నవ్య, వైవిధ్య చిత్రాల రూపకల్పనతో నేపాలీ చిత్రాలు ఓ ప్రత్యేకత చాటుకున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలకు నేపాలీ చిత్ర పరిశ్రమ కేరాఫ్గా నిలిచినప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆశించిన స్థాయిలో చిత్రాల నిర్మాణం జరగడం లేదు. గత పదేండ్ల కాలంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన కొన్ని నేపాలీ చిత్రాల గురించి ఈ వారం అందిస్తున్న స్పెషల్ షో..
కగ్బెనీ
తన చిరకాల స్నేహితుడు రమేష్ను కలవడానికి మలేషియా నుంచి కృష్ణ కగ్బెనీ గ్రామానికొస్తాడు.
అతన్ని కలిసినప్పుడు అక్కడ పర్వత ప్రాంతంలో ఉండే సన్యాసి వాళ్ళకి మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ది మంకీస్ పా(కోతి పంజా)ను ఇస్తాడు. దానికి చాలా శక్తి ఉంటుందనేది అతని నమ్మకం.
అది తమకెంతో హెల్ప్ చేస్తుందని కృష్ణ, రమేష్ కూడా భావిస్తారు. కానీ ఒక ట్వీస్ట్తో వారి జీవితమంతా మారిపోతుంది. వారి జీవితంలో చోటు చేసుకున్న భయానక, విషాదకర పరిణామాలేంటనేది సినిమా. 1902లో వచ్చిన 'ది మంకీస్ పా' అనే షార్ట్ స్టోరీ ఆధారంగా దర్శకుడు భుసాన్ దహల్ ఈ హర్రర్ చిత్రాన్ని రూపొందించారు. 2008లో విడుదలైన
ఈ సినిమా నేపాలీ సినిమా చరిత్రలో ఓ బెంచ్మార్క్గా నిలిచిపోయింది. కొత్త తరహా కథను తెరకెక్కించిన తీరు పట్ల విమర్శకులతోపాటు సినీ ప్రముఖులంతా ప్రశంసించారు. కృష్ణ పాత్రలో నీమా రుంబ, రమేష్ పాత్రలో సౌగత్ మల్లా నటన ఆద్యంతం అబ్బుర పరుస్తుంది.
సడంగా
గ్యాంగ్స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కలు ఓ పెద్ద డాన్. అక్కడుండే పెద్ద వ్యాపారవేత్త, స్మగ్లరైన అభయ రాజా దగ్గర కలు, అతని స్నేహితుడు విక్కీ కూడా పనిచేస్తుంటాడు. సలీనా నటి. అంతేకాదు అభయరాజా ప్రియురాలు కూడా. కలో బాలు అనే డాన్తోపాటు గోరె అనే వ్యక్తి కూడా కలును చంపి డాన్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు.
అభయరాజా ప్రియురాలు సలీనా ప్రేమలోపడి ఆమెను పెళ్ళి చేసుకోవాలని విక్కీ భావిస్తే,
కలు మాత్రం అభయరాజా కంటే పెద్దవాడిగా ఎదగాలనుకుంటాడు. తన కంటే బాస్ ఎవరూ ఉండకూడదని డిసైడ్ అవుతాడు. ఇదిలా ఉంటే, స్మగ్లింగ్ దందా ఆపేసి రాజకీయాల్లోకి వచ్చి ఖడ్మాండు మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని అభయరాజా భావిస్తుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమదైన యాడిట్యూడ్తో లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తపిస్తుంటారు. మరి వాళ్ళ లక్ష్యాలు నెరవేరాయా?, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి అనేదే సినిమా. అత్యంత క్లిష్టంగా సాగే ఈ చిత్రానికి సురాజ్ సన్వార్ అంతే అర్థవంతంగా, వినోదాత్మకంగా తెరకెక్కించారు. 2015లో విడుదలై ప్రేక్షకులను మైమరపించింది. యాక్షన్ సన్నివేశాలు, డైలాగులకు
మంచి ప్రశంసలు దక్కాయి.
కబడ్డీ
ఇదొక ముక్కోణ ప్రేమకథా చిత్రం. లక్ష్యం లేకుండా బతికేస్తున్న కాజీ అనే కుర్రాడు ఆ గ్రామంలో ఉండే మియా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కలలు కంటుంటాడు. మియాకేమో సిటీకి వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవాలని ఆరాటపడుతుంది.
ఈ టైమ్లో సిటీ నుంచి ఉషారైన ఓ ఛార్మింగ్ కుర్రాడు విలేజ్కి వస్తాడు. దీంతో వీళ్ళ జీవితాలు మొత్తం గందరగోళంలో పడతాయి. మరి ఆ కుర్రాడు ఏం చేశాడన్నది సినిమాలో ఆసక్తికరం. రాంబాబు గురుంగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ 2013లో విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. కాజీ పాత్రలో దయాహాంగ్ రారు, మియా పాత్రలో రిషిమా గురుంగ్, సిటీ కుర్రాడి పాత్రలో నిస్చల్ బస్నెట్ల నటన కనువిందు చేస్తుంది. దీనికి సీక్వెల్గా 2015లో 'కబడ్డీ కబడ్డీ' చిత్రం వచ్చింది. రాంబాబు గురుంగ్ దర్శకత్వంలోనే రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 'కబడ్డీ'కి కొనసాగింపుగా కాజీ, మియా, కొత్తగా వచ్చిన పట్నం కుర్రాడి మధ్య ట్రయాంగిల్ ప్రేమ కథను తెలియజేసి, ఘన విజయం సాధించింది. నేపాల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
జ్వాల
18వ శతాబ్దపు కాలంలో నేపాల్ సమాజంలో ఉన్న మత తత్వ మూఢాచారాలు, సంస్కృతి సంప్రదాయాలను, సతీసహగమనాన్ని ప్రతిబింబించే చిత్రమిది. నేపాల్కి చెందిన మహిళ కాంచికి
ఓ ముసలి వ్యక్తితో వివాహం జరుగుతుంది.
వీరి దాంపత్య ఫలితంగా కుమారుడు ఘనశ్యామ్ జన్మిస్తాడు. అనారోగ్యంతో కాంచి భర్త చనిపోతాడు. అప్పటి సంప్రదాయం ప్రకారం భర్తతో పాటు భార్య కూడా సజీవదహనం కావాల్సి ఉంటుంది. తను చనిపోతే కొడుకు అనాథ అవుతాడని కాంచి భావిస్తుంది. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ కొడుకు కోసం బతకాలనే నిర్ణయానికొచ్చిన కాంచి దహన సంస్కారాలు జరిగే ప్రాంతం నుంచి కొడుకుతో పారిపోతుంది. కానీ అక్కడి పెద్ద మనుషులు ఆమెను వెంబడిస్తూ చంపేందుకు ప్రయత్నిస్తారు.
ఈ నేపథ్యంలో తనతోపాటు కుమారుడిని బతికించుకునేందుకు ఆమె పడిన సంఘర్షణే
ఈ చిత్రం. యాదవ్ కుమార్ భట్టరారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించింది. కాంచి పాత్రలో గరిమా పంటా నటన ఆద్యంతం అబ్బుర పరుస్తుంది.
ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా లభించింది. 2014లో విడుదలైన ఈ చిత్రం విదేశీ విభాగంలో ఆస్కార్కు నామినేట్ అవ్వడం విశేషం.
వైట్ సన్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిపక్ష నాయకుడు చంద్ర. అతని తండ్రి చనిపోవడంతో అంత్యక్రియల కోసం సమీపంలో ఉండే పర్వతాన్ని దాటుకుని వెళ్ళాలి. కానీ పర్వతం నుంచి వెళ్ళాలంటే పోలీసులు, రాజకీయ పరమైన అడ్డంకులు, ఇతర గ్రామస్థుల అడ్డంకులు, చివరికి వ్యతిరేక పక్షమైన సొంత సోదరుడి నుంచి కూడా అడ్డంకి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో తండ్రి అంత్య క్రియలను నిర్వహించే క్రమంలో చంద్ర చేసిన పోరాటమే మిగిలిన సినిమా. ఈ నేపాల్ బయోగ్రాఫికల్ సినిమాను నేపాల్ సివిల్ వార్ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు దీపక్ రాణియార్ రూపొందించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమై అనేక అవార్డులనందుకుంది. అంతేకాదు విదేశీ విభాగంలో ఆస్కార్కి ఎంట్రీ ఇచ్చింది. చంద్ర పాత్రలో దయాహాంగ్ రారు సహజత్వమైన నటన మంత్రముగ్ధులను చేస్తుంది.
ఉమా
ఒక కుటుంబంలోని అన్నా చెల్లెలి మధ్య ఉండే సిద్ధాంతపరమైన ఘర్షణను తెలిపే చిత్రమిది.
ఉమా, సోదరుడు మిలన్ అమ్మతో కలిసి ఉంటారు. ఉమా కాలేజ్ స్టూడెంట్. మిలన్ నిజాయితీగల పోలీస్. ఆ టైమ్లో మావోయిస్టులకు, పోలీస్లకు మధ్య ఘర్షణలు, కాల్పులు జరుగుతుంటాయి.
ఈ నేపథ్యంలో సామాజిక మార్పు కోసం పనిచేసే సునీల్ అనే టీచర్ను మావోయిస్టుగా భావించి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు. సునీల్ ఎన్కౌంటర్తో భయపడిపోయిన ఉమా మావోయిస్టులకు దగ్గరవుతుంది. దీంతో వాళ్ళ అన్నయ్య మిలన్కు, ఉమాకు మధ్య నమ్మకం, సిద్ధాంత విషయాల్లో అభిప్రాయ బేధాలు తలెత్తడమనేదే ఈ చిత్ర కథ. టేర్సింగ్ రైటర్ షెర్పా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2013లో విడుదలై మంచి ఆదరణ పొందింది.
హైవే
బస్సు ప్రయాణంలో చోటు చేసుకున్న ఐదు విభిన్న కథలను తెలిపే చిత్రమిది. తూర్పు నేపాల్ నుంచి ఖాట్మండు వరకు బస్సు ప్రయాణం సాగుతుంది.
నేపాల్లో జరిగే బంద్ కారణంగా బస్సు ప్రయాణం సాఫీగా సాగదు. దీనికి తోడు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బంద్ కారణంగా వాహనాలతో రోడ్డు మొత్తం నిండిపోతుంది.
ఈ క్రమంలో బస్సు ప్రయాణం ఎలా సాగింది?,
ఈ ప్రయాణ సమయంలో భిన్న కథలెలా చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్ర కథ. నేపాల్లోని బంద్ సంస్కృతిని, సైకలాజికల్ ఇష్యూస్ని, ఆధ్యాత్మిక బంద్లను ఈ చిత్రం ప్రధానంగా ప్రతిబింబింపచేస్తుంది. దీపక్ రాణియార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల మన్ననలను పొందింది. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై అవార్డులను సొంతం చేసుకుంది.
లూట్
డబ్బాశ మనిషిని ఎలా మారుస్తుంది?,
పేదరికంలో బతకడం ఇష్టంలేని వ్యక్తి సంపన్నుడిగా మారేందుకు ఏం చేశాడనే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. హకు కలె పేదరికంలో జన్మించిన వ్యక్తి. అలానే పేదవాడిని ఉండటం అతనికిష్టం లేదు. దీంతో నిరాశ, నిస్పృహలతో ఉన్న మరో నలుగురు వ్యక్తులను కలుపుకుని బ్యాంక్ దొంగతనం చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో హకు మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేదే సినిమా.
నిశ్చల్ బాస్నెట్ దర్శకత్వంలో రూపొందిన
ఈ సినిమా ప్రధానంగా త్వరగా డబ్బు సంపాదించడం కోసం ఎలా చెడుమార్గాల్లో వెళ్తున్నారనే విషయాన్ని తెలిపింది. 2012లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్గానూ ఆకట్టుకుంది.
Authorization