Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా రోజుల క్రితం నేనొక కథ చదివాను. నా జ్ఞాపక శక్తి తప్పు కాకపోతే ఆ కథ రాసింది అక్కినేని కుటుంబ రావు గారు.ఆ కథలో భానుమతి, ఎన్టిఆర్ అంటే బాగా ఇష్టపడే కథా నాయ కుడు చాలా కాలం తరువాత మార్నింగ్ షోగా ప్రదర్శించ బడుతున్న మల్లేశ్వరి సినిమా కు వెళతాడు. అదే సినిమాకు కొంతమంది కాలేజీ పిల్లలు కూడా వచ్చి కధానాయకుడి ముందు వెనుకలా కూర్చుం టారు. సినిమా ప్రారంభం అయిన దగ్గర నుండీ పూర్తి అయ్యేవరకు రన్నింగ్ కామెం టరీ చేస్తూ, కథనాయకుడు ఎంతగానో అభిమానించే భానుమతి, రామారావుల నటనను పోస్ట్మార్టం చేస్తూ ఎంజారు చేస్తూ రచ్చ రచ్చ చేస్తారు. మల్లేశ్వరి సినిమాలోని చాలా అద్భుతమైన సన్నివే శాలను కూడా హాస్యాస్పదంగా తీసుకుని, కామెంట్ చేస్తూ తమదైన లోకంలో విహరిస్తారు. వాళ్ళను ఏమీ అనలేని కథా నాయకుడు ఇప్పటి తరానికి జీవితం అంటే సీరియస్నెస్ లేదని, ఈస్తటిక్స్ లేవని విసుక్కుని, లోలోపల మధన పడిపోతాడు.
ఆ కథలోని కథానాయకుడికి ఎదురైనా అనుభవం లాంటిదే నాకూ ఎదురైంది. మొన్నామధ్య సాయిపరాంజపే దర్శకత్వంలో, నసీరుద్దీన్షా, దీప్తినావల్, ఫరూక్షేక్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ''కథ'' సినిమా ఇంట్లో చూస్తూవున్నప్పుడు మా అబ్బాయి నాతో పాటు కాసేపు చూసి ''ఈ తాబేలు-కుందేలు కథ ఎంతసేపు చూస్తాం నాన్నా? అయినా ఇప్పుడు తాబేలు కుందేలు కథకి రేలవెన్స్ లేదు. పేషన్స్ పేస్ (patience pays) అనే మాట నిజమే అయినా ఆ ఎదురుచూపు కు తగిన ప్రతిఫలం లభించినా, అది ఆ ఎదురు చూపు కలిగినంత విలువ కలిగి ఉంటుందా?'' అని ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న వేసి మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు.
వాడి ప్రశ్న నాలో ఒకింత ఆలోచన కలిగించినప్పటికీ ఆ ఆలోచనను ఒక పక్కన పడేసి సినిమా పూర్తిగా చూసాను. ఎందుకంటే నాకు దీప్తి నావెల్ అంటే ఇష్టం కనుక. సినిమా పూర్తి అయినా ఆ ప్రశ్న నన్ను వెంటాడుతూనే వున్నది. దానికి జవాబు నాకు ఇంకా దొరకలేదు.
కథ 1983లో వచ్చిన సాయి పరాంజపే దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం. బాక్సాఫీస్ దగ్గర బాగా నడిచి మంచి క్లాసిక్గా నిలిచింది. ఒక మరాఠీ నాటకం ఆధారంగా తీసిన ఈ సినిమాకు సాయి పరాంజపే అద్భుతమైన స్క్రీన్ ప్లే రాసుకున్నది. అనాదిగా మనం చదువుకుంటూ వస్తున్న తాబేలు -కుందేలు రన్నింగ్ రేస్ ఈ మరాఠీ నాటకానికి ఆధారం. ఈ రన్నింగ్ రేస్ను ఒక ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీ గా మలచి ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది.
ముంబైలో ఓ నాలుగంతస్తుల మధ్య తరగతి చావిడి. ఇప్పటి భాషలో చెప్పాలంటే అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ వాసులందరు ఏ పొరపొచ్చాలు లేకుండా కలసిమెలసి ఉంటూ వుంటారు. అందులో రాజారామ్ పురుషోత్తం జోషి (నసీరుద్దీన్ షా) ఒక చిరుద్యోగి. సంధ్య (దీప్తీ నావెల్) ఒక విముక్తి పొందాను అని భావించే ఒక అవివాహిత. ఆమె భాష లోనే చెప్పాలి అంటే ఒక లిబరేటెడ్ ఉమెన్. రాజారామ్కి సంధ్య అంటే బోలెడంత ప్రేమ. అయితే ఆ ప్రేమను వ్యక్తం చేసే ధైర్యం లేని అంతర్ముఖుడు. సంధ్యకి తన పట్ల రాజారామ్కి ఉన్న ప్రేమ తెలుసు కానీ దానిని బయట పెట్టే అవకాశం ఆమె అతడికి ఇవ్వదు. ఎందుకంటే ఆమెకే చిన్న కన్ఫ్యూజన్. అందుకే ఆమె ఎప్పుడూ అతడిని రాజారాంజీ అంటూ గౌరవంగా సంబోధిస్తూ ఉంటుంది. ఆ సంబోధన వినగానే అతడు చెప్పాలనుకున్నది కాస్తా మరచిపోయి జావకారిపోతూ ఉంటాడు. రోజులు ఏ మార్పూ లేకుండా చాలా నిస్తేజంగా గడచిపోతున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ జీవితంలోకి ఒక సునామీ లాగా వస్తాడు వాసుదేవ్ భట్ ఎలియాస్ బాషు (ఫరూక్ షేక్).
బాషు రాజారామ్ పురుషోత్తం జోషి చిన్ననాటి స్నేహితుడు. బాషు రాజారామ్ లాగా ఇంట్రావర్ట్ కాదు. పెద్ద బ్లఫ్ మాస్టర్. వస్తూ వస్తూనే సంధ్యకి లైనేస్తాడు. అప్పటివరకూ తానూ చేసిన ఉద్యోగాల గురించి ఉన్నవీ, లేనివీ కల్పించి ఒక గొప్ప యుఫోరియా సష్టిస్తాడు. తన చేతిలోని తాళాల గుత్తిని చూపించి ''ఇందులో ఒకటి రిజర్వ్ బ్యాంకు తాళం చెవి. ఒకటి నిజాం ఖజానా తాళం చెవి. మరొకటి హేమమాలిని నగల పెట్టెను తెరిచే తాళం చెవి అని ఒక్క క్షణం ఆగి ఇది మాత్రం నా గుండె గుడిని తెరిచే తాళం చెవి'' అంటూ కొంటెగా ఒక నవ్వు రువ్వి సంధ్య మనసులో స్థానం కొట్టేస్తాడు
రాజారామ్ పురుషోత్తం రోజుల తరబడీ చేయలేని పనిని నిమిషాల వ్యవధిలో బాషు చేసేసి రాజారామ్ మనసులో కల్లోలానికి కారణం అవుతాడు. అంతేనా రాజారామ్ పనిచేస్తున్న ఫుట్ ప్రింట్స్ యజమానిని కలుసుకుని తన మాటల చాతుర్యంతో బుట్టలో వేసుకుని రాజారామ్ కంటే పెద్ద వుద్యోగం సంపాదించి రాజారామ్కి బాస్ అయి పోతాడు.
అంతటితో ఆగకుండా రాజారామ్ యజమాని కూతురుకి కూడా లైనేసి ఏక కాలంలో ఒకటి రెండు మూడు ప్రేమాయణాలు నడుపుతూ ఉంటాడు. ఈ కథ ఎక్కడి దాకా వెళ్ళింది?
కుందేలు లాంటి బాషు, తాబేలు లాంటి రాజారామ్ సంధ్య అనే ఒక అమ్మాయి కోసం తమకు తెలియకుండానే ఒక రన్నింగ్ రేస్ మొదలుపెడితే బాషు రేస్ ప్రారంభంలోనే సంధ్య అనే డెస్టినేషన్ చేరుకుంటాడు. మరిక చెప్పడానికి ఏముంది? అంటే చాలా వుంది. ఈ తాబేలు కుందేలు కథలో అనాదిగా తాబేలు గెలుస్తూ వస్తున్నది కదా ఇక్కడ కూడా తాబేలే గెలవడం క్షీర నీర న్యాయం. కనుక రాజారామ్ జోషినే గెలుస్తాడు. ఎలా సంధ్యతో నిశ్చితార్థం నిర్ణయించుకున్నాక ఒక నాటకీయ సన్నివేశంలో బాషు నిజ స్వరూపం బయటపడితే బాషు ఉద్యోగాన్ని కూడా వదిలేసి పరారైపోతాడు. నిశ్చితార్థం వేళ ఒంటరిగా నిలబడిపోయిన సంధ్య పక్కకి రాజారామ్ చేరతాడు. అప్పుడు కూడా సంధ్య రాజారామ్ను అంగీకరించడానికి ఇష్టపడదు. ఎందుకంటే ''నేను బాషుకి చాలా దగ్గరగా వెళ్ళాను. బహుశా నేనిప్పుడు గర్భవతిని'' అంటుంది. రాజారామ్ అయినా ఫరవాలేదు అంటాడు.
ఇలా కథను ఒక తీరం చేర్చి తాబేలును గెలిపించి సాయి పరాంజపే ఎప్పటికైనా నీతి నిజాయితీ గెలుస్తాయి, సహనంతో దేనినైనా సాధించవచ్చు అనే ఒక అనాది నీతి సూత్రానికి పట్టం కట్టింది. నేను ఫస్ట్ క్లాస్ రచయితను, సెంకడ్ క్లాస్ దర్శకుడిని అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్న సాయి పరాంజపే ఈ సినిమాకు ఫస్ట్ క్లాస్ దర్శకత్వాన్ని అందివ్వడం మాట అటుంచితే సంధ్య పాత్రను మలచడంలో ఎక్కడో తడబడినట్టు అనిపిస్తుంది.
ఆ తడబాటే బహుశా మా అబ్బాయిలాంటి కొత్త తరం ప్రేక్షకుడి చేత ''ఎదురుచూపుకి ఉన్నంత విలువ ఆ లభించిన ప్రతిఫలానికి ఉన్నదా?'' అనే ప్రశ్న వేయించిందేమో? ఒక సన్నివేశంలో ''నువ్వెందుకంత సాంప్రదాయకంగా ఉంటావు? ఇది 1982. కాలంతో పాటు మనుషులూ ఎదగాలి. నువ్వు 1982లోకి రా'' అని బాషు అంటే ''నేను లిబేరేటెడ్ ఉమెన్''ని అని సంధ్య అంటుంది. నిజానికి బాషుకి అంత ఇంటిమేట్గా వెళ్లే ముందు సంధ్య రాబోయే పరిణామాలను ఏమాత్రం ఊహించలేని ఒక సాధారణ, మామూలు మధ్యతరగతి అమ్మాయిలాగా కళ్ళు మూసుకుని ఉండటమే ఎందుకో నచ్చలేదు. కానీ ఆ కలయిక కూడా ఆధునిక జీవితంలో భాగమే అని ఇరవై ఏళ్ళ క్రితమే సాయి పరాంజపే అనుకుని ఉంటే చెప్పగలిగింది ఏమీ లేదు.
కథ కంచికి చేరాక కూడా కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటాయి. బాషుకి ఏమైనా జ్ఞానోదయం కలిగిందా? అన్నది మొదటి ప్రశ్న. కానీ అతడికి ఎలాంటి కనువిప్పూ కలగదు అన్నది ప్రేక్షకుడుకి తేలికగానే అర్ధం అవుతుంది. రెండవది ఆ తరువాత అంటే దేర్ ఆఫ్టర్ రాజారామ్ జీవితంలో ఎదురయిన సమస్యలు ఎలాంటివి? నిశ్చితార్ధం నాడు మనసంతా మోసిన ఎమోషన్ను జీవితాంతం అతడు కొనసాగించాడా? సంధ్యకి జీవితంలో ఎప్పుడైనా ఒక గిల్టీ ఫీలింగ్ కదిలిందా? ఈ రెండు ప్రశ్నలలో ఒక దానికి సకారాత్మకమైన, మరొక దానికి నకారాత్మకమైన జవాబు లభిస్తే తాబేలు గెలవడం వలన ప్రయోజనం ఉంటుంది . లేకపోతే కుందేలు తాబేలు కథలో తాబేలు గెలవాలి కనుక గెలిపించినట్టు అనిపిస్తుంది.
నసీరుద్దీన్ షా స్వయంగా చెప్పు కున్నట్టు ఈ సినిమాలో అతడు చేయడానికి ఏమీ లేదు. కానీ ఫరూక్ షా మాత్రం సినిమా మొత్తం వీర విహారం చేస్తాడు. అమితాబ్ మాస్ మసాలా అభిమానులను గెల్చుకుంటే అమోల్ పాలేకర్, ఫరూక్ షేక్ లాంటి నటులు ప్రేక్షక జన హదయాలను గెల్చుకుంటారు అని ఎందుకంటారో ఈ సినిమాలో ఫరూక్ను చూస్తే అర్ధం అవుతుంది. ఎక్కడా కొంచెం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా తూకం వేసినట్టు గ్రేస్గా ఉండటమూ, చలాకీగా మాటల గారడీతో ఆకట్టుకోవడమూ ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకుంటుంది.
సాయిపరాంజపే ఈ సినిమాను ముంబైలోని ఒక మధ్యతరగతి అపార్ట్మెంట్ లోనే చిత్రీకరించింది. సినిమా షూటింగ్కి ఆ అపార్ట్మెంట్ వాసులు అందించిన సహకారానికి కతజ్ఞతగా వాళ్ళకోసం సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించిందట. వాళ్ళు సినిమా చూడటం మానేసి తెర మీద తమ అపార్ట్మెంట్ ఎలా కనిపించింది? ఈ పరిసరం ఎలా తెర మీద వెలిగి పోయింది మాట్లాడుకున్నారు అని సాయి నవ్వుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
మళ్ళీ మొదటికి వస్తే తాబేలు కుందేలు కథ ఇప్పటికీ రేలవెన్స్ ఉందా? వుంటే అది ఎలాంటిది? ఈ ప్రశ్నకి నాకైతే జవాబు దొరకలేదు మా అబ్బాయిలని కొత్తతరం ప్రేక్షకుడు లేదనే అంటున్నాడు.
- వంశీకృష్ణ,
9573427422