద్యార్థినులు హిందూత్వ శక్తుల విజృంభణ, ఆధిపత్యం తమ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు, ప్రగతికి సమాధి కడుతుందని గుర్తించాలి.
దేశభక్తి, హిందూ సంస్కృతి, పరమత విద్వేషాల ముసుగులో విజృంబిస్తోన్న ఈ తిరోగామి శక్తుల ఉచ్ఛులో పడకుండా జాగురకతతో ఉండాలి. నేడు స్త్రీలు అనుభవిస్తోన్న విద్య, ఉపాధి, పురుషులతో సమాన హక్కుల సాధనకు, సావిత్రిబాయి ఫూలే, వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్రారు వంటి సంఘ సంసంస్కర్తలు, విశేష త్యాగాలు ఆత్మ బలిదానాలతో నిర్మించబడ్డ వామపక్ష శక్తులు తోడ్పడ్డారు.
ఇస్లాం చాందసవాదుల పరిపాలనలో అఫ్ఘనిస్తాన్ మహిళలు అనుభవించిన అమానుష బానిసత్వాన్ని గుణపాఠంగా తీసుకుని మన దేశ ఆధునిక, విద్యావంతులైన మహిళలు నిర్ద్వందంగా ఈ హిందూ చాందస వాదాన్ని తిరస్కరించాలి. సాటి మహిళా లోకాన్ని మేలుకొలిపి రాజ్యాంగం హామీ ఇచ్చిన స్త్రీ పురుష సమాన హక్కుల సాధన, పరిరక్షణ కోసం ఉద్యమించాలి. అదే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రగతిశీల, ప్రజాతంత్ర ఉద్యమాలలో భాగస్వామి కావాలి. దానిలోనే ఆమె భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.
- దినకర్
Authorization